14, నవంబర్ 2011, సోమవారం

బాబు ఆస్తులపై సిబిఐ విచారణ: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కోర్టు నిర్దేశించింది.1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు విజయమ్మ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు, అవినీతి వ్యవహారాలు, బినామీ ఆస్తులు, భూ ఆక్రమణ తదితర అంశాలను వివరిస్తూ విజయమ్మ 2424 పేజీల నివేదికని కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు బినామీ సంబంధాలు, ఎంపి సుజనా చౌదరి, సిఎం రమేష్ లతో ఉన్న వ్యాపార సంబంధాలు, ఏలేరు కుంభకోణంలో కోట్ల రూపాయల అక్రమార్జన వ్యవహారాలను కూడా ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. చిత్తూరు డెయిరీని నాశనం చేసి, హెరిటేజ్ డెయిరీకి ఏ విధంగా లాభాలు చేకూర్చింది, సింగపూర్ లో హొటల్ వివరాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో చంద్రబాబు సాగించిన అక్రమాలను విజయమ్మ తన పిటిషన్ లో వివరించారు.
ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.

స్వతంత్ర నివేదికలు కోరిన హైకోర్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు,మరో 13 మంది ఆస్తులపై విచారణకు ఆదేశించిన హైకోర్టు వివిధ ప్రభుత్వ శాఖల స్వతంత్ర నివేదికలు కోరింది. పిటిషనర్ ఇచ్చిన అనేక పత్రాలు , డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేయాలని ఆదేశించింది. హొం శాఖ కార్యదర్శి, డిజిపి, సిబిఐ డైరెక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సెబీలు ఎవరికి వారు విచారించి, స్వతంత్ర నివేదికలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు అధికారాన్ని, హొదాని దుర్వినియోగం చేసినట్లుగా పిటిషనర్ ఆరోపించినట్లు కోర్టు తెలిపింది. పిటిషనర్ ఇచ్చిన డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు హైకోర్టు తెలిపింది.
  చంద్రబాబు ఆస్తులకు అంతేలేదు:లక్ష్మీపార్వతి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులకు అంతేలేదని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. సాక్షి టివి చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఏ అధికారంలో లేని జగన్ పై విచారణ జరుగుతున్నప్పుడు, 9 ఏళ్లు అవినీతి పాలనసాగించిన చంద్రబాబు ఆస్తులపై విచారణ జరుపవలసిన అవసరం ఉందన్నారు. విచారణలో ఆయనకు సహకరించిన రామోజీరావు లాంటివారు బయటకు వస్తారన్నారు. ఎటువంటి దొంగ ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ప్రజలు అందరూ తెలుసుకునే అవకాశం వచ్చిందని చెప్పారు. చంద్రబాబుది క్రిమినల్ మెంటాలిటీ అని ఆమె అన్నారు. విచారణకు అంగీకరించన్నారు. హైకోర్టు ఆదేశాలపై స్టే తెచ్చుకోవడానికి బాబు ప్రయత్నిస్తారని చెప్పారు.సిబిఐ నిజాయితీగా విచారించాలని ఆమె కోరారు. బాబు గురించి ఎల్లో మీడియాకు బాగా తెలుసన్నారు. తను చేసి అవినీతి ఆస్తుల వ్యవహారంలో తల్లిని కూడా ద్రోహిగా నిలబెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆమె విమర్శించారు. హైకోర్టు ఆదేశంపై ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు దురుదృష్టకరం అని ఆమె అన్నారు.
సిబిఐ ఎంతతొందరగా స్పందిస్తుందో చూడాలి:గట్టు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విషయంలో సిబిఐ ఎంత త్వరగా స్పందించిందో, చంద్రబాబు విషయంలో కూడా అంతే తొందరగా స్పందిస్తుందోలేదో చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. సాక్షి టివి చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జగత్ కిలాడీ అన్నారు. ఒక్క కేసు విషయంలో కూడా ఆయనపై విచారణ జరగలేదని చెప్పారు. ఆయనకు క్లీన్ చిట్ ఎక్కడ లభించిందో చెప్పాలన్నారు. సిబిఐ విచారణపై స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దని ఆయన చంద్రబాబుని కోరారు.రామోజీ రావు ఆస్తుల విషయంలో ఎంపి ఉండవల్ల అరుణ్ కుమార్ తన వద్ద ఉన్న ఆధారాలను సిబిఐకి అందజేయాలని ఆయన కోరారు.
నోటీసు ఇవ్వకుండా విచారణా?: చంద్రబాబు
విజయనగరం: ముందుగా నోటీసు ఇవ్వకుండా విచారణకు ఎలా ఆదేశిస్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైకోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేశారు. రైతు పోరుబాటలో భాగంగా ఈరోజు ఆయన కొత్తవలసలో ఉన్నారు. కోర్టు ఆదేశాలు వెలువడిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వడం అనేది సహజన్యాయం అన్నారు. తన ఆస్తులను, తన కుటుంబ సభ్యుల ఆస్తులను ఎప్పుడో స్పష్టంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. బినామీ ఆస్తులు ఉన్నట్లు రుజువు చేస్తే తన ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పారు. కోర్టు ఆదేశాలపై తమ న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ హయాంలో తనపై 18 సార్లు కోర్టుకు వెళ్లారని, 24 సార్లు విచారణకు ఆదేశించారని, ఒక్కసారి కూడా నిర్ధారణ కాలేదని చెప్పారు. సిబిఐ విచారణను స్వాగతిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు.

10, నవంబర్ 2011, గురువారం

భూమికి చేరువగా దూసుకువచ్చిన భారీ గ్రహశకలం

వాషింగ్టన్, నవంబర్ 9: నగరాల్లో ఓ పెద్ద ప్లాటంత గ్రహ శకలం ఒకటి బుధవారం తెల్లవారుజామున భూమికి దగ్గరగా దూసుకు పోయింది. ఇంత పెద్ద గ్రహ శకలం ఒకటి భూమివైపు దూసుకు రావడం గత 35 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2005 వైయు 55గా శాస్తజ్ఞ్రులు నామకరణం చేసిన 400 మీటర్ల వెడల్పు ఉండే ఈ గ్రహ శకలం భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో భూమికి 2,01,700 మైళ్ల దగ్గరగా దూసుకువచ్చింది. అయితే ఆ వెంటనే గంటకు 46,700 కిలోమీటర్ల వేగంతో అది మళ్లీ విశ్వంలోకి వెళ్లిపోయింది. 1976 తర్వాత ఇంత పెద్ద గ్రహ శకలం భూమికి ఇంత దగ్గరికి ఎప్పుడూ రాలేదని, 2028 దాకా మళ్లీ రాబోదని నాసా అధికారులు చెప్తున్నారు. ఈ గ్రహ శకలం వాస్తవానికి భూమికి చంద్రుడికన్నా దగ్గరగా వచ్చినట్లు లెక్క. ఎందుకంటే చంద్రుడు భూమికి 2,38, 854 మైళ్ల దూరంలో ఉన్నాడు. అయితే ఈ గ్రహ శకలం ఇంత దగ్గరగా వచ్చినప్పటికీ అది భూమిని ఈ రోజు ఢీకొట్టే ప్రమాదం ఏమీ లేదని శాస్తజ్ఞ్రులు చెప్పారు. అయితే ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వచ్చే సమయం కోసం శాస్తజ్ఞ్రులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గ్రహ శకలాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇది వారికి అరుదైన అవకాశాన్ని కల్పించింది.ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వచ్చే ముందు, అలాగే దూరంగా వెళ్లిపోయేటప్పుడు నాసా తీసిన ఫోటోలు, వీడియో చిత్రాలను బట్టి చూస్తే ఈ గ్రహ శకలం గుండ్రంగా ఉన్నప్పటికీ బోలుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని శాస్తజ్ఞ్రులు దీని సైజు, ఉపరితలం తీరు, పరిభ్రమించే సమయం, కక్ష్యలాంటి వాటి వివరాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడం కోసం పోర్టారికోలోని భారీ రేడియో టెలిస్కోప్‌తో పాటుగా కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్‌లో ఉన్న నాసాకు చెందిన విశ్వాంతరాళ పరిశోధనా కేంద్రం వద్ద పలు పరికరాలను దానిపైకి ఫోకస్ చేసారు. ప్రస్తుతం 2005వైయు 55 15 నెలలకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. అయితే కనీసం వచ్చే శతాబ్ది దాకా ఈ గ్రహ శకలం వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని ఖగోళ శాస్తజ్ఞ్రులు ఇప్పటికే నిర్ధారించారు.

