27, డిసెంబర్ 2011, మంగళవారం






విషాదాంతమైనా.. వినూత్న జర్నీ


 జర్నీ
తారాగణం: శర్వానంద్, జై, అనన్య, అంజలి తదితరులు
సంగీతం: సత్య.సి
నిర్మాత: సురేష్ కొండేటి
దర్శకత్వం: శరవణన్


శాంతంగా ఉన్న చెరువులో ఓ రాయి విసిరి చూడండి. ‘అల’జడి రేగుతుంది. ఓ చిన్ని నిర్లక్ష్యం కూడా అంతే! చిన్నదే అనుకొంటాం... కానీ ఒక్కోసారి కొన్ని జీవితాన్ని ఛిద్రం చేయొచ్చు. ‘సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి...’ అని నెత్తీనోరు బాదుకున్నా ఈనాటి కుర్రకారు చెవికి ఎక్కడం లేదు. కంటిముందు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా లెక్కచేయడం లేదు. అలాంటివారి ధోరణిలో మార్పు రావాలంటే ఒక్కసారి ‘జర్నీ’ సినిమా చూపించండి. ఈ ఒక్క సందేశంకోసం సినిమా తీసుంటే ఇదో ఆర్ట్ ఫిల్మ్‌గా తయారయ్యేది. ఎక్కడా నీతి బోధ చేయకుండా, సందేశాలు గుప్పించకుండా... తన ధోరణిలోనే సన్నివేశం తరవాత సన్నివేశం పేర్చుకొన్నాడు దర్శకుడు.
కథలోకి వెళ్తే... ఇది రెండు జంటల ప్రేమ ప్రయాణం. విజయవాడలో ఒక కథ. హైదరాబాద్ జంటది మరో కథ. ఎదిరింట్లో ఉన్న పొడవు జడల అమ్మాయి మధుమతి (అంజలి)ని దూరంనుంచే ఆరాధిస్తాడు కృష్ణకాంత్ (జై). ఆరు నెలల తరవాత అటునుంచి సిగ్నల్ వస్తుంది. మధు ఏ విషయమైనా చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంది. పెళ్లైన తరవాత ఎన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో కృష్ణకి అనుభవ పూర్వకంగా తెలియజేస్తుంది. హెచ్.ఐ.వీ. టెస్ట్ చేయించడంతో సహా. కృష్ణ తన ప్రియురాల్ని తల్లిదండ్రుల్ని పరిచయం చేయడానికి మధుమతితో కలిసి విజయవాడ బస్సు ఎక్కుతాడు. మరోవైపు ఉద్యోగంకోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంది అమృత (అనన్య). ఇక్కడ అక్క తప్ప మరెవ్వరూ తెలీదు. తనేమో వేరే పనిమీద అమృతను కలుసుకోవడానికి బస్టాండ్ దగ్గరకు రాలేకపోతుంది. దాంతో గౌతమ్ (శర్వానంద్) సహాయం కోరుతుంది. గౌతమ్ తన ఆఫీసుకి డుమ్మాకొట్టి మరీ... అమృతని ఇంటర్వ్యూ జరిగే చోటికి తీసుకెళ్తాడు. ఈ ప్రయాణం కూడా సరదా సంగతులతో గడిచిపోతుంది. అంతే... అమృతలో ఆరాధన భావం మొదలవుతుంది. విజయవాడ వెళ్లిపోయినా మనసంతా గౌతమ్ ఆలోచనలే. దాంతో మళ్లీ అతన్ని వెతుక్కుంటూ హైదరాబాద్ బస్సు ఎక్కుతుంది. గౌతమ్ పరిస్థితి కూడా అంతే. విజయవాడలో ఆమె ఆచూకీ తీయాలని కృష్ణ-మధుమతిలతోపాటే ప్రయాణం చేస్తాడు. ఇంతకీ ఈ రెండు జంటల కథ ఏ తీరానికి చేరిందో తెలియాలంటే పతాక సన్నివేశాల వరకూ ఓపిక పట్టాల్సిందే.
రెండు జంటల ప్రేమ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకొన్న నేపథ్యాలు పరస్పరం వైవిధ్యంగా తెలుగు దర్శకుల ఆలోచనలకు దూరంగా ఉండడంతో... మనవాళ్లకి కొత్తగా అనిపించాయి. తెరమీద నటీనటులకన్నా నాలుగు వింత పాత్రలు దర్శనమివ్వడంతో కథలోకి ప్రేక్షకుడు తేలిగ్గా లీనమైపోతాడు. వారితోపాటు తానుకూడా ప్రయాణం మొదలుపెడతాడు. సన్నివేశాలన్నీ సహజంగా... నటీనటుల ప్రతిభ అందుకు అనుగుణంగా ఉంది. శర్వానంద్ అలవాటు ప్రకారం అల్లుకుపోయాడు. మిగతా పాత్రల్లో అంజలికి ఎక్కువ మార్కులు పడతాయి. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా, ఇంకొన్నిసార్లు ముదురు పిల్లలా ఆమె హావభావాలు చాలా బాగా నప్పాయి. నిజం చెప్పాలంటే ఇదో డాక్యుమెంటరీకి సరిపడే కథావస్తువు. రెండు నిమిషాల్లో చెప్పేయొచ్చు. రెండున్నర గంటల సినిమాగా నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ సినిమా చూస్తే బస్సు ప్రయాణంలో ఇంత డ్రామా ఉంటుందా? ఇన్ని పాత్రల్ని సృష్టించొచ్చా? ఇన్ని కథల్ని నడిపించొచ్చా? అనిపిస్తుంది. ఇది కచ్చితంగా దర్శకుడి సినిమానే. సినిమా మొత్తంలో అనవసరం అనిపించే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. పాటలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళ్లాయో తెలీదు. మితిమీరిన మెలోడ్రామా, అనవసరంగా పాత్రలు వచ్చిపడిపోవడాలూ ఎక్కడా కనిపించవు. అందుకే ఈ జర్నీ... కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మిగతా సాంకేతిక నిపుణుల ప్రతిభనూ తక్కువ అంచనా వేయలేం. రద్దీలో, జన సమూహంమధ్య, రోడ్లమీద సన్నివేశాలన్నీ సహజంగా వచ్చాయంటే అదంతా ఛాయాగ్రహకుడి ప్రతిభే. ముఖ్యంగా ప్రమాద ఘట్టాలను బాగా తెరకెక్కించారు. సంగీతం కూడా బాగుంది. తెలుగు పాటల్లో తెలుగు వినిపించని ఈ తరుణంలో... అనువాద చిత్రంలోని ప్రతీ పాటలోని ప్రతి పదం చెవులకు తీయగా సోకింది. డబ్బింగ్ విషయంలో తెలుగు నిర్మాత నాణ్యతను పాటించారన్న విషయం ప్రతి సన్నివేశం గుర్తుచేస్తూనే ఉంటుంది. ‘గోవిందా, గోవిందా సిటీలో కొత్త పిల్ల..’ పాట హుషారుగా సాగిపోతుంది. క్లైమాక్స్‌ని కన్నీళ్లతో ముంచడం తమిళ దర్శకులకు అలవాటు. అక్కడి ప్రేక్షకులకు కూడా ఆ ధోరణే నచ్చుతుంది. అందుకే ఈ ‘జర్నీ’కూడా విషాదాంతం చేశారు. గుండె బరువుచేసుకొని థియేటర్ బయటకు వెళ్లడానికి మన ప్రేక్షకులు ఇష్టపడరు. కచ్చితంగా శుభం కార్డులో నవ్వులు చూడాల్సిందే. అందుకు విరుద్ధంగా చూపించడం... మనవారికి ఎంతవరకూ ఎక్కుతుందో మరి?! ఏదేమైనా ఈ సినిమా చూసిన తరవాత బస్సు ప్రయాణాలంటే భయపడతారు... డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడాలంటే ఒణికిపోతారు. ఆ ప్రభావం కలకాలం ఉంటే ఈ సినిమా ఉద్దేశం నెరవేరినట్టే.
ఉపసంహారం: డబ్బింగ్ సినిమాలొచ్చేస్తున్నాయ్. మన కొంపలు ముంచేస్తున్నాయ్ అని తెలుగు నిర్మాతలు, టాలీవుడ్ శ్రేయోభిలాషులు తెగ గాభరా పడిపోతున్నారు. అవొస్తున్నాయ్ కాబట్టే కథల అల్లికలో మన దర్శకులు ఎంత దూరంలో ఉంటున్నారో అర్థమవుతుంది. అవి వస్తున్నాయ్ కాబట్టే... కొత్తతరహా సినిమాలు చూసే అవకాశం మన ప్రేక్షకులకు దక్కుతుంది. ఇప్పటికైనా ఆడిపోసుకోవడం ఆపేసి, మంచి కథలతో సినిమాలు తీస్తే మంచిదనే విషయం గమనించుకొంటే మంచిది. - ఎ.ఎన్, December 22nd, 2011,Courtecy:Andhra Bhoomi

‘శక్తి’ తక్కువ ‘దూకుడు’ ఎక్కువ


సంక్రాంతి పండుగతో ఏటా సినిమాల సీజన్‌కు తెర లేస్తుంది. సమ్మెలు, బంద్‌ల కారణంగా ఈ ఏడాది సంక్రాంతి దగ్గర సరైన సినిమాలేం రాలేదు. ‘పరమవీరచక్ర’, ‘మిరపకాయ్’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అనగనగా ఓ ధీరుడు’ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరో బెబ్బులిపులి అంటూ విడుదలకు ముందు గాండ్రించిన పరమవీరచక్ర... పిల్లిలా కుదేలైపోయింది. దాసరి నారాయణరావు-బాలకృష్ణల కలయిక కాసుల వర్షం కురిపించలేదు సరికదా... థియేటర్‌లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. ‘మిరపకాయ్’లో రవితేజ ప్రయోగాల జోలికి పోకుండా తనకు అచ్చొచ్చిన మాస్ మసాలా కథే ఎంచుకున్నారు. దాంతో గట్టెక్కేశారు. గొప్ప కథ కాకపోయినా, సినిమాలో ఊహించని మలుపులూ లేకపోయినా ఈ సినిమా ఆడిందంటే కారణం. రవితేజ కామెడీ టైమింగే. దాంతోపాటు సంక్రాంతి బరిలో పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడంతో వసూళ్లు బాగానే పిండుకొన్నారు. ‘గోల్కొండ హైస్కూల్’ క్లాస్ టచ్ ఎక్కువై ఆ వర్గానికే పరిమితమైంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్‌తో బ్రహ్మాండం బద్దలుగొడతాం అని బయల్దేరిన ధీరుడు... ఏమాత్రం మెప్పించలేదు. సిద్ధార్థ్ కళ్లకు గంతలు కట్టడం నుంచి సినిమా డ్రాపవుట్ అయిపోయింది.
చిన్నవే మేలు
చిన్న సినిమా తన ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఏడాది కూడా ఆపసోపాలు పడింది. ‘అలా మొదలైంది’. ‘పిల్లజమిందార్’ సినిమాలు చిన్న నిర్మాతలకు కొండంత బలాన్నిచ్చాయి. ముఖ్యంగా నందినిరెడ్డి ‘అలా మొదలైంది’ అంటూ ప్రేక్షకులకు ఓ ప్రేమకథను చూపించారు. నటీనటుల ప్రతిభ, చక్కని సంగీతం, సున్నితమైన భావాల్ని తెర మీద ఆవిష్కరించిన విధానం, కథకు వినోదం అద్దిన తీరు ప్రేక్షకులకు నచ్చాయి. దాంతో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాయికుమార్ తనయుడు ఆదిని కూడా ప్రేక్షకులు ఆశీర్వదించారు. ‘ప్రేమకావాలి’ పాస్ మార్కులు దక్కించుకుంది. కథ డిమాండ్ చేసిన దానికంటె, హీరో సామర్థ్యం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్టు కనిపించింది. దానికి తగినట్టు ప్రచారం కూడా భారీ ఎత్తున చేశారు. కొత్త ఆలోచనలతో తీసిన ‘ఎల్బీడబ్ల్యు’ విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంది. ప్రేక్షకుల్ని పదిహేను రోజుల ముందే ఏప్రిల్ ఫూల్స్‌గా మార్చారు రాంగోపాల్‌వర్మ. ఐదు రోజుల్లో సినిమా తీసి భళా అనిపించారు. తీరా బొమ్మ చూస్తే ఆ సినిమాకి ఒకరోజు కూడా ఎక్కువే అనిపించింది. అదే ‘దొంగలముఠా’. ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 19 నుంచి థియేటర్లో ఒక్కరంటే ఒక్కరూ కనిపించలేదు.
పెట్టుబడికి మించిన డబ్బులు ఒక్కరోజులోనే రాబట్టుకొన్నా, వర్మ ట్రిక్కుల్ని విమర్శించినవారే ఎక్కువ. ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’తో చేసిన ప్రయత్నం కూడా ఘోరంగా బెడిసికొట్టింది. ఇక లాభం లేదని బెజవాడలో మరోసారి తనకు అలవాటైన రక్తచరిత్ర సృష్టిద్దామనుకొంటే... ఆ సినిమా ఓ మురికివాడలా తయారైంది. సినిమాలో విషయం ఉండాలంతే. ప్రచారాలకు ప్రేక్షకులు పడిపోరు అనే నిజాన్ని ఈ సినిమాల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. తెలుగు చిత్రపరిశ్రమలో మినిమం గ్యారెంటీ ట్యాగు సంపాదించుకొన్న హీరోలు ఇద్దరున్నారు. ఒకరు రవితేజ, ఇంకొకరు అల్లరి నరేష్. వీరిద్దరికి ఈసారి మిశ్రమ ఫలితాలే వచ్చాయి. రవితేజ ‘మిరపకాయ్తో తన ఫార్ములా కరెక్టే అని నిరూపించుకొన్నా... ‘దొంగలముఠా’, ‘వీర’ సినిమాలతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నరేష్ పరిస్థితీ అంతే. ‘అహనా పెళ్లంట’ ఒక్కటే ఈ ఏడాది చెప్పుకోదగిన సినిమా. ‘సీమ టపాకాయ్’, ‘మడతకాజా’, ‘సంఘర్షణ’ సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకోవలసి వచ్చింది.
అంచనాలు ముంచాయి
ఎన్టీఆర్, గోపీచంద్, పవన్‌కల్యాణ్‌లకు ఈ ఏడాది ఒక్క హిట్టూ దక్కలేదు. ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ‘శక్తి’, ‘ఊసరవెల్లి’ రెండూ భారీ అంచనాలతో వచ్చినవే. ఆ అంచనాలే ఈ సినిమాల కొంప ముంచా యి. ‘శక్తి’లో హంగూ ఆర్భాటం తప్ప విషయం లేకపోవడంతో తేలిపోయింది. ‘ఊసరవెల్లి’ తొలిరోజు వసూళ్లు అదరగొట్టినా... ఆ ఊపు కొనసాగించలేకపోయింది. ఎన్టీఆర్ పాత్ర చిత్రణలో లోపాలు ఈ సినిమాకి శాపంలా తోచింది. గోపీచంద్ ‘వాంటెడ్’, ‘మొగుడు’ సినిమాలతో జనం ముందుకొచ్చారు. దర్శకుడి వైఫల్యంతో ‘వాంటెడ్’ బోర్లా పడింది. కథలో కొత్తదనం లేకపోవడంతో ‘మొగుడు’ ఆకట్టుకోలేదు. ఇక పవన్‌కల్యాణ్ సినిమాలు ‘తీన్‌మార్’ ‘పంజా’ సినిమాలు ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. కథల విషయంలో పవన్ జడ్జిమెంట్ ఏమైపోయింది? అనే విషయం అభిమానులకు అర్థం కావడం లేదు. నాగచైతన్యకు ‘100% లవ్’ ఒక్కటే ఊరట నిచ్చింది. మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నాలు ‘దడ’, ‘బెజవాడ’ రూపంలో బెడిసికొట్టాయి. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో ప్రభాస్ కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చాడు. ఈ సినిమాపై తొలుత డివైడ్ టాక్ నడిచినా... వసూళ్లు క్రమంగా ఊపందుకొన్నాయి. కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేయడంతో ఈ చిత్రం విజయతీరాలకు చేరగలిగింది.
సూపర్‌హిట్ ఒక్కటే
ఈ ఏడాది రికార్డుల గురించి మాట్లాడుకొన్నది, పాత రికార్డులు సవరించాల్సి వచ్చింది ‘దూకుడు’ సినిమా విషయంలోనే జరిగింది. శ్రీనువైట్ల-మహేష్‌బాబుల మాయాజాలం బాగా పనిచేసింది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ ఈ సినిమాకి బాగా ప్లసయ్యారు. కోన వెంకట్ సృష్టించిన పాత్రల మధ్య ‘దూకుడు’ హంగామా చేసింది. కథ, కథనాల మాట అటుంచితే మహేష్ నటన, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. అగ్ర హీరో సినిమా హిట్‌టాక్ సంపాదించుకొంటే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. అయితే ఏడాదికి ఒక్క సూపర్‌హిట్ సరిపోదు. పరిశ్రమ ఇంకా కోరుకొంటోంది. కాంబినేషన్ పోజులో కొట్టుకుపోకుండా కథలు ఎంచుకోవాలని 2011 మరోసారి రుజువు చేసింది. ఈ అనుభవాలను పాఠాలుగా మలచుకొంటారా? లేదా? అనేది ప్రస్తుతం దర్శకులు, హీరోల చేతుల్లో ఉంది. మరోవైపు 2012 స్వాగతం పలుతోంది. ఓటమి నుంచి ఏం నేర్చుకొన్నారో... వచ్చే ఏడాదే తేలాలి.
--సాహితి, December 22nd, 2011,Courtecy:Andhra Bhoomi