అసలు బూచి... ‘ అండ్రాయడ్ ’

-మొబైళ్ల నడుమ ప్రాసెసర్ల యుద్ధం
కంప్యూటర్ కనిపెట్టినపుడు దాని సైజు లారీ అంత వుందని అందరూ అనుకోవడం, కొందరు తెలుసుకోవడం తెలిసిన విషయాలే. అలాంటి కంప్యూటర్ డెస్క్‌టాప్‌గా మారిన తరువాత కూడా అనేక పరిణామాలు సంభవించాయి. పి వన్ అనే సంక్షిప్తనామంతో పెంటియమ్ వన్ ప్రాసెసర్ దాదాపు ఇపుడు కంప్యూటర్లు వాడుతున్న వారిలో చాలామందికి పరిచయం వుండనే వుంటుంది. అంతకు ముందు 386, 486 ప్రాసెసర్లు కూడా వుండేవనీ గుర్తుండే వుంటుంది. అయితే ఇక్కడ కంపెనీల మాయాజాలం ఒకటి వుంటుంది. కొత్తది వచ్చినపుడల్లా పాతకు ధర తగ్గడం అన్నది మార్కెట్ సహజ సూత్రం. ఇలా అయితే కొత్తవి అమ్ముడుపోవు. కొత్తవి అమ్ముడు పోవాలంటే మరేదో కావాలి.. మరేదో చేయాలి. అంటే కొన్ని కావాలంటే మరికొన్ని వుండాలన్న తీరుగా. కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు, గేమ్‌లు, గ్రాఫిక్స్ కనిపెట్టి, ఇవి అన్నీ కావాలంటే మరింత వేగవంతమైన ప్రాసెసర్ వుండాలన్నది టెక్నిక్‌గా వాడారు. దాంతో పీ వన్ నుంచి టూ, త్రీ, ఫోర్, ఆపై డ్యూయల్ కోర్, కోర్ టూ డ్యూ, తాజాగా ఐ త్రీ, ఫైవ్, సెవెన్ వరకు ప్రయాణం సాగుతోంది. మొత్తం మీద కంప్యూటర్ ధరలు మాత్రం అక్కడే వుండేలా జాగ్రత్త పడుతున్నారు. పదివేలలోపూ కంప్యూటర్ దొరుకుతుంది. కానీ మీకు తాజా ప్రాసెసర్ ఉండదు.

ఇప్పుడు ఇదే మార్కెట్ వ్యాపార సూత్రం మొబైల్ రంగానికీ పాకింది. ప్రాసెసర్ అన్నది కంప్యూటర్లకు మొబైళ్లకు ఎంత కీలకమో, అదే ఇప్పుడు వ్యాపారానికి కూడా కీలకంగా మారింది. మొబైళ్లలో కూడా చిన్నదో పెద్దదో, ఏదో తరహాకు చెందిన ప్రాసెసర్ అన్నది అవసరం అన్న సంగతి తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్‌కు ఇది మరీ కీలకం. ముఖ్యంగా కంప్యూటర్ చేసే పనులన్నీ మొబైల్‌లో చేయాలనుకున్నపుడు దానికి తగిన సామర్థ్యం కలిగిన ప్రాసెసర్ వుండాల్సిందే.

అయితే స్మార్ట్ ఫోన్‌ల ఆరంభం పెద్దగా ఆసక్తికరంగా ఎంతమాత్రం లేదు రెండేళ్ల క్రితం వరకు. మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్‌ను మొబైళ్ల కోసం ప్రత్యేకంగా విండోస్ మొబైల్ పేరిట తీసుకువచ్చేక కూడా ఇది ఏమంత పుంజుకోలేదు. ఎటొచ్చీ అండ్రాయిడ్ పేరుతో గూగుల్ మొబైళ్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకురావడంతో పెనుమార్పులు ప్రారంభమయ్యాయి.

వాస్తవానికి అండ్రాయిడ్ గూగుల్ ఆవిష్కరణ కాదు. అండ్రాయిడ్ ఇన్‌కార్పొరేషన్ అనే సంస్థను 2005లో తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీన్ని 2003లో ఆండీ రూబిన్, రిచ్‌మైనర్, నిక్‌సియర్స్, క్రిస్ వైట్ అనే వివిధ ఎలక్ట్రానిక్ రంగానికి చెందిన నలుగురు ప్రారంభించారు. ఈ సంస్థ కేవలం మొబైళ్ల కోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే పనిలో పడింది. అయితే మధ్యలోనే వివిధ ఆర్ధిక కారణాల వల్ల సంస్థ అండ్రాయిడ్ చేతిలోకి వచ్చి, వారిలో కొందరు గూగుల్ సిబ్బందిగా మారిపోయారు. ఆ తరువాత 2007లో ఓపెన్ హ్యాండ్ సెట్ అలియన్స్ అనే కన్సార్టియం ఏర్పాటయింది. దీనికి పలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలికాం కంపెనీల ఆర్ధిక మద్దతు వుంది. గూగుల్ ఆధ్వర్యంలో నడిచే ఈ కన్సార్టియం 2007 నవంబర్ 5న తొలి బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. అదే అండ్రాయిడ్ 1.0. ఈ ఓఎస్ ఆధారంగా వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ హెచ్‌టీసీ డ్రీమ్. ఆ తరువాత వరుసగా అండ్రాయిడ్ 1.1 (2008 సెప్టెంబర్), 2009 ఏప్రిల్ 30న 1.5 విడుదలయ్యాయి. 1.5 నుంచీ ఓఎస్‌కు తిండిపదార్ధాల పేర్లు పెట్టండం ప్రారంభమయింది. 1.5కు కప్‌కేక్ అని పేరుపెట్టారు. ఆపై వరుసగా, 1.6 డోనట్ (సెప్టెంబర్ 2009), 2.0 ఎక్లైర్స్ (అక్టోబర్ 2009), 2.2 ఫ్రాయో (మే 2010), 2.3 జింజర్‌బర్డ్, ఆపై 3.0 హానీకూంబ్ విడుదలయ్యాయి. తాజాగా 4.0 ఐస్‌క్రీమ్ సాండ్‌విచ్ వచ్చింది.