డబ్బింగ్ సినిమాలపై గోల ఏల?

  తెలుగు సినిమా ఉచ్ఛదశకు చేరుకున్న వేళ ఎన్టీఆర్, ఎఎన్నార్,కృష్ణ, శోభన్, చిరంజీవి ఏనాడూ డబ్బింగ్ సినిమాల గురించి భయపడలేదు. శివాజీ గణేశన్ ‘కర్ణ’, ఎంజీఆర్ ‘లోకం చుట్టిన వీరుడు’ తెలుగునాట డబ్బులు చేసుకున్నా అభ్యంతరం చెప్పలేదు. ఇక రజనీ, కమల్ శకం ఆరంభమైన నాటి నుంచీ వారి ప్రతి సినిమా తెలుగులోకి వస్తూనే వున్నాయి. అయినా ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. ఎందుకంటే ఆ రోజు హీరోలుగా వున్న ఎవరికీ ఈ దిశగా ఆలోచించే తీరికే లేకపోయింది. వచ్చిన ప్రతి సినిమా చేయడమే ధ్యేయంగా నడించింది ఆ రోజు. ప్రతి నటుడికి ఏటా అరడజను సినిమాలు తక్కువ కాకుండా వుండేవి. వాటిలో కనీసం సగమన్నా హిట్ కొట్టేవి. దాంతో మరో ఆలోచన, పక్కవాడిపై దృష్టి లేకుండా వుండేది. పైగా ఆ రోజున చిత్రపరిశ్రమ ఎక్కువగా మద్రాసులో వుండేది కాబట్టి, వాళ్ల పంచన వుంటూ, వాళ్ల సినిమాలపై కారాలు మిరియాలు నూరే పరిస్థితి లేకపోయింది.
ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక ఏడాదికి ఒక సినిమా చేయడం గగనంగా వుంది. పోనీ అలా చేసిన సినిమాలేవన్నా నాలుగు వారాల పాటు థియేటర్లలో తిష్టవేసుకుని కూర్చుంటున్నాయా అంటే, బాక్సులు వారానికే తిరుగుటపాలో పుట్టింటికి వచ్చేస్తున్నాయి. మరి రాష్ట్రం అంతటా వున్న థియేటర్లు, వాటిని నమ్ముకున్న కార్మికులు, వ్యాపారస్థులు ఏం కావాలి. అదీ కాక, ప్రతి ఒక్క నిర్మాత పెద్ద హీరోలతోనే సినిమా తీయలేడు. ఆ అవకాశం వారెలాగూ ఇవ్వరు. తమ తమ బంధుబలగమో, ఆశ్రీతులకో తప్ప కాల్షీట్లు అందించరు. ఇక మరి నిర్మాతగా మారాలంటే చిన్న సినిమా లేదా డబ్బింగ్ సినిమానే దిక్కు. చిన్న సినిమాను మార్కెట్ చేసుకోవడం కన్నా, డబ్బింగ్ సినిమాను జనం దగ్గరకు తీసుకెళ్లడం సులువు. పైగా ప్రొడక్టు చూసి కొనుగోలు చేస్తారు కాబట్టి, నిర్మాతకు ఒక రకమైన భరోసా వుంటుంది. ఇన్ని కారణాల రీత్యా తెలుగునాట డబ్బింగ్ సినిమాలకు అన్నివిధాలుగా ఆదరణ కొనసాగుతోంది.
తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పుడెందుకు అకస్మాత్తుగా కోపం వచ్చిందన్నదానిపై కూడా తరచి చూడాల్సివుంది. నువ్వేమన్నా చెయ్..నా బంగారు పుట్టలో వేలు పెడితే మాత్రం ఒప్పుకోను..అన్న చందం మన సినిమా పరిశ్రమది. నిర్మాతగా డబ్బులు పట్టుకురా..హీరోయిన్..కెమేరామెన్, స్టంట్‌మెన్,డైరక్టర్, విలన్, ఇలా ఎన్ని రూపాల్లో ఇరుగుపొరుగవారు వచ్చినా అక్కున చేర్చుకుంటాం..కానీ హీరో వేషాలకు పోటీ తగిల్తే మాత్రం ఎంతమాత్రం సహించం..నిషేధం..నిషేధం అంటూ వీర హడావుడి చేస్తాం..ఇదీ తెలుగు పరిశ్రమ తీరు. పైగా సూర్య, కార్తీ, పృధ్వీరాజ్, షామ్ లాంటి పక్క రాష్ట్రాల హీరోలు, మన జనాల ఆదరణ పొందుతున్నారు. ఇది మన యువ హీరోల భవిష్యత్‌ను కలవరపరిచే అంశంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో అసలే కట్టుబాటుకు మారుపేరుగా నిలిచిన తెలుగుసినీ పరిశ్రమ పెద్దలు నడుంకట్టి, ఏకంగా డబ్బింగ్ సినిమాలపై వేటుకే ముందుకు సాగక తప్పలేదు. నిజానికి మన ప్రేక్షకుల కన్నా సినిమా వాళ్లకే పొరుగింటి పుల్ల కూర అంటే మహా ఇష్టం. పూరి జగన్నాధ్ నేనింతే సినిమాలో పొరుగింటి డైరక్టర్లపై మన హీరోలకు వున్న మోజుపై సెటైర్ వేసిన సంగతి ఇక్కడ గుర్తుతెచ్చుకోవచ్చు. మన హీరోలు పరభాషా దర్శకులకు ఇట్టే అవకాశం ఇస్తారని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తూనే వుంటాయి. పైగా మన సినిమాల్లో హీరోకి దీటైన విలన్ లేదా క్యారెక్టర్ పాత్ర వుంటే వెంటనే ఆది కాస్త హిందీ నుంచో, తమిళం నుంచో వచ్చే నటుడిని వెదుక్కుంటూ వెళ్లిపోతుంది. అక్కడ మళ్లీ ఈ నిషేధం వర్తించదు. అదే అక్కడి హీరోలు ఇక్కడ జనం అభిమానాన్ని సంపాదిస్తే మాత్రం ఓర్చుకోవడం కష్టం. అందుకే బోల్డు పన్నులు వేసేయండి..్థయేటర్ల తలుపులు మూసేయండి..అవసరమైతే జనం కళ్లకు గంతలు కట్టేయండి అని..హూంకరింపులు. కానీ ఇప్పుడు ఇదంత సులువు కాదు. ఇంటర్‌నెట్ యుగంలో ఎవర్నీ ఎవరూ ఆపలేరు. కొలవెరి పాట ఆదరణను అడ్డగలిగారా..దానికి వచ్చిన క్రేజ్‌ను తప్పించగలిగారా? తెలుగు సినిమా పెద్దలు అర్ధం చేసుకోవాల్సింది. తమ తమ తప్పిదాలను. వాటి నుంచి బయటకు వచ్చి జనం మెచ్చే సినిమాలను అందించే మార్గాలను. అంతే కానీ పొరుగు సినిమాలపై అరుపులు కేకలు కాదు. డబ్బింగ్ సినిమాలు వద్దు అంటున్న నిర్మాతలు, హీరోలు మన దర్శకులను వదిలేసి పొరుగు దర్శకుల వెంట ఎందుకు పడుతున్నట్లు? తీరా చేసి ఇటీవల కాలంలో వచ్చిన భయంకరమైన ఫ్లాపుల్లో ఈ తరహా దర్శకుల సినిమాలే ఎక్కువన్న సంగతి గమనించలేదా? మరోచిత్రమేమిటంటే ఇటీవల ఈ జాఢ్యం టీవీ రంగానికి కూడా సోకుంతోంది. డబ్బింగ్ సీరియళ్లను నిషేధించాలనే నినాదం ప్రారంభమైంది. ఇలా చెప్పే ఛానెళ్లు మాత్రం తమ తమ న్యూస్ స్టోరీస్ కోసం విదేశీ ఛానెళ్ల కార్యక్రమాల క్లిప్పింగ్‌లను యధేచ్ఛగా, తమ సొంతం అన్నట్లు వాడేసుకోవడం గమనార్షం. న్యూస్ ఛానెళ్లు, నిత్యం వచ్చే వార్తాపత్రిల్లో వార్తలను, వ్యాసాల అంశాలను తీసుకుని, తమ ఇష్టం వచ్చేసినట్లు వాడేసుకోవచ్చు. అక్కడ మళ్లీ ఏ అభ్యంతరాలూ వుండవు. సృజన అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు. పోటీలో నిలబడ్డాక కావాల్సింది..ప్రతిభా పాటవాలే కాని..ని‘బంధనాలు’ కాదు. ప్రతిభ వున్నపుడు కచ్చితంగా ఎవరన్నా జనం గుర్తిస్తారు.-Courtecy:Andhra Bhoomi,December 15th, 2011

మల్టీస్టారర్ చిత్రాలు పెరిగేనా?

ప్రతి ప్రేక్షకునికి ఇద్దరు అభిమాన నటులుంటారు. వారిద్దరూ కలిసి, ఒకే సినిమాలో నటిస్తే చూడాలని, అన్నివర్గాల ప్రేక్షకులకు వుంటుంది. పాత తరం నటుల్లో దాదాపు అగ్ర హీరోలందరూ కలిసి నటించి, అభిమానుల్ని అలరించారు. కానీ నేటి తరం ప్రేక్షకులకు ఆ కమ్మని అనుభూతి కలగానే మిగిలిపోయింది. ఆరోజుల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు లాంటి అగ్రనటులు ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి నటించి అభిమానుల్ని ఆనందపరిచారు.
ఎందుకో తెలియదు గాని ఈనాటి హీరోలు మల్టీస్టారర్ సినిమాల గురించి ఆలోచించడం లేదు. ఏ నటున్నైనా ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, సరైన కథ దొరికితే, తప్పకుండా కలిసి నటిస్తామని చెబుతుంటారు. సరైన కథలంటే ఏంటో వారికే తెలియాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో చక్కని కథారచయితలు, దర్శకులున్నారు. వీరు ఆ మాత్రం కథల్ని అందించలేరా? ఇప్పుడు ఇక్కడి హీరోలకు కలిసి నటించేందుకు కావాల్సింది కథలు మాత్రమే! సాటి హీరోలతో కలిసి నటించాలన్న అభిలాష లేకపోవడంవల్లనే, మల్టీ స్టారర్ సినిమాలు రావడం లేదు. అప్పట్లో కొనే్నళ్ళపాటు చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడం వలన, ఇక వారి అభిమానుల ఆశ, అడియాసగానే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడైనా స్టార్ ఇమేజ్ వున్న హీరోలు మల్టీ స్టారర్ చిత్రాలపై దృష్టిసారిస్తే మంచిది.
ఇలా నటించడంవలన అభిమాన ప్రేక్షకులకు ఆనందం పంచడమే కాకుండా, పరిశ్రమలో సుహృద్భావ వాతావరణంకోసం కృషిచేసిన వారిగా చెప్పుకోబడతారు.
ఇటీవల అనౌన్స్ అయిన మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులకు కాస్త ఊరటగా అనిపించింది. వెంకటేష్ మహేష్‌బాబుతో కలిసి నటించబోతున్న ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’అనే చిత్రం, రామ్‌చరణ్ తేజ్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న సినిమాలు రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ సినిమాల వాతావరణాన్ని సృష్టిస్తాయని తెలుగు సినీ ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ గోపీచంద్ లాంటి యంగ్ హీరోలు కూడా ఒకరితో ఒకరికి కలిసి నటించాలని వుందన్న విషయాన్ని, బయటపెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, జగపతిబాబు, శ్రీకాంత్, రవితేజ, అల్లరి నరేష్ మొదలైనవారు మల్టీ స్టారర్ సినిమాలకు సై అంటున్నారు.
వీరిలా అందరు హీరోలు ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. కొంతకాలంపాటు హీరోలందరూ భేషజాలు పక్కనపెడితే, సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయి. అప్పుడు మనం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, నాని, గోపీచంద్ వంటి హీరోలు ఒకరితో ఒకరు కలిసి నటిస్తే, చూసి తరిస్తాం. అప్పుడు బాక్స్ ఆఫీసులు కూడా పచ్చనోట్లతో కళకళలాడుతాయి.- వౌనశ్రీ మల్లిక్, December 22nd, 2011,Courtecy:Andhra Bhoomi