ఇదీ సంక్షిప్తంగా అండ్రాయిడ్ హిస్టరీ.

గూగుల్ చాలా తెలివైన వ్యాపార సంస్థ. సూక్ష్మంగా అర్ధమయ్యేలా చెప్పాలంటే విషయం వున్నా లేకున్నా, హైప్ తేవడంలో మన తెలుగు సినిమా జనం ఎలా నిష్ణాతులో, ఒక ఉత్పాదన పట్ల ఆసక్తి కలిగించడంలో గూగుల్ అంతటి దిట్ట. గూగుల్ కల్పించిన ప్రాచుర్యంతో అండ్రాయిడ్‌కు రావాల్సినదాని కన్నా ఎక్కువ పేరే వచ్చింది. దీంతో విండోస్ మొబైల్ వెనక్కుపోవడంతో పాటు దాదాపు ఒక్క నోకియా, ఆపిల్ మినహా మిగిలిన అన్ని చిన్నా, పెద్దా టెలికాం సంస్థలన్నీ గూగుల్ అండ్రాయిడ్ ఓఎస్‌తో ఫోన్లు మార్కెట్‌లోకి తేవడంలో పోటీ పడ్డాయి. మొబైల్ అంటే కేవలం మాట్లాడుకునేందుకు అన్న సంగతి తుడుచుపెట్టుకుపోయింది. లక్షలాది అప్లికేషన్లు గూగుల్‌కు అనుబంధంగా స్టోర్‌లో సిద్ధమయ్యాయి. కేవలం వందా యాభైకి అప్లికేషన్లు లభించడం పెద్ద సౌలభ్యంగా మారింది. ఔత్సాహికులు కూడా పలు అప్లికేషన్లు రాసి అందించడం, దాని ద్వారా ఆర్ధికంగా సంపాదించుకోవడం మామూలయింది. ఇలా అండ్రాయిడ్ ద్వారా అప్లికేషన్లు, అప్లికేషన్ల ద్వారా అండ్రాయిడ్ పాపులర్ కావడంతో, మొబైల్ కంపెనీలన్నీ ఆ ఫీచర్లన్నీ తమ ఫోన్ ఫీచర్లన్నట్లుగా ప్రచారం చేసుకుని అమ్మకాలు పెంచుకుంటున్నాయి.

ఇప్పుడు మళ్లీ వెనక్కువస్తే, ఇన్ని అప్లికేషన్లు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలంటే కాస్త శక్తివంతమైన ప్రాసెసర్ కావాలి. పైగా మొబైళ్ల సైజుకు అనుగుణంగా వుండాలి. దీంతో ఆ తరహా ప్రాసెసర్లు తయారయ్యాయి.

స్నాప్‌డ్రాగన్, హమ్మింగ్ బర్డ్, ఎన్‌విడియా టెగ్రా, టెక్సాస్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా పేర్లలా వున్న ఇవీన్నీ మొబైల్ ప్రాసెసర్ల పేర్లే. గత ఏడాది ఐఫోన్ 4 విడుదలైనపుడు తొలిసారి శక్తివంతమైన వన్ గిగాహెడ్జ్ ప్రాసెసర్‌ను ఆర్ట్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించి విడుదల చేసింది. ఇన్‌ట్రిన్‌సిక్ అనే సెమీ కండక్టర్ కంపెనీ దీన్ని రూపొదించింది. ఇది ఆపిల్ చేజిక్కించుకున్న కంపెనీల్లో ఒకటి. శ్యామ్‌సంగ్ హమ్మింగ్‌బర్డ్ దీనికి గట్టిపోటీ. గెలాక్సీ ఎస్ సిరీస్‌లో వాడేదిదే. పలు టాబ్లెట్లలో వాడే ఎన్‌విడియా ప్రాసెసర్ కూడా తక్కువదేమీ కాదు.

ఇప్పుడు వన్ గిగాహెడ్జ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గిగాహెడ్జ్ సామర్థ్యం వున్న మొబైళ్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. వీటిలో గెలాక్సీ నోట్, ఎస్‌టూ, మోటరోలా డ్రాయిడ్ రేజర్, వున్నాయి. మరోపక్క దేశీయ కంపెనీలు అండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే తక్కువ రేంజ్ ఫోన్‌లను తెస్తున్నాయి. వీటి ప్రాసెసర్‌లు మహా అయితే 600మెగాహెడ్జ్ మించి వుండవు. ర్యామ్ 256 ఎమ్‌బీ వరకు వుండొచ్చు. దానికి తోడు వీటికి అదనపు సదుపాయాలుండవు. ఉదాహరణకు హై రిజల్యూషన్ డిస్‌ప్లే, ఓఎమ్‌ఎల్‌ఇడీ, గెరిల్లా గ్లాస్, హెచ్‌డీ విడియో, క్రిస్టల్ గ్రాఫిక్స్ ఇలా.. ఇలాంటివన్నీ జోడిస్తే ధర మళ్లీ ముఫై దగ్గరకు చేరిపోతుంది. అంటే దానా దీనా తేలేదేమిటంటే ధరలు అక్కడే వుంటాయి. సామర్థ్యాలు పెరుగుతుంటాయి. అవసరాలు పెంచుతుంటారు. ఇదీ కంప్యూటర్ కంపెనీల మాయాజాలం. మరోపక్క మొబైల్ ప్రాసెసర్లను ఉపయోగించి టాబ్లెట్లను రూపొందించడం ప్రారంభమైంది. ఇక్కడ కూడా టాబ్లెట్‌లకు వచ్చిన క్రేజ్‌ను కంపెనీలు వాడుకోవడం ప్రారంభించాయి. పదివేల లోపే టాబ్లెట్ అని ప్రచారం మొదలయింది. వాస్తవానికి వాటి పనితీరు కూడా అంతంతమాత్రం కావడం గమనార్హం. ఎయిర్‌టెల్ సంస్థ చైనా కంపెనీ టాబ్లెట్‌ను రీబ్రాండ్ చేసి తొమ్మిదివేలకు భారతీ మ్యాజిక్ పేరిట విక్రయిస్తున్నా స్పందన అంతతమాత్రం. ఎందుకంటే రాజును చూసిన కళ్లతో అన్నట్లు మిగిలిన బడా టాబ్లెట్ల ముందు అది ఆనడం లేదు. హెచ్‌సిఎల్, వ్యూసోనిక్ తదితర కంపెనీల టాబ్లెట్లకూ స్పందన అంతత మాత్రమే. అంటే వినియోగదారుడు తక్కువ ధరతో పాటు పనితీరు కూడా గమనిస్తున్నాడని అర్ధమవుతుంది. ఇది మంచి పరిణామమే. కంపెనీల మాయాజాలంలో పడకుండా కొనుగోలుదారులే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం వుంది. మొబైల్‌తో లేదా టాబ్లెట్‌తో వారి అవసరాలేమిటి? అందుకు సరిపోయే ప్రాసెసర్, ఇతర సదుపాయాలేమిటి చూసుకుని రేంజ్‌ను డిసైడ్ చేసుకోవాలి. అదే విధంగా కంపెనీలు వాటికి గూగుల్‌తో వుండే ఒప్పందాలు, అప్‌డేట్‌లు, కొత్త వెర్షన్‌లు వచ్చే సదుపాయాలు చూసుకోవాలి. అలా కాకుండా అండ్రాయిడ్ ఫోన్, అయిదువేలలోనే వస్తోందనుకుంటే మళ్లీ ఇబ్బందులు పడే అవకాశం వుంది. కాదు అలా అని హైఎండ్‌కే పోదామనుకుంటే వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్ల స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఆచితూచి వ్యవహరించడం మేలు.