మేటనీ షో

మల్లాది మిరియాలు


‘నీతో ప్రేమలో పడటంలో నా తప్పు లేదు’ కార్లా తన పక్కన నగ్నంగా పడుకున్న అలెన్‌తో చెప్పింది.
‘అది నా తప్పా?’ నవ్వుతూ అడిగాడు అలెన్.
‘ఊహు. అది మనిద్దరి తప్పూనూ. ఇందులో ఏ ఒక్కరిదో తప్పు అనడం అన్యాయమే అవుతుంది. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను’
‘నీ భర్త టామ్‌కి మన గురించి తెలుసా?’ అలెన్ అడిగాడు.
‘నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. కాని బయట నీతో గడిపే సమయాన్ని ఆయనకి తృప్తికరంగా వివరించలేక పోతున్నాను. దాంతో టామ్‌లో అసహనం, అనుమానం మొదలయ్యాయి. అంతేకాక ఈ మోటెల్‌కి వచ్చే నన్ను టామ్‌కి తెలిసిన వాళ్లు చూస్తారనే భయం నాలో ఎక్కువ అవుతోంది’
అలెన్ సిగరెట్ యాష్ ట్రేలో ఆర్పేసాడు.
‘అలెన్! నీ భార్య లిజా మన గురించి తెలుసుకుంటుందనే భయం నీకు లేదా?’ కొద్ది క్షణాల తర్వాత కార్లా అడిగింది.
తల అడ్డంగా ఊపి చిన్నగా నవ్వి చెప్పాడు.
‘అదే జరిగితే నీకు తెలుస్తుంది. లిజా నన్ను చంపేసిందని నువ్వు దినపత్రికల్లో చదువుతావు’
‘ఐనా మనం ఛాన్స్ తీసుకుంటూనే ఉండాలి అలెన్. నిజానికి ప్రతీదీ ఛానే్స. అసలు నిత్యం చావకుండా నిద్ర లేవడంలోనే ఛాన్స్ ఉంది. ఐ లవ్ యు అలెన్. టామ్‌కి తెలిస్తే నన్ను వదిలేస్తాడు. నీ మీద ఎంత ఇష్టముంటే, అందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను’
అలెన్ కార్లాని కొద్దిసేపు ముద్దు పెట్టుకున్నాడు.
అలెన్ హాలీవుడ్‌లో గాయకుడు. ఓ టీవీ షోలో అతను పాల్గొన్నపుడు దానికి హాజరైన కార్లా పరిచయమైంది. తన అభిమాని అని గ్రహించి అలెన్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చివరికి అది పక్క మీదకి దారి తీసింది. గత ఆరు నెలలుగా అలెన్, కార్లాలు వారానికి రెండు మూడుసార్లు మధ్యాహ్నాలు ఆ మోటెల్‌లోని ఆ గదిలో గంట- గంటన్నర సేపు కలుస్తున్నారు. అది లాస్‌ఏంజెలెస్‌లోని సన్‌సెట్ బుల్‌వార్డ్‌కి ఐదు నిమిషాల డ్రైవ్ దూరంలో ఉంది.
‘చూస్తూండగానే గంటన్నర ఇట్టే గడిచిపోయింది. నీ సమక్షంలో టైమే తెలీదు అలెన్. నేను ఇక బయలుదేరాలి’
‘మళ్లీ మూడు రోజులకి నా ఒంట్లోని తిక్కని నువ్వు వచ్చి ఇలాగే కుదర్చాలి. అది నీకే సాధ్యం’ నవ్వుతూ చెప్పాడు అలెన్.
‘హాలీవుడ్ వాళ్లు చాలా చెడ్డవాళ్లని, డ్రెస్‌ని మార్చినట్లు అమ్మాయిలను మారుస్తారని విన్నాను. పాపం మీరు మంచివారు. స్నానం చేసి వస్తాను’ కార్లా మెచ్చుకుంది.
‘కలిసి చేద్దామా?’
‘నేను త్వరగా వెళ్లాలి. కలిసి చేస్తే గంట పడుతుంది’ అతని పెదవుల మీద చూపుడు వేలుని నిలువుగా ఉంచి గోముగా చూస్తూ చెప్పింది.
కార్లా మంచం దిగి బాత్‌రూం తలుపు దగ్గరికి వెళ్లి తల తిప్పి అలెన్ వంక చూస్తూ చెప్పింది.
‘రండి. మీ కోరికని ఎందుకు కాదనాలి’
అలెన్ మంచం దిగి నగ్నంగా నిలబడి వున్న ఆమె పక్కకి వచ్చాడు. ఆమె బాత్‌రూం తలుపు తెరిచింది. అలెన్ రెండు చేతులూ అప్రయత్నంగా అతని నోటిని మూసేసాయి. ఎదురుగా కనపడ్డ దృశ్యాన్ని కార్లా తన జీవితంలో మర్చిపోలేదు. కదలిక లేని ఓ పురుషుడి శవం ఎదురుగా బాత్‌రూంలో సగం బాత్ టబ్‌లో, సగం నేల మీదకి పడి ఉంది. తెరచి ఉన్న కళ్లు నిర్జీవంగా చూస్తున్నాయి.
నుదుటి లోంచి లోపలకి దూసుకెళ్లిన బుల్లెట్ గాయం కనిపిస్తోంది. అప్పటికే రక్తం గడ్డకట్టి ఉంది. నల్లటి పంట్లాం, బూడిద రంగు టీ షర్ట్ ధరించిన అతని వయసు ముప్పై - ముప్పై అయిదు మధ్య ఉంటుంది. కార్లా నోట్లోంచి కేక కొద్దిగా బయటకి రాగానే అలెన్ తేరుకుని, తన నోటి మీది చేతులని తీసి ఆమె నోటిని మూసి ఆ కేకని బయటకి రానీకుండా ఆపాడు. తర్వాత కాలితో తలుపుని తన్ని మూసేశాడు.
‘ఒద్దు. అరవకు. ఎవరైనా అరుపుని వింటారు’ అలెన్ చెప్పే మాటలు కార్లాకి నూతి లోంచి వినిపించినట్లుగా వినిపించాయి.
అలెన్ కళ్లు బయటకి తప్పించుకోవాలి అన్నట్లుగా ఆ గదిలోని అన్ని దిక్కుల వంకా చూశాయి. కాని అలాంటి దారి కనపడనట్లుగా నిస్పృహ అతని మొహంలోకి ప్రవేశించింది.
‘ఏం చేయాలి? ఛ! ఎలాంటి పరిస్థితిలో చిక్కుకున్నాం?’ బాధగా చెప్పాడు అలెన్.
ఆమె ఇంకా తేరుకోకపోవడంతో ఆమె మొహం మీద చిన్నగా తట్టాడు.
‘ముందు డ్రెస్ వేసుకో కార్లా. మనం వెంటనే ఇక్కడ్నించి బయలుదేరాలి’ గుసగుస లాడుతున్నట్లుగా చెప్పాడు.
‘అబ్బ! ఎవరతను? ఎంతటి భయంకర దృశ్యం?’ కార్లా ఏడుస్తూ అడిగింది.
‘నే చెప్పేది విను. సెంటిమెంటల్‌గా, బలహీనంగా ఫీలయ్యే సమయం కాదిది. ముందు మనం ఇక్కడ్నించి వెళ్లాలి. భయపడకు’
‘కాని ఈ శవం పోలీసుల కంట పడ్డాక, మనం ఈ గదిని అద్దెకి తీసుకున్నాం అని వాళ్లకి తెలుస్తుంది. కాబట్టి ముందే మనం మోటెల్ మేనేజర్‌కి ఈ శవం గురించి చెప్తే మంచిది కదా?’ కార్లా సూచించింది.
‘పోలీసులకి చెప్పటమా? నీకు పిచ్చెక్కిందా?’
‘అతన్ని ఎవరో హత్య చేశారు అలెన్! నుదుటి మీద కాల్చి చంపారు!’
‘నువ్వు తెలివిహీనురాలివని నాకు తెలుసు కాని మరీ ఇంతని తెలీదు. పోలీసులు వస్తే రేపు ఉదయం మనిద్దరి ఫొటోలు పేపర్లోకి ఎక్కుతాయి. మీ ఆయన, మా ఆవిడ వాటిని చదువుతారు’
‘సరే. నాకన్నా నువ్వు తెలివిగలవాడివి. వెళదాం పద’ అతనికన్నా త్వరగా కార్లా డ్రెస్ చేసుకుంది.
‘కాని ఆగు. మనం ఆ శవాన్ని అలా వదిలి వెళ్లకూడదు. వెళ్తే పోలీసులకి దాని గురించి, మన గురించి తెలుస్తుంది’ అప్పుడే ఆ ఆలోచన వచ్చినట్లుగా చెప్పాడు అలెన్.
‘ఎలా తెలుస్తుంది. దొంగ పేరుతో కదా నువ్వు మోటెల్‌ని తీసుకుంది?’
‘మనం ఈ మోటెల్‌కి ఆర్నెల్లుగా వస్తున్నాం. మన పేర్లు తెలీకపోయినా మన కార్ల నంబర్లు ఇక్కడి సిబ్బందిలో ఎవరికైనా గుర్తుండచ్చు. రంగు, మేక్‌ని చెప్పినా చాలు. పోలీసులు మనల్ని కనుక్కోగలరు’
‘అలెన్. ఐతే మనల్ని పోలీసులు హంతకులుగా అనుమానిస్తారా?’ భయంగా అడిగింది కార్లా.
‘కొద్దిసేపు నోరు మూసుకో. నన్ను ఆలోచించుకోనీ’
తను ఉన్న పరిస్థితికన్నా అతను ప్రదర్శించే తిరస్కార ధోరణి వల్ల ఆమె కళ్లవెంట నీరు కారసాగింది. ఇదివరకు తనో దేవత అనేలా ప్రవర్తించాడు. ఇప్పుడు?
‘అలెన్. నేను వెళ్తాను’ చెప్పింది.
‘కదలక. ఇందులో మనం ఇద్దరం ఇన్‌వాల్వ్ అయి ఉన్నాం. బాధ్యతని నా ఒక్కడి మీదే వేసి ఎలా వెళ్తావు?’
‘కాని నేను వెళ్లాలి. హత్య కేసులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. నువ్వే దీన్ని హేండిల్ చెయ్యి’
‘చీకటి పడేదాకా ఆగు. నేనొక్కడ్నే ఈ శవాన్ని కారులోకి మోసుకు వెళ్లలేను. ఈ శవాన్ని ఇద్దరం కలిసి మాయం చేస్తే కొంత ప్రమాదం తప్పుతుంది. నా పేరు ఇందులో ఇన్‌వాల్వ్ అయితే ఇక నాకు హాలీవుడ్‌లో పని దొరకదు’
‘ఇది ఈ గదిలో మన ముందు దిగిన వారి పని అయి ఉంటుంది. మనం వెళ్లి మేనేజర్‌కి ఈ సంగతి ఫిర్యాదు చేస్తే అప్పుడు మన నిజాయితీ ప్రపంచానికి తెలుస్తుంది’
‘నీ అంత మందమతిని ఇంతదాకా నేను చూడలేదు. అతను వెంటనే పోలీసులని పిలుస్తాడు. వాళ్లు మనం చెప్పేది నమ్ముతారని హామీ లేదు. మన ఇద్దర్నీ అనుమానం మీద అరెస్ట్ చేయచ్చు. ఛ! వీడు ఈ గదిలోనే చావాలా?’ తత్తరపడుతూ అలెన్ చెప్పాడు.
‘అలెన్. నేను వెళ్తున్నాను. టామ్ వచ్చేలోగానే మా ఇంటికి చేరుకుని నేను వంట పూర్తి చేయాలి’
‘ఆగు. బాధ్యత అంతా నా మీద వేసి తప్పించుకోవాలని చూడకు. మనిద్దరం ఇందులో భాగస్వాములం. ఒంటరిగా నేను గదిని అద్దెకి తీసుకున్నానని పోలీసులకి చెప్తే వీడ్ని చంపడానికే అనుకుంటారు. నీ కోసం తీసుకుంటే ఆ అనుమానం బలహీనపడచ్చు’
కార్లాకి తను ఓ జైలు గదిలో చిక్కుకున్నట్లుగా అనిపించింది.
‘దయచేసి నన్ను ఇందులో ఇరికించకు’ అతన్ని ప్రార్థించింది.
‘నాకు అనుమానం వస్తోంది. నీకు నాలా ఇంకెందరితో సంబంధం ఉంది? వారిలో ఓ ప్రియుడు అసూయతో ఈ పని చేసి ఉంటాడు అవును. నాకది నిజం అనిపిస్తోంది’
కార్లా తల అడ్డంగా ఊపుతూ చెప్పింది.
‘ఎంత అసహ్యంగా ఆలోచిస్తున్నావు? నేను వెళ్లాలి’
‘ఈ పని చేసిన నీ ఇంకో ప్రియుడు ఎవరో ఆలోచించు. రాజకీయ నాయకుడా? గూండానా? పోలీస్ ఆఫీసరా?’
‘అలెన్! నన్ను అవమానించక’
‘నీ రహస్య ప్రియుడికి ఫోన్ చేసి నాకంతా తెలిసిందని, ఇందులోంచి బయట పడేయమని, లేదా అతని పేరు, హత్యకి కారణం బహిర్గతం చేస్తామని బెదిరించు’
‘అలెన్?!’
‘అదొక్కటే పరిష్కారం. సరైన పరిష్కారం’
‘నీ ఊహలన్నీ అబద్ధాలు. నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే నా పేరు ఇందులో ఇన్‌వాల్వ్ చేయకు అలెన్. నేను వెళ్తున్నాను’
గుమ్మం దగ్గరకి వెళ్లింది కార్లా.
‘ఆగు. నువ్వు నన్ను ఈ శవంతో వదిలి వెళ్తే ఇక ఈ జన్మలో నీ మొహం చూడను’ హెచ్చరించాడు అలెన్.
‘అలాగే’
‘నాకెప్పుడూ ఇక నువ్వు ఫోన్ చేయకు. నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయకు. నువ్వు ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయను’ మళ్లీ అరిచాడు అలెన్.
‘ఓకే. ఫోన్ చేయను. ప్రామిస్’ అతని వంక కోపంగా చూస్తూ చెప్పింది.
కార్లా తలుపు తెరచుకుని బయటకి వెళ్లిపోయింది. అలెన్ కిటికీలోంచి ఆమె కారు ఎక్కి వెళ్లడం చూశాడు. తర్వాత బయటకు వెళ్లి తన కారు డిక్కీ తలుపుని తెరిచాడు. మళ్లీ లోపలకి వచ్చి తన కోటుని విప్పి బాత్‌రూంలోని ఆ శవానికి దాన్ని చుడుతూ చెప్పాడు.
‘గుల్ ఓల్డ్ జార్జ్! మరోసారి మనదే విజయం. ఆమెని ఎప్పటిలా తేలిగ్గా వదిలించుకున్నాను. ఇక ఈ మోటెల్‌కి కొత్త పిట్ట వస్తుంది. నిన్ను మళ్లీ జాగ్రత్తగా స్టూడియోలోని ప్రాపర్టీస్ డిపార్ట్‌మెంట్‌లో అప్పగించాలి’
అలెన్ షూటింగ్స్‌లో వాడే అచ్చం మనిషిలా కనిపించే, మైనంతో చేసిన ఆ బొమ్మని మంచం కింద దాచిన అట్టపెట్టెలో పెట్టి బయటకు తీసుకెళ్లాడు.
* (రుత్ విస్‌మేన్ కథకి స్వేచ్ఛానువాదం)--మల్లాది వెంకట కృష్ణమూర్తి
December 25th, 2011,Courtecy: Andhra Bhoomi

పర్యాటకం ---- గైరేంజర్ ఫజోర్డ్


నార్వేలోని చూడదగ్గ ప్రదేశాలలో గైరేంజర్ ఫజోర్డ్ ఒకటి ప్రకృతిని ప్రేమించేవారికి ఇది చాలా నచ్చుతుంది. ఎతె్తైన పర్వతాల మీంచి పడే జలపాతాలు, పిల్ల కాలువలు, తెల్లటి మంచు శిఖరాలు, ఆకుపచ్చటి చెట్లు, పర్వతాల మీద కారులో వెళ్లడానికి సన్నటి మలుపులు తిరిగే రోడ్లు. అక్కడి వారి ఆతిథ్యం పర్యాటకుల మనసులని దోస్తాయి.
ఇక్కడి ముఖ్యమైన మూడు జలపాతాలు - ది సెవెన్ సిస్టర్స్, ది సూటర్, ది బ్రైడిల్ వీల్డ్ - ఎతె్తైన శిఖరాల మీంచి కిందికి పడుతూ కన్నుల విందు చేస్తాయి. ఇవేకాక చిన్నచిన్న జలపాతాలు కూడా అనేకం ఇక్కడ ఉన్నాయి. ఈ జలపాతాల వల్ల సృష్టించబడే ఇంద్రధనస్సు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేలా చాలామంది యాత్రికులు ఫొటోలు తీసుకుంటారు.
గైరేంజర్ ఫజోర్డ్‌కి క్రూయిజ్‌లో వెళ్లాలి. ఏటా 130 క్రూయిజ్‌లు యాత్రికులతో ఇక్కడికి వస్తూంటాయి. కయాకింగ్ జలక్రీడకి ఈ ప్రాంతం ప్రసిద్ధి. పర్వతాలలో నడవడానికి వేసిన బాటల్లో నడుస్తూ పిక్చర్ పోస్ట్‌కార్డ్ లాంటి దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. ఇక్కడి అత్యంత ఎత్తయిన కొండ శిఖరం మీదకి వేసిన రోడ్డు పేరు ఈగిల్ రోడ్డు. పదకొండు హెయిర్ పిన్ బెండ్స్ (ఇరుకైన మలుపులు) గల ఈ రోడ్డుకి ఆ పేరు రావడానికి గల కారణం, ఆ శిఖరం మీద గద్దలు నివాసం ఉండటమే. సముద్రమట్టానికి 620 అడుగుల ఎత్తుకి ఈ రోడ్డు సాగుతుంది. అనుభవజ్ఞులైన డ్రైవర్లు నడిపే వాహనాలలో అక్కడికి వెళ్లి రావడం ఓ మధురమైన అనుభవం.
సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తునగల డాల్‌సినిబ్బ అనే వ్యూ పాయింట్, అలాంటిదే మరొకటి అయిన ఫ్లైడాల్ జువెక్ వ్యూపాయింట్ నించి చూస్తే చాలా మైళ్ల దూరం అందంగా కనిపిస్తుంది.
గైరేంజర్ ఫజోర్డ్‌లో ఓ మ్యూజియం ఉంది. ఈ ప్రాంతపు చరిత్ర, ఇక్కడి మనుషుల రంగురంగుల దుస్తులు, అనేక ప్రకృతి దృశ్యాల ఫొటోలు గల ఇది గైరేంజర్ కేంద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ మ్యూజియం ఉంది. హైకింగ్, ట్రెక్కింగ్ చేసేవారి సౌకర్యార్థం కొండదారులు మేప్‌లు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడికి వచ్చిన వారు ఈ రెంటిలో కనీసం ఒక్కటైనా చేయకుండా వెళ్లరు.
గైరేంజర్ కేంద్రం నించి నాలుగు కిలోమీటర్ల దూరంలో వెస్ట్రాస్ ఫాంకి చేరుకుని అక్కడి ‘స్టోర్ సెటర్ ఫోసెస్ వాటర్ ఫాల్’ని చూడొచ్చు. పడవలు, సైకిళ్లు, కార్లు ఇక్కడ అద్దెకి దొరుకుతాయి. పిషింగ్ అంటే ఆసక్తిగల వారు లైసెన్స్ పొంది చేపలు పట్టవచ్చు.
హెర్డల్ సెట్రావౌంటెయిన్ ఫాం మరో చూడదగ్గ ప్రదేశం. మేకలని పెంచే ఈ ఫాంలో ఛీజ్, కేరమిల్స్ తయారుచేసే పద్ధతులని చూడచ్చు. అనేక మేకలు, గొర్రెలు, ఆవులని కూడా చూడొచ్చు.
ట్రాల్ స్ట్రైజెన్ వౌంటెన్ రోడ్ నార్వేలోని ఓ నాటకీయమైన రోడ్డుగా చెప్పచ్చు. ట్రాల్ స్ట్రైజెన్ పర్వతం చుట్టూ నిర్మించిన ఈ రోడ్డు మీద ప్రయాణం మంచి అనుభవాన్ని కలిగిస్తుంది. ఇక్కడి వెల్లడోలా నది రేఫ్టింగ్‌కి అనుకూలం. చలికాలంలో 1500 మీటర్ల ఎత్తు నించి కిందకి స్కేయింగ్ చేయడానికి శాండ్రా పైలెట్ స్కై సెంటర్‌ని ఉపయోగిస్తారు. యూరప్‌లో వేసవిలో ఎక్కడా మంచు కనపడదు. కానీ ఇక్కడి స్ప్రైన్ సమ్మర్ స్కీయింగ్ సెంటర్‌లో (గైరేంజర్‌కి 50 కిలోమీటర్ల దూరంలో) సదా మంచు ఉంటుంది. కాబట్టి ఇక్కడ 365 రోజులూ స్కీయింగ్ చేయ్యొచ్చు.
ఫజోర్డ్ అంటే ఇంగ్లీష్‌లో ఎతె్తైన కొండల మధ్యకి సముద్రంలోంచి ప్రవహించే సన్నటి పొడవైన కాలువ వల్ల ఏర్పడే గ్లేసియర్ అని అర్థం. ఇలాంటివి ఇక్కడ చాలా చూడచ్చు. ఈ ప్రదేశం మొత్తం అంటే 500 చ.కి.మీ. మేర 2005 యుఎన్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.
చేపల చెరువులు, ప్రోజెన్ పీజా, మాంసం, స్ట్రాబెర్రీ ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు. 1869లో బ్రిటీషర్స్ వల్ల ఇది టూరిస్ట్ కేంద్రంగా మారింది. ప్రతి వేసవిలో 6 లక్షల మంది ఇక్కడ పర్యటిస్తారు. కానీ దీని జనాభా 1760 మాత్రమే.
-ఆశ్లేష, December 25th, 2011,Courtecy:Andhra Bhoomi

అంతరిక్ష విజయాలు


అంతరిక్ష రంగంలో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సాధించారు. ఇంకా సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోవియట్ పతనానంతరం అంతరిక్ష రంగంలో అమెరికా ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. అంగారక గ్రహాన్ని శోధించే ప్రయత్నంలో ‘నాసా’ కొంత నష్టపోయినా విశ్వశోధనను మరింత ముమ్మరం చేసింది.
సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై దృష్టి సారించాలనేది నాసా లక్ష్యం. అంగారకుడు, బృహస్పతి, శనిగ్రహాల ఉపగ్రహాలపై గతంలోగాని, ఇప్పుడు గాని ప్రాణులున్నాయా? అన్న అంశంపై పరిశోధనలు నిర్వహించనున్నారు.
భూమి నుండి 4.9 కోట్ల మైళ్ల దూరంలోని అంగారక గ్రహానికి 2050 నాటికి వ్యోమగాములు చేరుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే బృహస్పతి చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలు, నెప్ట్యూన్, శని, శుక్రుడు, బుధుడు, యురేనస్‌ల గురించిన పరిశోధనలు ఊపందుకున్నాయి.
1990లో నింగి కెగిరిన ‘యులిసెస్’ సూర్యుడి గురించిన సమాచారం పంపే ప్రయత్నంలో ఉంది. 1969లో నీల్‌ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్వి ఆల్‌డ్రిన్‌లు చంద్రునిపై కాలు మోపిన తొలి వ్యోమగాములు. 1977లో నాసా ప్రయోగించిన సోజర్నర్ బుధగ్రహంపై చేరుకోవడంతో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.
1975 ఏప్రిల్ 19న భారతదేశం తొలి ఉపగ్రహం ఆర్యభట్టును ప్రయోగించింది. 1984 ఏప్రిల్ 3న తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేశాడు. అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు మనకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి.
అంతరిక్ష రంగంలోని ఆవిష్కరణల వల్ల గ్రహాలు, ఉపగ్రహాల వివరాలు, స్పేస్ స్టేషన్లలో పరిశోధనల మూలంగా విశ్వం స్వరూపం విస్పష్టంగా సాక్షాత్కరించింది. చంద్రునిపై ఆవాసాలు ఏర్పరచుకునేందుకు, అంతరిక్షంలో హోటళ్లు నిర్మించేందుకు పరిశోధనలు ముమ్మరమయ్యాయి.
అంతరిక్షంలో వివిధ రూపాల్లో పేరుకుపోయే చెత్తాచెదారాన్ని తొలగించడం ప్రపంచ దేశాలకు పెద్ద తలనొప్పే. బ్రిటీష్ పరిశోధకులు దీనికి పరిష్కారం కనుగొన్నారు. అంతరిక్షంలోని చెత్తను తొలగించే సూక్ష్మ ఉపగ్రహాలను రూపొందించారు.
అంతరిక్షంలో గల వ్యర్థాలు భూమి చుట్టూ పరిభ్రమించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. ఉదాహరణకు గంటకు 18 వేల మైళ్ల వేగంతో తిరుగాడే చిన్న బోల్టు ఉపగ్రహాలను ఢీకొడితే గంటకు 70 మైళ్లు వేగంతో పయనించే లారీ ఢీకొంటే కలిగేటంత నష్టం వాటిల్లుతుంది.
భూమి మీద జీవరాశి పుట్టుకకు అంతరిక్షంలోనే బీజం పడిందన్న సిద్ధాంతాన్ని సమర్థించే సాక్ష్యాధారాలు లభించాయి. అంగారక గ్రహానికి బహు దూరంలో ఇవి దొరికాయి.
భూమికి 15 కోట్ల మైళ్ల దూరంలో అంతరిక్షంలో తిరుగాడుతున్న సంక్లిష్ట కర్బనాధార అణువులను అంతరిక్ష నౌక కనుగొంది. ‘స్టార్‌డస్ట్’ అనే అంతరిక్ష నౌక సేకరించిన ధూళికి సంబంధించిన వివరాలు పరిశీలించిన ఖగోళ శాస్తవ్రేత్తలు అంతరిక్షంలోంచి వచ్చిన పదార్థమే పుడమిపై జీవరాశి ఆవిర్భవించడానికి కారణమని అంటున్నారు.
అంతరిక్ష నౌకలో ధూళిని సేకరించే పరికరం, విశే్లషించే విభాగం ఉన్నాయి. అంతరిక్ష నౌక సేకరించిన రేణువుల పరిమాణం నీటి అణువుల కన్నా వంద రెట్లు ఎక్కువ. వీటిని పాలిమెరిక్ హెటిరో సైక్లిక్ ఆరోమేటిక్ సమ్మేళనాలుగా గుర్తించారు.
బొగ్గు, తారులోని అణువులతో వీటి రసాయన ఫార్ములా పోలి ఉంటాయి. ఈ అణువులు భూమి మీద పడినపుడు జీవరాశి పుట్టుక ప్రథమ పదార్థమయిన ‘ప్రైమార్డియల్ సూప్’ ఏర్పడిందని పరిశోధకులు వివరిస్తున్నారు.
అంతరిక్షంలో చిన్నచిన్న గాయాలు కూడా సరిగా మానవు. వ్యోమగాములను ఇబ్బంది పెట్టే అంశం ఇది. కాంతితో గాయాలు మాన్పడానికి నాసా చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి.
గాయాలు త్వరగా మానకపోవడానికి, జీవకణంలో శక్తి కేంద్రమైన ‘మైటోకాండ్రియా’ అంతరిక్షంలో ‘జీరోగ్రావిటీ’ వల్ల సమర్థవంతంగా పనిచేయకపోవడమే కారణం.
గాయాలు మానేందుకు ‘ఫైబ్రోబ్లాస్ట్’లనే కణాలు తోడ్పడతాయి. వీటిలోని ‘మైటోకాండ్రియా’ సరిగ్గా పనిచేయక పోవడం వల్ల ఆ కణాల వృద్ధి సాధ్యం కాదు. అరుణ, పరారుణ కిరణాలను ప్రసరింపజేసి మైటోకాండ్రియా పని సామర్థ్యం పెంచి గాయాలను త్వరగా నయం చేయవచ్చు. అయితే ఈ కిరణాలను ఎలా ఉత్పత్తి చెయ్యాలనేది ప్రస్తుత సమస్య. దీనికి పరిష్కారంగా ఒక పరికరాన్ని రూపొందించారు.
అంతరిక్షంలో రేడియో ధార్మిక శక్తికి గురిచేసిన విత్తనాలతో చైనా పరిశోధకులు మరింత లాభదాయకమైన మొక్కలను సృష్టించారు. ఇవి తక్కువ సమయంలో అంకురించే కొత్త విత్తనాలు. వీటి నుండి పుట్టిన మొక్కల వేళ్లు బలంగా ఉంటాయి.
        -Courtecy: Andhra Bhoomi, December 25th, 2011