...................................................

దొరికిందీ...!
పక్కమీద వయ్యారంగా పడుకుని పుస్తకం చదువుతున్న భార్యపక్కకు చేరాడు వెంకటేశ్వర్రావ్. మెల్లగా మెడకింద చేయి దూర్చి అటూ ఇటూ కదిపాడు. ఆపై జుట్టులోకి వేళ్లు పోనిచ్చి మెడ వెనుక నిమిరాడు. కాస్పేటికి వీపుకిందకు చేర్చి సుతారంగా రాశాడు. ఆపై నడుం కిందకు, కాస్సేపటికి కాళ్ల దగ్గరకు చేరాడు. మెల్లగా మోకాళ్లు నొక్కి ఆపై రెండో పక్క చేరాడు. ఇలా ఏదో ఒక భాగంలో ఏదో ఒకటి చేస్తూ, ఉన్నట్లుండి లేచి, టీవీ దగ్గరకు వెళ్లి కామ్‌గా చూడ్డం ప్రారంభించాడు.
‘బాగుంది.. ఆపేసారేం.. కానివ్వండి’ అంది భార్య కనకరత్నం.
‘రిమోట్ దొరికేసింది’ బదులిచ్చాడు వెంకటేశ్వర్రావు.

...............................................................................................................................................

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ
ఓ అరడజను మంది కుర్రాళ్లు కాస్త వయసు మళ్లిన సన్నాసిరావు కలిసి యాత్రలకు బయల్దేరారు. వీళ్లలో ఓ మహానుభావుడికి గురకపెట్టే అలవాటు వుంది. ఇద్దరేసి ఒక గదిలో సర్దుకోవాల్సిన పరిస్థితి. మొదటి రోజు రాత్రి ఆ గురకేశ్వరుడితో గది పంచుకున్న కుర్రాడు మర్నాడు ఉదయానే్న బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చేసరికి సంతలో తప్పిపోయిన పిల్లాడిలా తయారయ్యాడు. కళ్లు చింతనిప్పుల్లా వున్నాయి.. జుట్టు లేచి నిల్చుంది.
‘ఏమయింది..రా’ అడిగారు మిత్రబృందం.
‘గురకా అది.. స్టోన్ క్రషర్ పక్కనే వున్నట్లు వుంది.. రాత్రంతా నిద్ర వుంటే ఒట్టు.. వాడికేసే చూస్తూ కూర్చున్నా’ బదులిచ్చాడు బాధితుడు.
మర్నాడు మరో బలిపశువు.
వాడూ షరా మామూలే. ఇలా కాదు.. ఈ ముసిలాడ్ని పంపేద్దాం. గొడవ వదిలిపోతుంది అని పేద్ద ఎత్తు వేశారు.
ముసిలాడు తెల్లవారి హ్యాపీగా విజిల్ వేస్తూ బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చాడు. తెల్లమొహం వేయడం వీళ్ల వంతయింది.
‘ఎలా..హౌ..’ఇలా ప్రశ్నలు కురిసాయి.
‘ఏముంది గదిలో పడుకునే ముందు.. కుర్రాడికేసి వాడి పర్సుకేసి చూసా.. నీ దగ్గర బాగానే డబ్బులున్నట్లున్నాయి.. చేతికి రింగు, బ్రేస్‌లెట్.. వ్యవహారం జోరుగానే వుంది.. అనేసి నిద్రపోయా.. నిద్రపోకుండా మెలకువగా వుండడం వాడి వంతయింది..’ బదులిచ్చాడు వయసుమళ్లిన వెంకటేశ్వర్రావు.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదే మరి.

................................................................................................................................................
టిట్ ఫర్...
నానమ్మ పుట్టిన రోజు వస్తోంది కదా ఏం గిఫ్ట్ కొంటున్నావ్’ ..అన్నయ్య చందూని అడిగింది, చెల్లి చంద్రమ్మ.
‘్ఫట్‌బాల్’ టక్కున బదులిచ్చాడు చందూ.
‘అదేంటి నానమ్మ ఏం చేసుకుంటుంది’
‘మరి నేను ఆడుకునే వయసులో వున్నపుడు నాకు ప్రతి పుట్టిన రోజుకి నానమ్మ పుస్తకాలే కొనిచ్చేది’ మాటల్లో చందూ కసో.. బాధో.. ఏదో ఒకటి తొంగిచూసింది.
ఎల్‌ఐసీ పాలసీ... మీరు మరణించిన తరువాత మిమ్మల్ని ధనవంతుల్ని చేసేందుకు కుదుర్చుకునే ఒప్పందం.

- నేనే

7, నవంబర్ 2011, సోమవారం

ఏది ప్రజాసాహిత్యం? ఏది కార్పొరేట్ సాహిత్యం?

‘ప్రజాసాహిత్యం’ కానిదంతా ఇప్పుడు కార్పొరేట్ సాహిత్యమే! కళకొరకు ఆనందం కొరకు తృప్తికొరకు వ్రాసామనేదంతా ప్రజా సాహిత్యం కానేరదు. ‘ప్రజాసాహిత్యం’ కానిదంతా కార్పొరేట్ సాహిత్యమన్నాను కనుక ‘ఏది ప్రజాసాహిత్యం’ తేలవలసిన అవసరముంది.ప్రపంచం పూర్తిగా మారిపోయింది. బహుళజాతి సంస్థల గుప్పిట్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఓటు ప్రయోజన సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయి. ప్రజాస్వామ్య దేశాలలో అంతరాలు బాగా పెరిగాయి. పేరుకు ప్రజాస్వామ్యం ఆచరణలో ధనస్వామ్య దేశాలుగా మారిపోయాయి. ప్రపంచీకరణ ఆధునిక విజ్ఞానాన్ని పెంచి-ఆధునిక విజ్ఞానం కార్పొరేట్ శక్తుల దోపిడీకి వరంగా మారి-ప్రజలపాలిట రాక్షసిగా మారిపోయింది. ‘ప్రపంచీకరణ’ ప్రభావం ఎంత బలంగా ఉందంటే కమ్యూనిస్టు దేశంగా పిలువబడే చైనా పెట్టుబడి దేశంగా మారిపోయింది. ప్రపంచీకరణ తర్వాత అన్ని దేశాలు ఇంచుమించు పెట్టుబడి దేశాలుగా మారిపోవాల్సి వచ్చింది.
ప్రపంచీకరణకు అనుకూలంగా వ్రాసే సాహిత్యమంతా కార్పొరేట్ సాహిత్యమే. ప్రతికూలంగా వ్రాసేది మాత్రమే ప్రజాసాహిత్యమవుతుంది. ఈనాడు ప్రతి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఇదంతా ప్రజల కొరకనే నమ్మిస్తుంది. ప్రజలు తిరగబడకుండా సంక్షేమ పథకాల ముష్టి విదిలిస్తుంది. ప్రజల కొరకు రాసింది లేదా ప్రజలను హీరోను చేసింది, ప్రజల సంస్కృతిని ప్రతిబింబించేది ప్రజాసాహిత్యం. ఇంకా సరైన నిర్వచనం ఇవ్వాలంటే- శ్రామికులు మాత్రమే ప్రజలు. ఈ కోణంలో శ్రామిక సంస్కృతి ప్రజా సంస్కృతి అవుతుంది. ఆఫీసర్ల సంస్కృతి కార్పొరేట్ సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది. ప్రజాసంస్కృతి శ్రమైక జీవన సౌందర్యంతో నిండివుంటుంది. శ్రమైక జీవన సౌందర్యమే నిజమైన ప్రజాసాహిత్యం. ఆధునికత దోపిడీ శక్తులకు సరికొత్తగా దొరికిన ఆయుధం. ఇది అర్ధంకాని రచయితలు ఆధునికతను ఆకాశానికెత్తేశారు. ‘‘పొలం దున్నితే ఏమొస్తుంది?’’ ‘‘మగ్గం నేస్తే ఏమొస్తుంది?’’, ‘‘కుండలు కాలిస్తే ఈ కాలంలో బతుకుతామా?’’-ఈ వాదనలో వాస్తవముండవచ్చు. ఈ వాదన వెనక ఇంకో వాస్తవముంది. ‘‘పొలం దునే్నవాళ్లు-మగ్గం నేసేవాళ్లు, కుండలు కాల్చేవాళ్లు’’ ఎలా బతకాలి వాళ్ల బతుకుతెరువు ఏమిటీ? వాళ్ల గూర్చి వ్రాసేది ప్రజాసాహిత్యం, పొలం దున్నటంలో, మగ్గాల స్థానంలో, కుండల తయారీలో ఆధునికత వచ్చి వెయ్యిమంది పని ఒక యంత్రం చేసినప్పుడు ఆ యంత్రం యజమాని ఆధునికత సృష్టించిన దోపిడీ దారు. ‘ఆధునికత’ మామూలు ప్రజలకు శత్రువుగా మారింది. అయితే- మొత్తం ఆధునికతను కొట్టిపారేయలేం! ‘ఆధునికత’ సరికొత్త దోపిడీని సృష్టించకపోతే మంచిదే. ఈ వైరుధ్యాలు ఈ వ్యవస్థకున్న సంబంధాన్ని అర్ధం చేసుకుని వ్రాసేవాడే నిజమైన ప్రజారచయిత. ప్రజా రచయిత మొదట వ్యవస్థ స్వరూపాన్ని అర్ధం చేసుకోవాలి. అర్ధం చేసుకోపోతే ప్రజలపక్షాన వ్రాయలేడు. నేను సృష్టించే సాహిత్యం ఆనందం, అనుభూతి కొరకు ప్రజలకొరకు కాదు అనే రచయిత తటస్థ రచయిత కాదు. కార్పొరేట్ రచయితలలో ఆయన ఒకరు. ఆయన రచనలు డైరక్టుగా కార్పొరేట్ సామ్రాజ్యానికి అంకితం కాకపోవచ్చు. పరోక్షంగా కార్పొరేట్ సామ్రాజ్యానికి మద్దతుగా ఉంటాయి.
చెట్లు, పూలు, వెనె్నల గూర్చి వ్రాసారనుకుందాం. ఈ వ్యవస్థలో ఇవన్నీ దోపిడీకి గురి అవుతున్నాయి. ఎలా దోపిడీకి గురి అవుతున్నాయో అర్ధం చేసుకోకుండా చెట్టునీడ గురించి, పూలవాసన గురించి, వెనె్నల అందం గురించి వ్రాస్తే లాభమేమిటి?- ప్రకృతిని మనకు కాకుండా చేస్తున్న కార్పొరేట్ సామ్రాజ్యం మన ముందు ఉంది. అడవులను ధ్వంసం చేసి వనరులను దోపిడీ చేసి గిరిజనుల జీవితాలను బూడిద చేస్తున్న బహుళజాతి సంస్థలు మన ముందు ఉన్నాయి. వీటి గూర్చి వ్రాయకుండా-వెనె్నల గురించి వ్రాసి అనుభూతి పేరుతో ‘రచన’ అనటం పలాయన వాదమే తప్ప ప్రజలపక్షాన నిలబడిన రచయిత కాలేడు. సాహిత్యం కాదు. ఈ వ్యవస్థను అర్ధం చేసుకోవడంలోనే ప్రజా సాహిత్య వౌళిక స్వరూపం దాగి ఉంది. ఈ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థగా భావిద్దాం! అలా చెప్పుకుంటున్నారు. ఈ దేశంలో నిజమైన ప్రజలంటే ఎవరు?-శ్రమను నమ్ముకున్న వారు ప్రజలు. ఈప్రజలు చట్టసభలోకి వెళ్లగలుగుతున్నారా?-కోటీశ్వరులు మాత్రమే చట్టసభలలోకి వెళ్లగలిగిన బోగస్ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. కోటీశ్వరులు తమకనుకూలంగా తమ వ్యాపారానికి దోపిడీకి సమర్ధనీయంగా ‘చట్టం’ చేసుకుంటారు. అది ఆమోదమవుతుంది. అమలులోకి వస్తుంది. ఇంకా ఏముంది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని ఏ ముఖంపెట్టుకుని విర్రవీగగలం? ఈవిషయం వ్రాయని వాడు ప్రజా రచయిత కాలేడు. ఇది పక్కా దోపిడీ వ్యవస్థ. పది సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్య వ్యవస్థ రూపురేఖలయినా కొంత కనిపించేవి. ప్రజలంటే కొంత భయముండేది. ఇంత దగాకోరుతనం ఇంత విచ్చలవిడి మోసం ఉండేది కాదు. ఇప్పుడు దోపిడి నగ్నంగా నిలబడింది. చట్టబద్ధ దోపిడీ-చట్టబద్ధ దోపిడీని ధిక్కరించడమంటే-చట్టాన్ని ధిక్కరించడమే, ఈనాడు చట్టాన్ని ధిక్కరించే వాడే ప్రజారచయిత.