జలకాలాడే జీవితం


శ్చిమ ఆఫ్రికాలోని చిన్న పల్లెటూరు జెన్వీ. కోటోనౌ రాజధానికి కూతవేటు దూరం. అక్కడి ‘నోకౌ’ సరస్సు పర్యాటకులను విశేషంగా ఆకర్షించటానికి ప్రత్యేక కారణం - అక్కడి పక్షులూ - నీలాకాశం.. సరస్సు సోయగం కాదు.. జెన్వీ పల్లె ఈ సరస్సుపైనే ఉంది మరి. ఇక్కడి జనాభా 20వేల మంది. అడుగు తీసి అడుగు వేయటం అంతా నీటిపైనే. సుమారు 4వందల ఏళ్ల క్రితం ‘టిఫిను’ తెగవారు ఈ సరస్సుపై స్థిర నివాసాలు ఏర్పరచుకోటానికి కారణం తమని తాము శత్రువుల నుంచీ రక్షించుకోవటానికే. ‘్ఫన్’ తెగలకూ ‘టిఫిను’ తెగలకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తరచూ కొట్లాటలూ జరిగేవి. ఎంతోమంది మరణించారు. ఇంకొంతమంది గాయపడ్డారు. యుద్ధాలతో విసిగి వేసారిన ‘టిఫిను’ తెగ పెద్దలు ఆలోచించి ‘్ఫన్’ తెగల్లో ఉన్న సంప్రదాయ కట్టుబాటు (నీటిలో ఈత కొట్టకూడదన్నది వారి కట్టుబాటు)ని ఆధారం చేసుకొని ఈ సరస్సులో నాలుగు వందల ఏళ్లుగా నివాసముంటున్నారు.
ఇక్కడ ఎటు చూసినా - అన్నీ జలాలపైనే. అది రెస్టారెంట్ కావొచ్చు.. షాపులు కావొచ్చు.. ఇళ్లు కావొచ్చు. ఏదైనా సరే. అంతా పడవ ప్రయాణం. ఒక చోట నుంచీ ఒకచోటికి వెళ్లాలంటే - మనకిలా బైక్‌నో.. కారునో ఉపయోగించరు. జల చావిట్లో కట్టేసిన పడవ తీసుకోవటం బయల్దేరటమే. స్కూల్‌కి వెళ్లాలన్నా.. పక్క ఊరికి వెళ్లాలన్నా అంతే.
‘జెన్వీ’ ప్రాంతవాసుల ముఖ్య ఆదాయం టూరిజం.. చేపల వేట. వీరు చేపలను వేటాడ్డం చిత్రంగా తోస్తుంది. సరస్సు అడుగుభాగాన వెదురు బొంగులు పాతి వాటికి వలలను బిగిస్తారు. ఈ సరస్సులో అనేక రకాల చేపలు దొరుకుతాయి. రెస్టారెంట్లలోనూ ఘుమఘుమలాడే చేపల పులుసు.. వెదురు బియ్యంతో చేసిన అన్నం దొరుకుతుంది. ఇక్కడి వారి జీవన విధానాన్నీ చూట్టానికి దేశ విదేశీ పర్యాటకులు తరచూ వస్తూంటారు. కొన్నాళ్ల క్రితం వరకూ వేరే ప్రాంతాల వారిని వీరు ఆహ్వానించేవారు కాదు. ముభావంగా ఉండేవారు. తమ జాతీయ సంపదని కొల్లగొడతారేమోనన్న భయం. వీరికి ‘్ఫన్’ శత్రు భయం తొలగించటానికి చాన్నాళ్లు కష్టపడాల్సి వచ్చింది. సరస్సు అడుగు భాగం నుంచీ వేసుకుంటూ వచ్చిన వెదురు బొంగులపై చిన్నపాటి స్టేజ్ లాంటిది కట్టి.. వాటిపై ఇళ్లను నిర్మించుకుంటారు. చూట్టానికి ఎంతో ముచ్చట గొలిపే ఈ సంస్కృతి ఆ నోటా ఈ నోటా తెలియటంతో ఇక్కడికి వచ్చేవారి తాకిడి గణనీయంగానే ఉంటోంది. జెన్వీ ప్రాంతం చేరుకోవాలంటే - అబోమె - కలవీ ప్రాంతం నుంచీ పశ్చిమ దిశగా పయనించాల్సి ఉంటుంది. ప్రొద్దునే్న అబోమె నుంచీ టాక్సీలు.. ప్రైవేటు వాహనాలు బయల్దేరతాయి. కొద్ది దూరం ఆయా వాహనాల్లో ప్రయాణించి - అక్కడ్నుంచీ మోటార్ బోట్లను కానీ.. సాదాసీదా పడవల్లోగానీ ప్రయాణించాలి.
ఒకప్పుడు అంటే క్రీ.శ.16-19 శతాబ్దాల మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని ‘స్లేవ్ కోస్ట్’ అని వ్యవహరించేవారు. యూరోపియన్లు ఇక్కడ బానిస వ్యాపారం చేసేవారు. ‘ఔదా’ అనే స్థానిక మ్యూజియంలో ఈ చరిత్రని తిరగేయ్యొచ్చు. 1993లో బెనిన్ ప్రభుత్వం నిర్వహించిన ‘వైడర్ ఆర్ట్ ఫెస్టివల్’లో ఆనాటి విషాద ఉదంతాలను ఎన్నింటినో ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతం చేసింత్తర్వాత - మార్పు కానవచ్చింది.
కోటోనౌకి వాయవ్య దిశగా 145 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం క్రీ.శ.17వ శతాబ్దంలో అబోమె వంశీకుల ఏలుబడిలో ఉండేది. బెనిన్ ప్రాంతం వీరి జన్మస్థలం. ఐతే తరచూ జరిగిన యుద్ధాల కారణంగా ‘టిఫినో’ తెగ వారు ఈ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ఆ కాలంలో ఎంతో అభివృద్ధి సాధించిన సంస్కృతుల్లో ఇదీ ఒకటి.
-Courtecy: Andhra Bhoomi,December 25th, 2011

నూరేళ్ల న్యూఢిల్లీ



నిత్య నూతనంగా, నిత్య యవ్వనంతో ఉండాలనీ, సంతోషంగా ఉండాలనీ ఎవరికుండదు చెప్పండి! మనిషి ఎప్పుడూ మార్పు కోరుకొంటాడు. కొత్త ఆలోచనలు చేస్తాడు. ఐతే రాజులకూ, చక్రవర్తులకూ కొత్త ఆలోచనలు వస్తే ఏవౌతుంది? ఏకంగా పౌర జీవితమే మారిపోతుంది. కాదూ కూడదూ అంటే, ఏకంగా రాజధాని నగరాలూ మారిపోతాయి. అలా ఏర్పడిందే కొత్త ఢిల్లీ మహానగరం. కొత్త ఢిల్లీ ప్రస్తావన వచ్చి వందేళ్లు నిండిన సందర్భంగా..
ఈ అనంత కాల గమనంలో దేశాలూ, రాజ్యాలూ మారిపోయాయి. ప్రజల ప్రయోజనాలు పక్కనబెడితే రాజులకూ, చక్రవర్తులకూ ఎపుడూ ఏదో ఒక కొత్తదనం కావల్సి రావడం వల్లే కొత్త పట్టణాలూ, కొత్త నగరాలూ వచ్చాయి. ‘కొత్త ఢిల్లీ’ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

1911 డిసెంబర్ 12నాడు నాటి (పాత) ఢిల్లీలోని నిరంకారీ సరోవర్ ప్రాంతానికి సమీపంలో జరిగిన ‘్ఢల్లీ దర్బారు’లో అలనాటి బ్రిటిష్ చక్రవర్తి జార్జి , కలకత్తా నుంచి దేశ రాజధానిని ‘్ఢల్లీ’కి మారుస్తున్నట్టూ పరిపాలనా సౌకర్యం కోసం ‘కొత్త ఢిల్లీ’ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఐతే ఆ ప్రకటన వెలువడి 2011 డిసెంబర్ 12 నాటికి వందేళ్లు పూర్తయింది. ఈ ప్రస్తావన ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాల గురించి చర్చించడం, విభేదించడం పక్కనబెడితే, కొత్త్ఢిల్లీ రూపకల్పనకు నాంది పలికి వందేళ్లు నిండిన సందర్భాన్ని గుర్తు చేసుకోవడం మన తక్షణ కర్తవ్యం.

‘కొత్త ఢిల్లీ’ రూపకల్పనకై 12 డిసెంబర్ 1911 నాడు ప్రస్తావన జరిగినా, కొత్త ఢిల్లీ దేశ రాజధానిగా పరిపుష్టిని పొందింది మాత్రం 1931లో. ఆ తర్వాత 16 ఏళ్లకు బ్రిటిష్ పాలకులు తామెంతో ముచ్చట పడి నిర్మించుకున్న నగరానే్న కాదు, ఏకంగా దేశానే్న వదిలి వెళ్లిపోయారు. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ఎన్నో మార్పులూ చేర్పులూ కలిగాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వెళ్లాయి. సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని నడుపుతున్నాయి. వీటన్నిటికీ సాక్షీభూతంగా నేటికీ నిలిచి ఉంది కొత్త ఢిల్లీ. ఎపుడూ నూతనంగానే ఉంటోంది.

చరిత్ర పుటల్లోకి..
ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే, ఢిల్లీ నగరం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తుంది. ఆయా కాలాల్లో పరిపాలించిన రాజులూ, చక్రవర్తులూ - వారి ప్రభావం ఎలా ఢిల్లీ మీద పడిందో కూడా తెలియజేస్తుంది. ఆయా చక్రవర్తుల, రాజుల ధర్మమా అని ఢిల్లీ నగరం వివిధ సమయాల్లో ఐదు, ఆరుసార్లు పునర్ నిర్మింపబడిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. మహాభారత కాలంలో పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థ - పౌరాణిక, చారిత్రక నగరంగా విలసిల్లింది. ఇప్పటికే పాండవుల కోట (పురానాఖిల్లా) దీనికి సాక్ష్యంగా నిల్చి ఉంది. ఐతే క్రీ.శ.12వ శతాబ్దంలో ఢిల్లీ నగరం అత్యంత ఆటుపోటులను ఎదుర్కొన్నది. ముసల్మానులూ, బ్రిటిషర్లూ రానంత కాలం భారతదేశానికి రాజధానిగా ఢిల్లీ నగరం వర్థిల్లింది. 12వ శతాబ్ద ప్రాంతంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడంతో ఢిల్లీ మహ్మద్ ఘోరి చేజిక్కింది.

అసలు వౌర్యుల రాజధానియైన పాటలీపుత్రాన్నీ, తక్షశిల (నేడు పాకిస్తాన్‌లో ఉంది)నీ కలుపుతూ ఢిల్లీ హైవేలో ఉండేది. బౌద్ధ భిక్షువులు ఈ మార్గానే్న తక్షశిల వెళ్లేవారు. చౌహానులు అధికారంలోకి రాగానే ఢిల్లీని దేశ కేంద్ర బిందువుగా, రాజధానిగా చేశారు. క్రీ.శ.1193లో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని చెరపట్టాడు. ఆ తర్వాత మొగలాయి చక్రవర్తులు క్రీ.శ.1526 నుంచీ క్రీ.శ.1857 దాకా పాలించారు. దీని తర్వాత ఖిల్జీ అనుయాయులు ‘సిరి’ అనేచోట ఢిల్లీని ఏర్పాటు చేశారు. మూడోసారి ఢిల్లీ నిర్మాణమైంది.

ఘియాసుద్దీన్ కాలంలో క్రీ.శ.1321-25 ప్రాంతంలో తుగ్లకాబాద్ అనేది మూడో ఢిల్లీ నగరంగా నిర్మాణమైంది. దీని తర్వాత మహ్మద్ బిన్ తుగ్లక్ జహంపనా పేరుతో ఢిల్లీ మార్పులను సంతరించుకుంది. కొద్ది రోజుల తర్వాత తుగ్లక్ రాజధానిని దౌలతాబాద్‌కు మార్చాడు. తిరిగి ఎన్నో వ్యతిరేకతలకు తట్టుకోలేక తిరిగి రాజధానిని ఢిల్లీకే మార్చాడు. ఇక ఐదోసారి ఢిల్లీ నిర్మాణమైంది క్రీ.శ.1351లో. యమునా నదీ తీరాన ఫిరోజ్‌షా తుగ్లక్ నిర్మింపజేశాడు. దీనే్న తర్వాతి కాలంలో షాజహాన్ కూల్చేసి ‘షాహజహనాబాద్’ పేరుతో పునర్నిర్మించాడు. (ఈ నగరపు శకలాలూ, శిథిలాలూ నేటికీ లోడీ గార్డెన్స్‌లో మనం చూడొచ్చు) అలా ఆరోసారి పునర్నిర్మాణమైన ఢిల్లీయే అందరూ వాడుకగా పిలిచే పాతఢిల్లీ నగరం. ఎర్రకోట, జుమ్మా మసీదులూ ఆనాటి హిందూ, ముస్లిం చక్రవర్తుల పాలనకు సాక్ష్యాలుగా నేటికీ మనకు కనిపిస్తున్నాయి.

ఈస్టిండియా కంపెనీ రంగప్రవేశం..
పోర్చుగీస్, డచ్, డానిష్, ఫ్రెంచి దేశస్థులు మన దేశానికి వచ్చి వ్యాపారం చేయనారంభించి లాభాలు గడించసాగారు. క్రీ.శ.1510 నాటికే పోర్చుగీస్‌లు భారతదేశానికి వచ్చారు. ఇవన్నీ చూసిన బ్రిటీష్ దేశస్థులు తామెందుకు భారతదేశంలో వ్యాపారం చేయకూడదని తలచారు. క్రీ.శ.1600లో ఎలిజబెత్ రాణి (ఎలిజబెత్ ని) 31వ తేదీ డిసెంబర్ నాడు ఈస్టిండియా కంపెనీ (దీనే్న ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ అనీ అనేవారు)కు అనుమతి నిచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రధానంగా పత్తి, సిల్క్, ఇండిగోడై, టీ, ఓపియం వంటి వాటి వ్యాపారాన్ని చేసింది. క్రీ.శ.1601లో సర్ జేమ్స్ లాన్‌కాస్టెర్ తొలి నౌకకు సారధ్యం వహించాడు. డచ్‌వారితో పోటీ పడ్డాడు.

క్రీ.శ.1608లో (నేటి గుజరాత్‌లోని) సూరత్‌లో పాగా వేసింది. ఈస్టిండియా కంపెనీ దీని తర్వాత క్రీ.శ.1611లో మచిలీపట్నం (కోరమండల్ కోస్ట్)లో శాశ్వత ప్రాతిపదికన ఒక ఫ్యాక్టరీని నిర్మించారు. క్రీ.శ.1612లో బెంగాల్‌లోని ఇతర యురోపియన్ వ్యాపార సంస్థలతో జత కూడింది. ఐతే 1707లో మొగల్ సామ్రాజ్యపతనం అయ్యింది. క్రీ.శ.1757లో ప్లాసీ యుద్ధంలో, క్రీ.శ.1764లో బక్సర్ యుద్ధంలో విజయాన్ని సాధించాక నెమ్మది నెమ్మదిగా ఈస్టిండియా కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా రాజ్యాలను కలుపుకొని పోసాగింది. అన్నిటినీ కలిపి ‘ఇండియా’ అని పిలవసాగింది. 19వ శతాబ్దపు మధ్యకాలానికి ఈస్టిండియా కంపెనీ ఒక బలవత్తరమైన రాజకీయ, మిలిటరీ శక్తిగా అవతరించింది. ఐతే క్రీ.శ.1853 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టుతో కంపెనీ పాలన అంతమై, క్రీ.శ.1876-77 నాటికి భారత సామ్రాజ్యంగా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. క్రీ.శ.1772 నాటికే హుగ్లీ నదీ తీరాన ఉన్న కలకత్తా వీరి పాలనకు ప్రధాన కేంద్రంగా మారింది. బ్రిటిష్ పాలకుల కింద ఉండే రాజ్యాలు కాకుండా, ఇతర రాజులు శిస్తు కట్టే ఒప్పందం కింద ఉండిన రాజ్యాలూ ఉండేవి.
ఢిల్లీ దర్బారు..
ఢిల్లీలో జరిగిన మహా సమావేశాల్లో బ్రిటిష్ చక్రవర్తి, మహరాణుల పట్ట్భాషేక ఉత్సవ సంరంభాలకే ఢిల్లీ దర్బారు, ఇంపీరియల్ దర్బారు అని పేరు. ఈ ఢిల్లీ దర్బారు చరిత్రలో ముచ్చటగా మూడుసార్లు జరిగాయి. క్రీ.శ.1877లో జరిగిన తొలి ఢిల్లీ దర్బారు జనవరి 1వ తేదీన జరిగింది. ఆ సామ్రాజ్య పట్ట్భాషేక మహోత్సవంలో క్వీన్ విక్టోరియాను ‘మహారాణి’గా ప్రకటించారు. దీనికి నాటి వైస్రాయ్, మహారాజులు, మేధావులు, నవాబులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన సందేశం నేటికీ కలకత్తాలోని విక్టోరియా స్మారక భవనంలో ఒక ఫలకంపై చెక్కి ఉంది కూడా. అపుడే ‘ఫ్రీ ఇండియా’ అనే నినాదం మొదలైంది కూడా.

క్రీ.శ.1877 తర్వాత తిరిగి క్రీ.శ.1903లో కింగ్ ఎడ్వర్డ్ నిని, క్వీన్ అలెగ్జాండ్రాల పట్ట్భాషేక మహోత్సవంగా రెండు వారాలపాటు కడు వైభవంగా దర్బారు జరిగింది. ఇదీ ఢిల్లీలోనే జరిగింది. ఈ రెండో దర్బారు నిర్వహణకు లార్డ్ కర్జన్ ఎంతో కష్టపడ్డాడు. ప్రతిదీ దగ్గరుండి ప్లాన్ చేశాడు. ఈ దర్బారు ఆరంభమయ్యే సమయానికి అందరికీ అందుబాటులో ఉండేలా సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేశాడు.

భారతదేశపు నలుమూలల నుంచీ మహారాజులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. అంతా ప్రముఖులే హాజరవడం, సామాన్య ప్రజలు చూడలేక పోవడం జరిగింది. ఈ దర్బారు జరిగిన సమయంలో జరిగిన సంఘటనలను గుదిగుచ్చి సినిమాగా తీసి ప్రదర్శించారు. ఈ దర్బారు సమయంలోనే ఆఘాఖాన్ నినిని భారతదేశంలో సకల విద్యా సదుపాయాలను ఏర్పాటు చేసి విస్తరింపజేయాలని కోరాడు. ఈ దర్బారులో నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్, అతని భార్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అది క్రీ.శ.1911 సంవత్సరం. కింగ్ జార్జి , క్వీన్ మేరీల పట్ట్భాషేక మహోత్సవం ఢిల్లీలో జరిగిందీ సంవత్సరంలోనే. అంతటితో ఆగలేదు. ఆ దర్బారులోనే జార్జి , కలకత్తా నుంచి దేశ రాజధానిని ఢిల్లీకి మారుస్తున్నట్టు ప్రకటించాడు. ఈ 1911లో జరిగిన దర్బారే చివరి ఢిల్లీ దర్బారు. ఆ తర్వాత దర్బారు జరగలేదు. ఢిల్లీ పక్కనే కొత్త ఢిల్లీకి రూపకల్పన చేయడానికి ‘లూథైన్స్’ అనే బ్రిటిష్ రూపశిల్పికి పని అప్పజెప్పారు. 1912లో ఆరంభమైన కొత్త ఢిల్లీ నిర్మాణం 1930లో పూర్తయింది.

1931 నాటికి కొత్త ఢిల్లీ భారతదేశపు కొత్త రాజధానిగా వ్యవహారంలోకి వచ్చింది. ఈ మూడో దర్బారు లార్డ్ హౌర్డింజ్ ఆధ్వర్యంలో జరిగింది. అదేమి చిత్రమోగానీ 1936లో ఎడ్వర్డ్ నినిని పట్ట్భాషేకం జరగాల్సి ఉండింది. కానీ పలు విమర్శల నేపథ్యంలో అది జరగనే లేదు. మరోసారి ఢిల్లీ దర్బారు జరగనే లేదు. ఇంతలో 2వ ప్రపంచ యుద్ధం జరగడం, భారత స్వాతంత్య్రోద్యమం జరగడం, భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం రావడం సంభవించాయి.

ఢిల్లీ దర్బారు వేదిక..
ఢిల్లీ దర్బారు జరిగిన స్థలానికే పట్ట్భాషేక ఉద్యానవనం (కారొనేషన్ పార్క్) అని పేరు. ఇది ఢిల్లీలోని నిరంకారీ సరోవర్ సమీపాన బురారీ రోడ్డుపై ఉంది. దీనినే పట్ట్భాషేక స్మారక స్థలం (కారొనేషన్ మెమోరియల్) అనీ అంటారు. మూడు ఢిల్లీ దర్బారులూ ఇదే స్థలంలో జరగడం కాకతాళీయం కావచ్చు.
ఈ దర్బారు జరిగిన సమయాల్లో జరిపిన ఖర్చు తక్కువేమీ కాదు.

కొత్త ఢిల్లీ నిర్మాణం..

ఢిల్లీ రాజధాని అని ప్రకటన వెలువడినంతనే 15 డిసెంబర్ 1911 నాడు ఈ నగరానికి శంకుస్థాపన చేశారు. 20వ శతాబ్దపు ప్రముఖ బ్రిటిష్ రూపశిల్పులైన సర్ ఎడ్విన్ లూథైన్స్, సర్ హెర్బర్ట్ బేకర్‌లకు కొత్త నగరపు నిర్మాణాన్ని అప్పగించారు. 1927 నాటికి ఈ కొత్త రాజధాని నగరానికి ‘కొత్త ఢిల్లీ’ అని నామకరణం చేశారు. 13 ఫిబ్రవరి 1931నాడు నాటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేశాడు.
నిజానికి 1900 కాలానికే ఢిల్లీని బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యపు రాజధానిగా చేయాలని నిశ్చయించారు. ఐతే అదెందుకో వెంటనే సాకారం కాలేదు. అందుకే గాబోలు ఢిల్లీ దర్బారు పేరిట మూడు సార్లు ఢిల్లీలో సభ జరిగింది. మొదట 1877లో జరిగింది. అంటే, తొలి దర్బారు నాటికే బ్రిటిష్ వారికీ ఢిల్లీ మీద మోజుండేది. దీనికి కారణం ఒక్కటే. అనాదిగా రాజకీయ, ఆర్థిక కేంద్రంగా ఢిల్లీ కావడమే.
అందుకేనేమో! మూడో దర్బారు అంటే 1911 డిసెంబర్‌లో జార్జి , క్వీన్ మేరీ ఇద్దరూ ఢిల్లీకి వచ్చి, ఆ దర్బారులో దేశ రాజధానిగా ‘్ఢల్లీ’ ఉంటుందనీ, దీని కోసం కొత్త నగరాన్ని రూపకల్పన చేయబోతున్నారనీ ప్రకటించారు. అదే సమయంలో ఢిల్లీ దర్బారు సమీపాన వైస్రాయ్ భవనానికి శంకుస్థాపన కూడా చేశారు. (అదే నేటి రాష్టప్రతి భవనం).

లూథైన్స్ 1912లో ఢిల్లీని తొలిసారిగా సందర్శించారు. ఐతే తొలి ప్రపంచ యుద్ధం సమాప్తమయ్యాక, ఈ కొత్త నగర నిర్మాణం ఆరంభమైంది. ఎడ్విన్ లూథైన్స్, హెర్బర్ట్ బేకర్‌లు రూపకల్పన చేశాక, నిర్మాణ పనుల కాంట్రాక్టు నాటి శ్రీ శోభాసింగ్ అనే ఆయనకు అప్పగించారు. ఈ నగరానికే ‘లూథైన్స్ ఢిల్లీ’ అని పేరు మొదట పెట్టారు. నాటి బ్రిటిష్ చక్రవర్తి ఆలోచనల కనుగుణంగానే కేంద్ర కార్యనిర్వహణా స్థలాలు రూపుదిద్దుకున్నాయి. 1918లో ఎడ్విన్‌కు, 1926లో హెర్బర్ట్‌కు, ఆ తరువాత శోభాసింగ్‌కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదు ఇచ్చి సత్కరించింది కూడా.
1911 దాకా మొత్తం ఢిల్లీకంతా పాత ఢిల్లీ రైల్వేస్టేషన్ ఒక్కటే ఉండేది. ఆగ్రా - ఢిల్లీ రైల్వేస్ లూథైన్స్ రూపొందించిన ఢిల్లీ ద్వారా ఢిల్లీ, ఆగ్రాలను కలపడం జరిగింది. దాంతో, 1926లో లూథైన్స్ ఢిల్లీలో అజ్మీరీ గేటు సమీపాన కొత్త రైల్వేస్టేషన్ రూపుదిద్దుకుంది.
రైసానా హిల్స్‌పైన వైస్రాయ్ భవనాన్నీ, అక్కడ నుంచి నేరుగా ఇండియా గేట్ దాకా ఒక రోడ్డునీ నిర్మించారు. ఈ రోడ్డునే అలనాడు ‘కింగ్స్‌వే’ అనేవారు. ఇదే నేడు రాజ్‌పథ్ అయ్యింది.

వైస్రాయ్ భవనమే రాష్టప్రతి భవనం అయ్యింది. ఈ కింగ్స్ వేకు లంబంగా ఉండే జనపథ్ రోడ్డు నేడు మనలను కన్నాట్ ప్లేస్‌కు తీసుకెళ్తోంది) దానినే ‘క్వీన్స్‌వే’ అనేవారు. నేడు మనం చూసే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లతో సెక్రటేరియట్ భవనం, పార్లమెంట్ భవనం, పార్లమెంట్ స్ట్రీట్ - వీటికి హెర్బర్ట్ రూపకల్పన చేశాడు.
ఇవి కాకుండా నేటి రాష్టప్రతి భవనం వేపు నించి దక్షిణాన లోడీ రోడ్ దాకా దాదాపు 2800 హెక్టార్ల విస్తీర్ణంలో బంగ్లాలను రూపుదిద్దిందీ లూథైనే్స. దీనికే లూథైన్స్ బంగళా జోన్ అని పేరు. 1972లో న్యూఢిల్లీ రీ డెవలప్‌మెంట్ అడ్వయిజరీ కమిటీ ఏర్పడి కన్నాట్ ప్లేస్‌లో తదితర ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఈ లూథైన్స్ బంగళా జోన్ గురించి 1988లో ఒక ప్రకటన ద్వారా అందరికీ తెలియజేశారు. దానికే 2003లో కొన్ని మార్పులు చేశారు.

ప్రధాన రూపకర్తలు లూథైన్స్, హెర్బర్ట్‌లే అయినా వీరితోబాటు రాబర్ట్ టోర్ రస్సెల్, విలియమ్ హెన్రీ నికోల్స్, సిజి బ్లామ్‌ఫీల్డ్, ఎఫ్‌బి బ్లామ్ ఫీల్డ్, వాల్టర్ సైక్స్ జార్జి, ఆర్థర్ గోర్డన్ షూ స్మిత్, హెన్రీ మెడ్డ్‌లనే లబ్దప్రతిష్టులూ ‘లూథైన్స్ ఢిల్లీ’ రూపకల్పనకు యధాశక్తితో పాటుపడ్డారు. అలాగే శోభాసింగ్‌తోబాటు శ్రీ తేజ్‌సింగ్ మాలక్ అనే చీఫ్ ఇంజనీర్, మరో ముగ్గురు కంట్రాక్టర్లూ పనిచేశారు.

ఇండియా గేటూ - అమరజవాన్ జ్యోతి..
రైసానా హిల్స్ నించి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో మనకు కనిపించే జాతీయ స్మారక చిహ్నం ‘ఇండియా గేట్’. దీనికి రూపకల్పన చేసిందీ లూథైనే్స. ప్యారిస్‌లో అప్పటికే నెలకొల్పిన ‘ఆర్క్ డి ట్రిమ్ఫ్’ దీనికి ప్రేరణ. ఇండియా గేట్‌ను 1931లో కట్టారు. దీనికి అఖిల భారత యుద్ధ స్మారికగా పేరు. తొలి ప్రపంచ యుద్ధంలో, మూడో ఆంగ్లో - ఆఫ్గన్ యుద్ధంలో దేశం కోసం పోరాడి అసువులు బాసిన 90వేల సైనికుల అమరమైన త్యాగానికి చిహ్నంగా దీన్ని కట్టారు.

ఈ ఇండియా గేట్‌కు కొద్ది దూరంలో ఒక చిన్న పీఠం (కానొపి) ఉండేది. దాని మీద కింగ్ జార్జి విగ్రహం ఉండేది. ఈ కింగ్ జార్జి విగ్రహాన్ని తర్వాత తర్వాత కారొనేషన్ పార్కు దగ్గరకు తరలించి ప్రతిష్ఠించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాకా ఇండియా గేట్ దగ్గర ‘అమర జవాన్’ జ్యోతి అనే దానిని 1971లో భారత సైన్యం ఆరంభించింది. ఈ ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు. టెర్రరిస్టుల భయం వల్లనో, లేక ఈ స్మారక చిహ్నానికి ముప్పు వాటిల్లుతుందనే భయం వల్లనో ఇండియా గేట్ సమీపంలో వాహనాలు తిరగడాన్ని నిషేధించారు. నేడు ఇండియా గేట్ ఉన్న స్థలం మొత్తం ఢిల్లీ మహా నగరానికి కేంద్ర బిందువుగా మారిపోయింది.

ఢిల్లీలో ఏ మూల నుంచీ ఏ మూలకు వెళ్లాలన్నా అటు ఇండియా గేటునూ ఇటు రాష్టప్రతి భవనాన్నీ చూడకుండా దాటడానికి వీల్లేని రోజులవి. మరి నేడో మెట్రోలూ, రింగ్ రోడ్లూ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి.
ఇండియా గేట్ చుట్టూతా ఉండే ప్రాంతాలంతా, ప్రజలు ఆడుతూ పాడుతూ ఉండేంత వీలుగా, పర్యాటక ప్రదేశంలా ఉంటుంది. ఇండియా గేట్ ఉన్న షడ్భుజి సముదాయం దాదాపు 306000 చ.మీ. విస్తీర్ణం కల్గి 624 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. రిపబ్లిక్ డే నాటి పెరేడ్ రాష్టప్రతి భవన్ ముందున్న విజయ్‌పథ్ ద్వారా ఇండియా గేట్ దగ్గరికి చేరి, అక్కడి నించి రెడ్‌ఫోర్ట్ దాకా వెళ్లేది.

ఈ అమర్ జవాన్ జ్యోతి సమీపానే త్రిదళ పతాకాలు (సైన్యం, నేవీ, ఏర్‌ఫోర్స్) ఎగురుతూంటాయి. ముగ్గురు సైనికులు ఇండియా గేట్ దగ్గరి ఈ అమర్‌జవాన్ జ్యోతి వద్దే 24 గంటలూ కాపలా కాస్తూంటారు కూడా.
రాష్టప్రతి భవన్
నిజానికి కొత్త ఢిల్లీకి నూరేళ్లు అనడానికి బదులు ‘రాష్టప్రతి భవనానికి నూరేళ్లు’ అని అక్కడ సంబరాలు జరపడం సబబు. 1911లో ముందు ఈ రాష్టప్రతి భవన్ (నాడు వైస్రాయ్ భవన్)నే కట్టడం ప్రారంభించారు. 1950 దాకా దీనిని వైస్రాయ్ హౌస్ అనే పేరుతోనే పిలిచేవారు. ఈ భవనానికి రూపకల్పన చేసిందీ లూథైనే్స. దీని నిర్మాణం పూర్తి కావడానికి 4 ఏళ్లు పడుతుందని మొదట అంచనా వేసినప్పటికీ, తొలి ప్రపంచ యుద్ధం వల్ల, 19 సంవత్సరాలు పట్టింది. ప్రపంచంలో ఒక అధ్యక్షుని భవనం ఇంత పెద్దదిగా ఉండటం ఇక్కడే చూడొచ్చు.

రైసానా హిల్స్, మాల్చా గ్రామాల నుంచి దాదాపు 4 వేల ఎకరాల స్థలాన్ని ఈ వైస్రాయ్ భవనం కోసం ఎంపిక చేసినపుడు దాదాపు 300 కుటుంబాలను ఖాళీ చేయించారు. ఇది 1911, 1916 మధ్య ప్రాంతాల్లో జరిగింది.
ఈ వైస్రాయ్ భవనం తదితర నిర్మాణాలూ కూడా అంత సజావుగా ఏమీ సాగలేదన్న మాటే. కొన్ని సందర్భాల్లో లూథైన్స్‌కీ, హెర్బర్ట్‌కీ కూడా అభిప్రాయ భేదాలు కలిగాయి. ఆ తర్వాత ఇంపీరియల్ ఢిల్లీ కమిటీ అనేది ఏర్పాటై పర్యవేక్షించింది. కొత్త ఢిల్లీ నిర్మాణంలో ఉన్నంతకాలం, అంటే 1911 నించీ 1931 దాకా దాదాపు 20 ఏళ్లు అటు ఇంగ్లండ్‌కూ ఇటు ఇండియాకు ప్రయాణం చేస్తూనే ఉండక తప్పలేదు లూథైన్స్‌కి. ఎందుకంటే ఏకకాలంలో అటు ఇంగ్లండ్‌లో ఒక వైస్రాయ్ భవంతికీ, ఇటు ఢిల్లీలో వైస్రాయ్ భవంతికీ రూపకల్పన చేయాల్సి వచ్చిందతనికి.