నిజంగా ‘చట్టం’ మూలంగా పేద ప్రజలకు ఒరుగుబాటుందా?- చట్టం మూలంగా పేదోడి ఆకలి కడుపు నిండుతుందా? కోట్లాది పేదలు ఆకలితో చస్తూ ఉంటే సర్కారు గోదాంలలో ధాన్యం ముక్కి పోతోందని, ఎలుకల పాలవుతుందని-ఇదంతా బీదలకు పంచమని ఉన్నత న్యాయస్థానం చెప్పినా పట్టించుకున్న నాధుడు లేడు. ఇంక ఏ చట్టాలను నమ్ముకుంటారు ప్రజలు. ‘చట్టం’ మూలంగా అవినీతి తగ్గుతుందా?- ఎన్నికల వ్యవస్థలో డబ్బు ప్రభావాన్ని తగ్గించగలదా?- చిత్రహింసలకు గురి అవుతున్న స్ర్తిని పురుషాధిపత్య సంకెళ్లనుండి అది రక్షించగలదా?- అగ్రవర్ణాల అహంకారం నుండి అణగారిన వర్గాలకు చట్టం తోడుగా ఉండగలదా? ఏ చట్టం పేద ప్రజలకు ఉపయోగపడిందో-ఉపయోగపడుతోందో చెప్పగలరా? దోపిడీ వర్గంలోని వైరుధ్యాలను కక్షపూరితంగా వాడుకోవడానికి చట్టం పనిచేస్తూ ఉంది. దోపిడీ వర్గాలు శిబిరాలుగా చీలిపోయాయి. ఒకరిమీద ఒకరు దుమ్ము పోసుకోవడానికి, కక్ష తీర్చుకోవడానికి చట్టం పనికొస్తుంది. జి2 స్కాంపై సుబ్రమణ్యస్వామి పోరాటం అలాంటిదే-పైగా చట్టం ప్రజల హక్కులమీద చట్టబద్ధంగా దాడి చేయడానికి, అరెస్టు చేయడానికి-ఆఖరుకు ఎన్‌కౌంటర్ చేయడానికి పనికొస్తుంది. ఇప్పుడు ప్రజలెలా ఉన్నారు? పోరాడుతున్నారు. పిడికిలెత్తుతున్నారు. ధిక్కరిస్తున్నారు. మరికొంత మంది దుఃఖంతో, కన్నీళ్లతో, ఆకలితో, అప్పులతో, సమస్యలతో, అవినీతితో, అధిక ధరలతో, కరెంటు కోతతో, అశాంతితో పాలుపోక-ఏమీ చేయలేక నిశ్శబ్దంగా దుఃఖిస్తున్నారు. తిరగబడే దగ్గర తిరగబడుతున్నారు. మొత్తంమీద ఈ వ్యవస్థపట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజకీయ నాయకులకు ఓట్లు వేస్తారు? వారు ఎటువంటివారు?-ప్రశ్నించు . డాక్టర్ కాళ్లు మొక్కి డబ్బులిచ్చి వైద్యం చేయించుకుంటారు బయటకు వచ్చినప్పుడు ‘డాక్టర్ ఎలాంటివాడని ప్రశ్నిస్తే? ‘దొంగలు’ అనేస్తారు. షాపులో సామాను కొంటారు. బిల్లు కట్టి బయటకు వచ్చిన తర్వాత ‘దోచుకుంటున్నారు’ అనేస్తారు. న్యాయవాదికి డబ్బిచ్చి కేసు అప్పగిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ‘దొంగనాకొడుకు’ అనేస్తారు. వీళ్లంతా దొంగలా?-కాదు. కానీ మామూలు ప్రజల దృష్టిలో వీరంతా దొంగలయ్యారు. ఎందుకూ? వ్యవస్థ దొంగలమయమైంది. దోపిడీదారుల వశమైంది కనుక మనం వ్రాసే సాహిత్యం ‘దొంగలకు’ వరంగా మారకూడదు. మన రచన ప్రత్యక్షంగా, పరోక్షంగా దోపిడీకి సహకరించకూడదు. అంటే-శ్రమ ప్రజల దిక్కు నిటారుగా అంకిత భావంతో నిలుచుని వారి దుఃఖాన్ని సమస్యలను వ్రాస్తూ-వారి మనసులో ఉన్న ధిక్కార భావాన్ని పోరాటరూపంగా మార్చేవాడే నిజమైన రచయిత.
పది సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిని కార్పొరేట్ శక్తులకు పంచడానికి భయపడేవారు. కానీ ఇప్పుడు కోట్ల ప్రజలకు ఇల్లు, భూమి కల్పించాల్సిన ప్రభుత్వమే సెజ్‌ల పేరుతో లక్షలాది ప్రజల తరతరాల భూమిని లాక్కుంటోంది బలవంతంగా. ఎన్నో చోట్ల ఇందుకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది. ఈ తరుణంలో నిజమయిన ప్రజారచయిత కర్తవ్యమేమిటి? ప్రజలభూమికి, ఆస్తికి బాసటగా ఉండాలి. ప్రజల పోరాటానికి మద్దతు పలకాలి. ఎంతమంది రచయితలు ఇలా ఉన్నారు. ఇది మా పని కాదు. ప్రజలను ఆనందింపచేయడానికి, రచనలు వ్రాస్తున్నాం అనేవారున్నారు. ఈ తరుణంలో సంతోషం, ఆనందం ఎవడికి కావాలి? కాలక్షేప రచనలు మనసును మధురిమలలో ఓలలాడించే రచనలు కార్పొరేట్ సాహిత్యం తప్ప ప్రజాసాహిత్యం కాదు. ‘సెజ్’ల దోపిడి మామూలు విషయం కాదు. సెజ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. రచయితలు ప్రజల పోరాటాన్ని చిత్రించడం ధర్మం కాదా? ప్రజలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఈ బాధలకు ఎవరు కారకులు?-సరియైన విద్య లేదు. వైద్యం లేదు. రక్షణ లేదు. భద్రత లేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కుల వృత్తులు మంట గలిసాయి. ఉపాధి హామీలేదు. చదువుకున్నవారికి ఉద్యోగ గ్యారంటీ లేదు. దేశంలో విశృంఖలత్వం, జులాయితనం, గూండాగిరి, ఉగ్రవాదం పెరిగింది. నీతి పూర్తిగా కుప్పకూలింది. పేదోడు కడుపు నింపుకుంటాడో లేదో పరిస్థితి గడ్డుగా ఉంది. పోనీ ఇది ప్రజాస్వామ్యం కదాని? ఎన్నికల సమయంలో మంచివారిని ఎన్నుకోవడానికి అవకాశాలు లేవు. అన్ని రాజకీయపార్టీలు డబ్బున్న అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయి. డబ్బున్న వాళ్లకే టికెట్లు. వారికి బీదవాడి బతుకు అర్ధం కాదు. వీళ్లంతా కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తారు. వారికి అనుకూలంగా చట్టాలు నిర్మిస్తారు. వ్యవస్థ ఈ స్వరూపంలో ఉన్నప్పుడు- సాహిత్యం పేదవాడి ధర్మ యుద్ధానికి మద్దతుగా ఉండాలి. వాడి ఆలోచనలను, బాధలను దుఃఖాలను ఆవిష్కరించాలి. వాడి ధిక్కరణను, పోరాటాన్ని సాహిత్యం చిత్రించాలి. ప్రజలు నిశ్శబ్దంగా ఉండి ప్రజలకు ఏది మంచో గ్రహించి అది వ్రాసేవాడే నిజమైన ప్రజారచయిత.
                                                                                                                      -సిహెచ్ మధు, 9949486122

తెలుగులో కలం పేర్ల కథా కమామిషు...



చయితల మారుపేర్లను కలం పేర్లు, శ్యౄ జూళ ఔఖౄళ అని వ్యవహరించడం జరుగుతున్నది. ప్రాచీన సాహిత్యంలో, ముఖ్యంగా సంస్కృత సాహిత్యంలో కవుల మారుపేర్లు అనేకరకాలుగా సంక్రమించిన పేర్లు, ఆధునిక కాలంలో చాలావరకు పెట్టుకున్న పేర్లు, ప్రకటించుకున్న పేర్లు, యూరో అమెరికన్ సాహిత్యంలో ప్రసిద్ధ రచయితలు కొందరు కలం పేర్లతోనే ప్రపంచానికి తెలుసు. సామ్యూల్ క్లెమెన్స్ మార్క్‌టెయిన్ పేరుతో రచనలు చేశాడు. కథారచయిత ఓ.హెన్రీ అసలు పేరు విలియమ్ సిడ్నీ పోర్టర్. మేరీ ఎన్ ఇవాన్స్ కలం పేరు జార్జ్ ఇలియట్. పద్దెనిమిదవ శతాబ్ది ప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త అసలు పేరు ష్రాంసువా మేరీ అరోవ్. స్ర్తిలు పురుషుల పేర్లను కలం పేర్లుగా ఉపయోగించుకోవడం ఉండేది. పురుషులు కూడా స్ర్తిల పేర్లతో రాయడమూ కనిపిస్తుంది. ప్రక్రియనుబట్టి, రచనా స్వభావాన్నిబట్టి వేరు వేరు పేర్లతో రాసిన రచయితలున్నారు. శాస్త్ర రచయితలు సృజనాత్మక రచనలు చేసేప్పుడు వేరే పేరును ఉపయోగించడం కూడా కనిపిస్తుంది. ఒక పేరుతో ప్రసిద్ధమైన రచయిత వేరే పేరుతో రాస్తే ఒకే రీతిలో ఆదరిస్తారా లేదా అని తెలుసుకోవడానికి కలం పేరుతో కొన్ని రచనలు చేయవచ్చు.
రచయితలు పేర్లను ఎన్నుకోవడంలో అనేక దృష్టి కోణాలుంటాయి. పేరు సరళంగా ఉండి సులభంగా ప్రచారంలోకి రావడం ఒక ముఖ్యమైన ప్రయోజనం. గౌరవం పెరగడం, జనామోదం పొందడం కూడా పేర్లను ఎన్నుకోవడానికి కారణాలవుతున్నాయి. పేరు నాగరికంగా లేదని కొందరు పేర్లు మార్చుకుంటే, కొందరు తమ గుర్తింపును కప్పిపుచ్చుకోవడానికి కలంపేర్లు పెట్టుకుంటారు. కులం, మతం తెలియకుండా ఉండాలనుకుని వేరుపేర్లు పెట్టుకున్నవాళ్లున్నారు. ఎక్కువగా శృంగారాన్ని గుప్పించే రచయితలు తరచుగా మారుపేరుతోనే రచనలు చేస్తారు. కొన్ని రచనలకి రచయితలు ఎవరో తెలియకపోవచ్చు. వాటినే అజ్ఞాత కర్తృకాలని అంటున్నాం. వౌఖిక సంప్రదాయంలో సంక్రమించిన సాహిత్యం, జానపద సాహిత్యం అజ్ఞాత కర్తృకాలుగా పేర్కొనడం జరుగుతున్నది. కలం పేర్లను నిర్దిష్ట నామాలు, అనిర్దిష్ట నామాలు అని రెండు రకాలుగా గుర్తించవచ్చు. నిర్దిష్ట నామాలు వ్యక్తినామాల లాగే ప్రచారంలోకి వస్తాయి. కొందరు నిర్దిష్టమైన కలం పేర్లను ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడతారు. కొందరు అవసరాన్ని, సందర్భాన్నిబట్టి గుణవాచకాన్నో, విశేషణాన్నో కలం పేరుగా ఉపయోగిస్తారు. వీటిని అనిర్దిష్ట నామాలనవచ్చు. కాస్త వెనక్కి వెళ్లి పాత పత్రికలు తిరగేస్తే రచయితల మారుపేర్లు, కలం పేర్లు కోకొల్లలుగా కనిపిస్తాయి.
తెలుగు సాహిత్య లోకంలో కలం పేరుతో మాత్రమే తెలిసిన కవులు, రచయితలు చాలామందే ఉన్నారు. సరళంగా ఉండి, సులభంగా ప్రచారంలోకి వచ్చే పద్ధతిలో ఉంటాయి ఈ పేర్లు. ఆత్రేయ, ఆరుద్ర, అజంతా, ఎల్లోరా, ఓల్గా మొదలైన పేర్లు ఈ కోవలోకి వస్తాయి. కులం తెలియకుండా ఉండడానికి నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య అన్న పేర్లు పెట్టుకున్నామని దిగంబర కవులు ప్రకటించుకున్నారు. ఆరుగురూ కలం పేర్లతోనే ప్రసిద్ధి పొందారు. మతం తెలియకుండా పెట్టుకున్న పేర్లు రుద్రప్రియ, సుగమ్‌బాబు, కౌముది. ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను ఉపయోగించుకుంటారు.
ఆకాశవాణిలో పనిచేసిన యండమూరి సత్యనారాయణ ‘శ్రీవాత్సవ’ పేరుతో రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర వార పత్రికలో ప్రతి సంవత్సరం ఆయనచేసిన సాహిత్య సింహావలోకనాలు చాలా ప్రసిద్ధాలు. ఏ కారణం చేతనో కల్లూరి వేంకట నారాయణరావు 1928 ప్రాంతంలో కవిత్వవేది పేరుతో ఆంధ్ర వాజ్ఞ్మయ చరిత్ర సంగ్రహం రాశాడు. తనది ప్రచ్ఛన్న నామమే కాని బిరుదం కాదని చెప్పుకున్నారు. ఆకాశవాణి ఉద్యోగంలోనే జీవితం గడిపిన బాలాంత్రపు రజనీకాంతరావు వేరే పేర్లతో రచనలు చేశారు. సినిమాలకీ రాశారు. పోలీసు శాఖలో పనిచేసిన మోహనరావు స్పార్టకస్ పేరుతో నవలలు రాశారు. పోలీసు జీవితానికి సంబంధించిన వస్తువుతో ఆయన రచనలు చేశారు. మల్లయ్య పేరుతో పంపిన రచనలు తిరిగి వస్తే నవీన్ అని పేరు పెట్టుకున్నారు అంపశయ్య రచయిత.
రచయితలు అనేక రకాలుగా కలంపేర్లను ఎన్నుకోవడం కనిపిస్తుంది. 1. నక్షత్రాలు: ఆరుద్ర (ఆర్ధ్ర), జ్యేష్ఠ, అశ్విని, ఆశే్లష, 2. ప్రకృతి: సముద్రుడు, సూరీడు, ఓల్గా. 3. సంస్కృతి: అజంతా, ఎల్లోరా, అతిథి, 4. పురాణాలనుంచి: గాండీవి, త్రినేత్ర, విశ్వామిత్ర, 5.చరిత్రనుంచి: శాలివాహన, కౌటిల్యుడు, మల్క్భిరాం, స్పార్టకస్, 6.సాహిత్యంనుంచి: భాసుడు, భారవి, క్షేమేంద్రుడు, 7.గోత్రనామాలు: ఆత్రేయ, కౌండిన్య.