వైస్రాయ్ హౌస్‌ను రూపుదిద్దడంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వానికీ ‘డబ్బు’ కొరత తప్పలేదు. బడ్జెట్ అనుమతించక పోవడంతో లార్డ్ హార్డింజ్, లూథైన్స్‌ని ఖర్చు తగ్గించమని చెప్పాడు. ఫలితంగా వైస్రాయ్ హౌస్ నిర్మాణంలో దాని పరిమాణాన్ని 13,000,000 క్యూబిక్ అడుగుల నుంచీ 8,500,000 క్యూబిక్ అడుగులకు తగ్గించాడు లూథైన్స్.

ఈ వైస్రాయ్ భవన్‌లో 4 అంతస్థులు, 360 గదులూ ఉన్నాయి. ఈ భవంతి కట్టడం విస్తీర్ణం 2,00,000 చ.అడుగులు.
ఇండియా గేట్ తూర్పు వేపు ఉంటే, వైస్రాయ్ భవన్ పడమట వేపు ఉంది. లూథైన్స్ భారతీయ సంస్కృతినీ, కట్టడాలనీ కూడా పరిశీలించడం వల్ల, భారతీయ నిర్మాణాలకు దీటుగా ఈ వైస్రాయ్ భవనాన్ని కట్టాడు. మొగల్, యూరోపియన్, ఇండియన్ సంస్కృతుల కలవోతగా మనకు ఈ వైస్రాయ్ భవనం కనిపిస్తుంది.

ఈ వైస్రాయ్ భవనం వెనుక వేపున పెద్ద ఉద్యానవనం ఒకటి నిర్మించారు. దానిలో అటు మొగల్, ఇటు ఇంగ్లీష్ శైలులే మనకు దర్శనమిస్తాయి. ఎంతో చక్కని పూదోట ఇది అనిపిస్తుంది. ఈ పెద్ద ఉద్యానవనానికే మొగల్ గార్డెన్స్ అని పేరు. దీనిని ప్రతిఏటా చూడటానికి ఫిబ్రవరి నెలలో సందర్శకులను అనుమతిస్తారు.
1985 ప్రాంతంలో ఈ భవనానికి మరమ్మతులు చేయనారంభించారు. అది 1989 దాకా కొనసాగింది. ఆ సమయంలోనే లోగడ చేసిన మార్పులను తొలగించి ‘అశోకా హాలు’కు పూర్వ స్థితిని తెచ్చారు. 2010లో మరో మరమ్మతు కార్యక్రమం మొదలైంది.

స్వాతంత్య్రం వచ్చాక..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక అంటే, 1947 తర్వాత కొత్త ఢిల్లీకి పరిమితమైన అటానమీనే ఇచ్చారు. అదీ ఒక చీఫ్ కమిషనర్ పర్యవేక్షణలో జరిగేది. 1956లో ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, చీఫ్ కమిషనర్ స్థానంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు. రాజ్యాంగ 69 సవరణతో 1991 నుంచి జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ కాపిటల్ టెరిటరీ/ రీజన్)గా మార్చారు. నేడు ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. ఈ అసెంబ్లీలో 70 మంది సభ్యులున్నారు. మొత్తం ఢిల్లీ కాపిటల్ రీజన్ కింద 9 జిల్లాలున్నాయి.
జిల్లా విస్తీర్ణం జనాభా
సెంట్రల్ 25 చ.కి.మీ. 6,44,005
ఈస్ట్ 64 చ.కి.మీ. 14,48,770
న్యూఢిల్లీ 35 చ.కి.మీ. 1,71,806
నార్త్ 60 చ.కి.మీ. 7,79,788
నార్త్ ఈస్ట్ 60 చ.కి.మీ. 17,63,712
నార్త్ వెస్ట్ 440 చ.కి.మీ. 28,47,395
సౌత్ 250 చ.కి.మీ. 22,58,367
సౌత్ వెస్ట్ 420 చ.కి.మీ. 17,49,492
వెస్ట్ 129 చ.కి.మీ. 21,19,641
2009-10 నాటికి ఢిల్లీ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (ఎస్‌డిపి) సూచిక అక్షరాలా 1,35,814 రూ.లు.

ఢిల్లీ కేపిటల్ రీజన్‌లో నేడు ‘కొత్త ఢిల్లీ’ ఒక భాగంగా ఏర్పడింది.
న్యూఢిల్లీ చక్కగా ఒక పద్ధతిగా ప్లాన్ చేసి నిర్మించారు గనకే, నేటికీ ఆ నగరానికి వెళ్లినవారు ఎంతో ఆకర్షితులౌతున్నారు.
కొత్త ఢిల్లీలో రోడ్ల నిర్మాణం, పర్యవేక్షణ - రెండూ కూడా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చూసుకుంటుంది. 2008 నాటికి ఢిల్లీలో 15 సబ్‌వేలు రూపుదిద్దుకున్నాయి. 1971 దాకా ఢిల్లీ రవాణా సంస్థ (డిటిసి) మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కింద ఉండేది. 1971లో ఆ రవాణా సంస్థను జాతీయం చేయడం జరిగింది. 2007 నాటికి కొత్త ఢిల్లీలో 2700 బస్‌స్టాప్‌లున్నాయి. వీటిల్లో 200 దాకా మున్సిపాలిటీ నిర్వహిస్తోంది. మిగిలిన వాటిని డిటిసి నిర్వహిస్తోంది.
మెట్రో రైలు ఈ శతాబ్ద ఆరంభంలో ఢిల్లీకి లభించిన కొత్త రవాణా సౌకర్యం. మెట్రో రైలు రాకతో ఢిల్లీ, న్యూఢిల్లీల మధ్య దూరాలు తగ్గిపోయాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఏర్‌పోర్ట్ ప్రధాన ఏర్‌పోర్ట్‌గా ఉంది. ఇటీవలే కొత్త టెర్మినల్‌నూ ఏర్పాటు చేశారు.

విచిత్రమైన ఢిల్లీ పరిస్థితి
..
‘్ఢల్లీ’ది విచిత్రమైన పరిస్థితి. దేశ విదేశాల నుంచి వచ్చిన జనాభా చాలా ఎక్కువ. అందుకే విభిన్న సంస్కృతులు చూడవచ్చు. అంతేకాదు. కాశ్మీర్, సిమ్లాల్లో మంచు కురిస్తే, ఢిల్లీలో చలి ముంచుకొచ్చేస్తుంది. రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను (ఆంధీ) వస్తే, వెంటనే ఢిల్లీలో రావలసిందే. ఏ థార్ ఎడారిలో ఎండ ముంచుకొస్తే, ఢిల్లీలో ఎండలు మండిపోతాయి. ఇక రాజకీయంగా చూసినా అంతే. ఏ రాష్ట్రంలో అనిశ్చితి కలిగినా, ఏ రాజకీయ అలజడి రేగినా దాని ప్రభావం ఢిల్లీలో తెలుస్తుంది. ఢిల్లీకి ‘సెగ’ తగలడం తప్పదు. విచిత్రంగా లేదూ? మహాభారత కాలం నించీ ఢిల్లీ పరిస్థితి ఇంతే!

ఢిల్లీలో తెలుగు..

ఢిల్లీలో పది లక్షలపైచిలుకు తెలుగువారు ఉన్నారు. ఆంధ్రదేశంలో తెలుగువారి మధ్య లేని సఖ్యత, ఢిల్లీలో చూడొచ్చు. ఆంధ్ర సంఘం, తెలుగు అకాడెమీ వంటి సంస్థలు గణనీయమైన కృషి చేస్తున్నాయి. తెలుగువారు నడిపే బడి కూడా ఉంది. ఆంధ్రా భోజనం కావాలీ అంటే ఇండియా గేట్ దగ్గరున్న ఆంధ్రా భవన్‌కి వెళ్లి తీరాల్సిందే. కరోల్‌బాగ్, సరోజినీ నగర్, ఆర్.కె.పురం, దిల్‌షాద్ గార్డెన్స్, మయూర్ విహార్ - ఇవేగాక ఎన్నో కాలనీల్లో తెలుగువారు ఉన్నారు. తెలుగువారు చాలా మందే ప్రముఖ పదవుల్లో పని చేశారు. చేస్తూ ఉన్నారు. లోక్‌సభ స్పీకర్లుగా అనంత శయనం అయ్యంగార్ (1956-57), నీలం సంజీవరెడ్డి (1967-69, 1977), బాలయోగి (1998-99) పని చేశారు. మనకుండిన రాష్టప్రతుల్లో, సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, వివి గిరి తెలుగువారే. అపరచాణుక్యునిగా పేరు మోసిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి కాక మునుపు కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు మంత్రిగా పని చేశారు. ఇలా ఇంకెందరో తెలుగువారు ఇప్పటికీ కీలకమైన పదవుల్లో పనిచేస్తూనే ఉన్నారు.

కొత్త ఢిల్లీ, ఢిల్లీల్లో చూసేవీ, చూడాల్సినవీ!
కొత్త ఢిల్లీ అనేది 1911లో ప్రతిపాదించి రూపొందించినా, ఢిల్లీనగరం ప్రాచీనమైనది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో పాతవీ కొత్తవీ కూడా ఉన్నాయి. ఎర్రకోట, కుతుబ్‌మినార్, జంతర్‌మంతర్, రాష్టప్రతి భవనం, ఇండియా గేట్, పురానా ఖిల్లా, జుమ్మా మసీదు, హుమాయూన్ టూంబ్, లోడి గార్డెన్స్, పార్లమెంట్ హౌస్, లోటస్ టెంపుల్, లక్ష్మీనారాయణ మందిర్ (బిర్లా మందిర్), ఛత్రపూర్ కాళీ మందిర్, ఆర్కేపురం మలైమందిర్, లోడి రోడ్ సాయిమందిర్, మయూర్ విహార్ అయ్యప్ప గుడి, అక్షరధామ్ - ఇలా ఎనె్నన్నో ఉన్నాయి.

ప్రగతి మైదాన్, లోడి గార్డెన్స్, మొగల్ గార్డెన్స్, బుద్ధ జయంతి పార్క్‌లూ, కన్నాట్ ప్లేస్, పాలికా బజార్, కరోల్‌బాగ్, సరోజినీ నగర్, హాజ్‌కాస్, నెహ్రూ ప్లేస్ వంటి షాపింగ్ ప్లేస్‌లూ ఉన్నాయి. తీన్‌మూర్తి భవన్, నెహ్రూ ప్లానెటోరియం చూడదగ్గ ప్రదేశాలే. చాణక్యపురి ప్రాంతంలో దేశ విదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు దారిపొడుగుతా చూడవచ్చు. అక్కడ సత్యమార్గ్, న్యాయమార్గ్ అని రోడ్ల పేర్లు చూడవచ్చు.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం అటు దసరా ఉత్సవాలకే కాదు, నేడు రాజకీయాలకూ వేదికగా మారిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సుప్రీంకోర్టు, హైకోర్టు భవనాలు బైట నుంచి చూడొచ్చు. హైదరాబాద్ హౌస్, బరోడా హౌస్‌లను బైట నించి చూడొచ్చు. బోట్‌క్లబ్బూ, ఇండియా గేటూ మానసిక ఆహ్లాదాన్నిస్తే, కాశ్మీరీ గేట్, అజ్మీరీ గేట్, మింటో రోడ్, అశోక స్తంభమూ, ఇనుప స్తంభమూ, కుతుబ్ మినార్ - ఇవన్నీ మరిన్ని చారిత్రాత్మక సాక్ష్యాలుగా కనిపిస్తాయి.
ఇవిగాక ఇండోర్ స్టేడియంలు, ఔట్‌డోర్ స్టేడియంలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు - చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి.

వౌనంగానే ఎదగమనీ..
మహాభారత కాలం నించీ మొగల్ సామ్రాజ్య కాలందాకా, అక్కడి నించీ బ్రిటిష్ కాలందాకా ఎన్నో సంఘటనలు జరిగాయి. అన్ని సంఘటనలకూ నిలువెత్తు వౌనసాక్షిగా నిలిచింది ఢిల్లీ. మనకు స్వాతంత్య్రం వచ్చినా, పాకిస్తాన్‌గా మరో దేశం విడిపోయినా, నెహ్రూ, గాంధీ, శాస్ర్తీ వంటి మహానుభావులు నిష్క్రమించినా, ఇందిరాగాంధీ వంటి ప్రధానమంత్రులు హత్యకు గురైనా, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా, సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ వంటి యువ నాయకులు అంతర్థానమైనా - అన్నిటికీ తట్టుకొని, ఏమీ ఎరగనట్టు ముందుకు సాగిపోతోంది మన దేశ రాజధాని - కొత్త ఢిల్లీ. పార్లమెంటుపై దాడి యత్నం జరిగినా, టెర్రరిస్టుల తాకిడి ఎక్కువైనా అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కోవడమే తెల్సింది. మహాభారత కాలం నించీ మన దేశపు రాజధానిగా ఉన్న ఢిల్లీ రూపురేఖలు మార్చుకొని, ఎదుగుతూ ముందుకు పోతోంది. ఇటీవలి కాలంలో ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ ఘనంగా జరిపి, ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలబెట్టుకొన్న కొత్త ఢిల్లీ ప్రపంచంలోని ఆరుగురు అక్కచెల్లెళ్ల పక్కన, అంటే చికాగో, లండన్, ఉలన్‌బాటర్, మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, జోహనె్నస్‌బర్గ్ నగరాల సోదరిగా స్థానాన్ని సంపాదించుకొంది.   -వి.వి.వి.రమణ, December 25th, 2011-Courtecy: andhra   bhoomi 

1, డిసెంబర్ 2011, గురువారం

బలివాడ ('బెజవాడ' రివ్యూ)

సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్‌
నటీనటులు: నాగచైతన్య, అమలా పాల్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రభు, ముకుల్‌దేవ్‌, అజయ్‌, అభిమన్యు సింగ్‌, సత్యప్రకాష్‌, అంజనాసుఖాని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు
సంగీతం: అమర్ మోహ్లి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, విక్రమ్, భూపి తతుల్
ఛాయాగ్రహణం:ఎస్.కె.భూపతి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
ఫైట్స్ :జావేద్
ఆర్ట్: కృష్ణ మాయ
నిర్మాతలు: రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌ కుమార్‌ కోనేరు
కధ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: వివేక్‌కృష్ణ
విడుదల తేదీ:డిసెంబర్ 1, 2011


1989లో విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ తో 'శివ'చేసి నాగార్జున కి బ్రేక్,కెరీర్ కి ఊపు ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయనే మళ్సీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే హీరో కొడుకుతో అదే బ్యాక్ డ్రాప్ లో 'బెజవాడ'సినిమా చేస్తున్నాడంటే అందరికీ ఆసక్తే. దానికి తోడు బోనస్ లా ఈ సారి కాంట్రావర్శిని కూడా రగలించి సినిమాకు ప్రారంభం రోజు నుంచే క్రేజ్ తెచ్చాడు. అయితే అవన్నీ సినిమాకు మంచి ఓపినింగ్స్ తేవటం వరకే పనికివస్తాయని,విషయం లేకపోతే ఇవన్నీ ఎందుకూ కొరగావని మరో మారు తేలిపోయింది. వర్మకు ప్లాప్ లు అలవాటే కానీ,నాగచైతన్యే రెండో సారి సైతం యాక్షన్ హీరోగా నిలదొక్కుకోలేని స్ధితిని ఈ సినిమా మిగిల్చింది.

శివకృష్ణ(నాగచైతన్య)ఓ కాలేజి స్టూడెంట్(ఎప్పుడూ క్లాసులుకి వెళ్లినట్లు చూడలేదేం అని అడగొద్దు).అతను సిటీ కమీషనర్(ఆహుతి ప్రసాద్)కూతురు గీతాంజలి(అమలా పౌల్)ని ప్రేమిస్తూంటాడు.ఈ ప్రేమాయణం ఇలా ఉంటే శివకృష్ణ అన్నయ్య విజయ కృష్ణ(ముకుల్ దేవ్) విజయవాడ గాడ్ ఫాదర్ కాళి (ప్రభు)కి నమ్మిన బంటు.అయితే కాళికి తన తమ్ముడు శంకర్(అబిమన్యు సింగ్)కంటే కూడా విజయ కృష్ణ అంటే నే అబిమానం.దాంతో రగిలిపోయిన శంకర్ తన అన్న కాళిని,ఆ తర్వాత విజయకృష్ణని చంపేసి తనే గాడ్ ఫాధర్ అవుతాడు. అప్పుడు తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి మన కాలేజి స్టూడెంట్ శివకృష్ణ ఆవేశంగా బయిలు దేరతాడు. అప్పుడు ఏం జరిగింది.ఎలా తన ప్రతీకార జ్వాలలలో సిటిని మండించాడు అనేది మిగతా కథ.

"కొత్త దర్శకుడిగా నాపై చాలా మంది దర్శకుల ప్రభావం ఉంది. అందులో వర్మ కూడా ఒకరు తప్ప, ఆయన ఒక్కరే కాదు. అక్కడక్కడా నాకు నచ్చిన షాట్స్, సీన్లను 'బెజవాడ'లో కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాను'' అంటూ దర్శకుడు వివేక్ కృష్ణ ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. ఆయన తనను తర్వాత ఎవరూ వేలు పెట్టి చూపకూడదని చెప్పారో మరెందుకో కానీ..ఈ సినిమాలో మొదటి సీన్ చూసినప్పుడే అతను చెప్పింది అక్షరాలా నిజమని అర్దమవుతుంది. ఎందుకంటే సినిమా ప్రారంభమే గాఢ్ ఫాధర్ లోని తొలి సన్నివేశం బెజవాడలో కనిపిస్తుంది.అలాంటివి ఈ సినిమాలో ప్రతీ నాలుగు సీన్స్ కి ఒకటి పంటిక్రింద రాయిలాగ తగిలి మన జ్ఞానపశక్తి మీద మనకు అపారమైన నమ్మకం కలిగిస్తూంటాయి.అవన్నీ తెలుగు సినిమాలు కామనే,మాకు తెలిసిన బెజవాడ రాజకీయాల మీద సినిమాకదా అని ఉత్సాహపడితే...ఈ సినిమాకీ,బెజవాడ రౌడీ రాజకీయాలకు ఏమీ సంభందం లేకుండా చేసి తుస్సుమనిపిస్తాడు.

ఆ విషయం ప్రక్కన పెడితే సినిమా కథ,మాటలు సమకూర్చుకున్న ఈ దర్శకుడు వాటిని గ్రిప్పింగ్ గా తెరపై ప్రెజెంట్ చేయటంలో విఫలమయ్యాడు. ఎక్కడో ఒకటి రెండు డైలాగులు తప్ప ఆసక్తి కలిగించవు .అందులోనూ తొలిసగంలో అస్సలు హీరో కనపడేది చాలా తక్కువ సేపు..మొత్తం కథను సెటప్ చెయ్యటంలో హీరోని పాటలకు తప్ప కథలోకి తీసుకురాలేకపోయారు. ఇక ద్వితీయార్దం విషయానకి వచ్చేసరికి..విలన్ పరిస్ధితి దారుణంగా తయారవుతుంది. హీరో కొట్టిన దెబ్బకు మందు రాసుకోవటమూ, డైలాగులు చెప్పటంతో క్లైమాక్స్ కు చేరువ అవుతుంది. అలా విలన్ నీరసపడి,హీరోను ఏమీ చెయ్యలేక,భయపడుతూ,హీరోని అంత గొప్పవాడు..ఇంత గొప్పవాడు అని భజన చేస్తూ కూర్చోవటంతో హీరో కి ఏం చేయాలో పాలుపోదు. కాస్సేపు విజయవాడలో రౌడీయిజం లేకుండా చేస్తానని శపధాలు చేస్తాడు. ఆ కాస్సేపటికే విలన్ అంతు చూడాలి అని మళ్లీ డైలాగులు చెప్తూంటాడు.ఇలా ఇద్దరూ సినిమాకు కీలకమైన సెకండాఫ్ సమయాన్ని డైలాగులు చెప్పుకోవటంతో గడిపేయటంతో,క్యారెక్టర్ ప్యాసివ్ గా మారి బోర్ కొట్టడం మొదలైంది.

ఇదిలా ఉంటే దీనికి తోడు కథకు సంభందం లేకుండా బ్రహ్మానందం,ఎమ్ ఎస్ నారాయణ ల కామెడీ,హీరో,హీరోయిన్స్ డ్యూయిట్స్ అసందర్భంగా వచ్చి విసిగిస్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే కేవలం పాటలకే పరిమితం చేసారు.ఆమె వచ్చిదంటే గ్యారెంటిగా పాటో, లేకపోతే హీరోకు హితభోధలు చేయటానికో అన్నట్లు తయారైంది. ఆ పాటలైనా వినసొంపుగా ఉన్నాయా అంటే అన్నీ సిగరెట్ కు జనం బయిటకు పారిపోయే పాటలే. ఇక కెమెరా వర్క్ గురించి,ఎడిటింగ్ సినిమాకు తగ్గట్లే నాశిరకంగా ఉన్నాయి.దర్శకత్వం గురించి చెప్పాలంటే తెలుగులో వచ్చే సి గ్రేడ్ సినిమాల తరహాలో ఉంటుంది.

ఏదైమైనా రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే జన్నాల్ని మోసం చేసారు.'బెజవాడ'పూర్తిగా నిరాశపరిచే సినిమా.అయితే అర్ధం లేని హింస,సిట్యువేషన్ లేని పాటలు,నవ్వురాని కామిడీ లని సినిమాలో ఎలా ఇమర్చవచ్చు అనే విషయాలను సోదాహణంగా తెలుసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. -జోశ్యుల సూర్య ప్రకాష్

వంగవీటికి వ్యతిరేకం, కాదు: బెజవాడపై భిన్నవాదనలు
 విజయవాడ: విడుదలకు ముందే సంచలనం సృష్టించిన బెజవాడ చిత్రంపై విజయవాడలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నగరానికి చెందిన ఏ వర్గంలోని పాత్రలు లేవని కొందరు అభిప్రాయపడితే మరికొందరు మాత్రం వంగవీటి కుటుంబానికి వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం బెజవాడ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో చూసిన వారు వివిధ రకాలుగా స్పందించారు. ఈ చిత్రాన్ని వంగవీటి, దేవినేని వర్గానికి చెందిన వారు కూడా వేరు వేరు చోట్ల తిలకించారు. ఈ సందర్భంగా దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్ మాట్లాడుతూ చిత్రంలో ఏ వర్గానికి చెందిన పాత్రలు లేవని కేవలం క్రేజ్ కోసమే బెజవాడ టైటిల్ పెట్టారని విమర్శించారు.
కొంతమంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ చాలామంది చిత్రం వంగవీటి వర్గానికి వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. దీంతో వంగవీటి వర్గం బెజవాడ చిత్రంపై మండిపడుతోంది. విజయవాడలోని ఇద్దరు నేతలు ఎవరి కుటుంబాల కోసం వారే పోరాటం చేశారని ప్రజల కోసం చేసిందేమీ లేదని అయితే ఈ చిత్రం పూర్తిగా ఇరుకుటుంబాల పాత్రలు ఉన్నవని చెప్పలేమని అలాగే లేవని కూడా చెప్పలేమని, అన్నను తమ్ముడు చంపడం వంటి కొన్ని పాత్రలు మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఉత్కంఠకు దారితీసినంతగా లేదన్నారు. ఈ చిత్రాన్ని చూసి ప్రస్తుతం గొడవలకు దిగే పరిస్థితి లేదని కొందరు అభిప్రాయపడ్డారు.
ట్రేడ్ టాక్: సిటీల్లో సీన్ లేని 'బెజవాడ'
Bejawada

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం బెజవాడకు సిటీల్లో అంత క్రేజ్ కనపటడం లేదు. ముఖ్యంగా మల్టి ఫ్లెక్స్ లలో ఓ పెద్ద హీరో సినిమాకు వచ్చినట్లు ఓపినింగ్స్ కాకపోయినా బుక్కింగ్స్ కూడా రాకపోవటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. గతంలో రక్త చరిత్రకు ఓ వారం ముందు నుంచే బుక్కింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే దానికి కారణం..పోస్టర్స్, ట్రైలర్స్, వాటిని డిజైన్ చేసి వదిలిన ప్యాకేజ్ విధానం అంటున్నారు. అంతేగాక రామ్ గోపాల్ వర్మ దర్శకుడు కాకపోవటం, వివేక్ కృష్ణ కొత్త దర్శకుడు కావటం కూడా ప్రారంభ వసూళ్లపై ప్రభావం చూపిస్తాయని,అంతకు మించి నాగచైతన్య గత చిత్రం దడ యాక్షన్ ఎంటర్టైనర్ కావటం, అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం కూడా సినిమాకు ఓపినింగ్స్ కు మైనస్ గా మారింది. ఇక ఈ చిత్రానికి బి,సి సెంటర్లలో ఓ రేంజి కలెక్షన్స్ ఉంటాయని భావిస్తున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే సిటీల్లోనూ కలెక్షన్స్ పుంజుకుంటాయి. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అమలా పౌల్ హీరోయిన్ గా చేస్తోంది. నాగచైతన్య శివకృష్ణ అనే స్టూడెంట్ గా కనపడతాడు. తను పుట్టి పెరిగిన బెజవాడ కోసం ఎంతకైనా తెగించే యువకుడుగా ఈ పాత్రను డిజైన్ చేసారు. దర్శకుడు వివేక్ కృష్ణ మాట్లాడుతూ ..యాక్షన్‌, భావోద్వేగాలు మిళితమైన చిత్రమిది. నాగచైతన్య నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒక మాస్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయకుడిగా తను తెరపై కనిపించే తీరు అందరికీ నచ్చుతుంది. చైతన్య-అమలాపాల్‌ మధ్య వచ్చే ప్రణయ సన్నివేశాలు యువతరాన్ని మెప్పించేలా ఉంటాయి. బెజవాడ నేపథ్యం ఒక కీలక పాత్రలా చిత్రానికి ఉపయోగపడిందని అన్నారు.
'బెజవాడ' ప్రీమియర్ షో టాక్ ఏంటి?
రామ్ గోపాల్ వర్మ, నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందిన బెజవాడ చిత్రం ప్రివ్యూలను ప్రసాద్ ల్యాబ్స్ లో నిన్న రాత్రి వెయ్యటం జరిగింది. చూసిన వారి టాక్ ప్రకారం ఈ చిత్రం బెజవాడ చిత్రం రెండు కుటుంబాల మధ్యన జరిగే రివేంజ్ స్టోరీ. విజయవాడని నేపధ్యంగా తీసుకున్నారు కానీ నిజానికి ఈ కథ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరిగినా పెద్ద తేడా ఉండదు. చాలా కాలంగా సిటీలో ఉండే లోకల్ పొలిటీషన్స్ వైరం ఈ సినిమాకు కీలకం. అయితే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్, సీన్స్ విజయవాడ నేటివిటిలోని కొందరని రిసెంబల్ చేసేలా తీసుకున్నారు. ప్రత్యేకమైన ప్రాంతంలోని వారి మనోభావాలని, సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనే ఈ చిత్రంలో ఎక్కువ కనపడిందని షో చూసిన కొందరు కామెంట్స్ చేయటం గమనార్హం. రెగ్యులర్ రివేంజ్ స్టోరీనే తప్ప మరొకటి కాదని, మాస్ కు పట్టే అవకాశ ముందని మరికొందరు అంటున్నారు. బోయపాటి శ్రీను తరహాలో హింస ని బాగా గ్లోరిఫై చేసి చూపాడని సినిమా ఎలాగున్నా దర్శకుడుకి మాత్రం పెద్ద హీరోల సినిమాలు వచ్చే అవకాసం ఉందని కొందరు సిని పెద్దలు అనుకోవటం జరిగింది. ఫస్టాప్ లో నాగచైతన్య పెద్దగా కనపడడు. సెకండాఫ్ లో అతను పూర్తిగా తన గ్రిప్ లో తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అయితే యాక్షన్ పరంగా నాగచైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందంటున్నారు. నాగార్జున శివతో పోల్చి చూసే ప్రయత్నం మాత్రం అనవసరం అని తెలుస్తున్నారు.
’బెజవాడ’ కష్టాలపై...నాగార్జున రిక్వెస్ట్!బెజవాడలో..బెజవాడ సినిమాకు చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇంతకీ ఆ దుస్థితి ఏమిటంటే....ఈ సినిమాకు విజయవాడలో అసలు థియేటర్లే దొరకడం లేదు. దొరకడం లేదనడం కంటే ఈ సినిమాను ప్రదర్శించడానికి థియేటర్ల యజమానులు ఇష్ట పడటం లేదు అనడం కరెక్ట్. మామూలుగా ఈ రేంజ్ సినిమా బెజవాడ, పరిసర ప్రాంతాలు కలిపి కనీసం 40 థియేటర్లలో విడుదల కావాలి. కానీ కేవలం నాలుగు థియేటర్లు మాత్రమే దొరికాయి. బెజవాడ సినిమా రూపొందుతున్నప్పటి నుంచే కాంట్రవర్సీలకు కేంద్రంగా మారింది. ఈ సినిమా బెజవాడలో గతంలో జరిగిన ముఠా తగాదాల నేపథ్యంలో రూపొందించారని, బద్దశత్రువులైన దేవినేని, వంగవీటి వర్గీయుల ప్రస్తావన ఈ సినిమాలో ఉందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రదర్శిస్తే ఏమైనా గొడవలు జరిగితే థియేటర్లను నష్టపోతాం అని వాటి యజమానులు భయ పడుతున్నారు. చివరకు నాగార్జున ఫోన్ చేసిన మరీ థియేటర్ల యజమానులను రిక్వెస్ట్ చేసే వరకు పరిస్థితి వెళ్లిందంటే.....అక్కడి సీన్ అర్థం చేసుకోవచ్చు.  ఈ సినిమా విడు దల  నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. .