ఈ పద్ధతులు కాక మరికొన్ని పద్ధతులు కూడా కలం పేర్లలో కనిపిస్తాయి. పురుషులు స్ర్తిల పేర్లతో రాయడం వీటిలో ముఖ్యమైంది. పి.ఎన్. ఆచారి లల్లాదేవి పేరుతో రచనలు చేశారు. నటరాజన్ శారద పేరుతో రాశారు. పి.విజయకుమార్ భార్య సౌభాగ్య పేరుతో రచనలు చేస్తున్నారు. బీనాదేవి భిన్నమైన పేరు. భార్యాభర్తలు ఇద్దరూ రచయితలే. బి.నరసింగరావు సంక్షిప్త నామం ‘బిన’, భార్య పేరులో చివరి భాగం ‘దేవి’ కలిసి బీనాదేవి అయింది. రచయిత్రి ఆనందరామం పేరులో తన పేరు సగం భర్త పేరు సగం కలిసి ఉంది. ఇంటా బయటా అలవాటైన ముద్దు పేర్లే కలం పేర్లుగా పరిణమించడం కూడా కనిపిస్తుంది. శివరాజు వెంకట సుబ్బారావుకి బుచ్చిబాబు అని పేరు వచ్చిన తీరిది. దేవులపల్లి సుబ్బరాయ శాస్ర్తీ బుజ్జాయిగ మాత్రమే లోకానికి తెలుసు. ఇంట్లో మహబూబ్ అలీకి పెట్టిన ముద్దు పేరు అఫ్సర్. అదే అతని కలం పేరు అయింది. రచయితలు మారు పేర్లు పెట్టుకునే పద్ధతులు, పేర్లు మార్చుకునే పద్ధతులు అనేక రకాలుగా ఉంటాయి. అసలు పేరేమో అని భ్రమ కలిగించేటట్టుంటాయి కొన్ని మారుపేర్లు. కొమర్రాజు లక్ష్మణరావు క.రామానుజరావు పేరుతో కథలు రాశారు. సురవరం ప్రతాపరెడ్డి భావకవి రామమూర్తి పేరుతో రచనలు చేశారు. వేమరాజు భానుమూర్తి భాస్కరాచార్య పేరుతో రాశారు. అందమైన సమాసాలను కలం పేర్లుగా వాడుకున్న వాళ్లున్నారు. వరవరరావు కలం పేర్లలో ఒకటి చంద్రమల్లిక. జలదాంతశ్చంద్ర చపల చేకూరి రామారావు ఒక సందర్భంలో వాడిన పేరు. ఎవరో తెలియదు కాని మల్లీప్రియ నాగరాజు పేరుతో సాహిత్య విమర్శ చేశాడొకాయన. ఒకే పేరు ఇద్దరు రచయితలకు ఉన్నప్పుడు వాళ్లను గుర్త్తించడానికి వేరు వేరు పద్ధతులు అనుసరించడం కనిపిస్తుంది. ఇస్మాయిల్ పేరుతో ఇద్దరు రచయితల ప్రసిద్ధులు. ఒకరు స్మైల్ అయినాడు. ఒకే కుటుంబానికి సంబంధించిన వారైతే సీనియర్, జూనియర్ అని చేర్చడం కనిపిస్తుంది. సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, వేదం వేంకటశాస్ర్తీ జూనియర్ ఇలాంటివే. పూర్తిపేరుతోనే రచనలు చేసినా ఇంటిపేరుతో కొందరు రచయితలు ప్రచారంలో ఉంటారు. కందుకూరి, గురజాడ, దేవులపల్లి, విశ్వనాధ, అనిశెట్టి, గొల్లపూడి, మునిమాణిక్యం, ఏల్చూరి, దాశరథి, కుందుర్తి, కాళోజీ, కొవ్వలి, నార్ల, సలంద్ర ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. ఎలకూచి బాల సరస్వతి పదిహేడవ శతాబ్దపు తెలుగు వైయాకరణుడు. ఎలకూచి ఇంటిపేరుగల ఎలకూచి వెంకటరమణ ‘బాలసరస్వతి’ కలంపేరుగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.
శ్రీశ్రీ, ఆరుద్ర మొదలుకుని కలం పేరుతో ప్రసిద్ధులైన రచయితలెందరో ప్రత్యేక సందర్భాల్లో ఎన్నో మారుపేర్లతో వ్యాసాలు రాసి, శీర్షికలు నిర్వహించారు. ఒకేపత్రికలో వేరు వేరు శీర్షికలు నిర్వహించవలసి వచ్చినప్పుడు వేరు వేరు పేర్లను ఉపయోగించిన వాళ్లున్నారు. కొందరు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలం పేరు వాడారు. పండితుడు, విమర్శకుడు అక్కిరాజు ఉమాకాన్తమ్ 1913-14 మధ్య ‘ఆర్యుడు’ అనే పేరుతో త్రిలిఙ్గ పత్రికలో కథలు రాశారు.
తెలుగు సృజనాత్మక రచయితలలో ఎక్కువగా మారుపేర్లతో రచనలు చేసిన వాళ్లలో రాచకొండ విశ్వనాధ శాస్ర్తీని చెప్పుకోవాలి. రచయితలు రచనలు చేస్తున్న తొలినాళ్లలో ఆత్మవిశ్వాసం లేకపోవడంవల్లనో, బిడియం వల్లనో, ఆర్థిక కారణాల వల్లనో ఒకటి కంటే ఎక్కువ మారుపేర్లు ఉపయోగించడం సాధారణం. నిర్దిష్టంగా ప్రచారంలో లేని కలం పేర్లని అనిర్దిష్ట నామాలని అనవచ్చు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక అవసరాలను బట్టి ఉపయోగించుకునే పేర్లివి. వ్యక్తి నామరూపంలోని కలం పేర్లలాగా ఈ పేర్లు ప్రచారంలో ఉండవు. ఇటువంటి పేర్లు సాధారణంగా విశేషణాలై ఉంటాయి. పరిశోధన, విమర్శ, చర్చలు చేసే సందర్భాలలో లేఖకులు ఈ పద్ధతిని అవలంబిస్తారు. చర్చలలో తానెవరో తెలియకుండా ఉండడానికి రచయితలు ఉపయోగించే ప్రత్యేక సంజ్ఞలే అనిర్దిష్ట నామాలు. చర్చకు సంబంధించిన విషయాన్ని, కార్యక్షేత్రాన్ని, రాజకీయాలను, వృత్తిని, ప్రవృత్తిని, వర్గాన్ని, దృక్పథాన్ని, భావ జాలాన్ని, ఆసక్తిని, అభిరుచిని, నిరసనను, స్వభావాన్ని, వైయక్తిక స్థితిని సూచించేట్టు ఉంటాయి ఈ పేర్లు. పాత పత్రికలలో, రచయితల పట్టికలలో కనిపించే కలం పేర్లు కొన్ని ఉన్నాయి.
పరిశోధన, విమర్శ రంగాలలో విస్తృతంగా రాసేవాళ్లు, చర్చలు, వాదోపవాదాలు, ప్రతివాదాలలో పాల్గొనేళ్లు, వివిధ రంగాలలో పనిచేసే అవసరం ఉన్నవాళ్లు రకరకాలుగా మారుపేర్లను, విశేషణ రూపంలో పేర్లను ఉపయోగిస్తారు. చర్చలలో తీవ్రమైన ప్రతిస్పందనలు వ్యక్తం చేసేటప్పుడు పేరుమార్పు తప్పనిసరి అవుతుంది. వీటిని ఒకరకంగా ప్రచ్ఛన్న నామాలు అనవచ్చు. పండితుడు, పరిశోధకుడు, బహుభాషావేత్త, పాత్రికేయుడు తిరుమల రామచంద్రకు పదుల సంఖ్యలో పేర్లున్నాయి. నిరంతరం రాసే కె.వి.రమణారెడ్డి కూడా పదుల సంఖ్యలో పేర్లను ఉపయోగించుకున్నారు. పండిత పరిశోధకుడైన వేటూరి ప్రభాకర శాస్ర్తీ చాలా పేర్లతో రాశారు.
తెలుగు సాహిత్యంలో జంటకవుల సంప్రదాయం ఉంది. పూర్తిగా మారుపేర్లు కావు కాని ఇద్దరు కవుల పేర్లతో ఏదో ఒక సంబంధం కల పేర్లు కలిసి కవుల పేర్లు ఏర్పడతాయి. తిరుపతి వేంకట కవులు, వేంకట పార్వతీశ్వర కవులు, శేషాద్రి రమణ కవులు మొదలైన విధంగా అసలు పేర్లు పూర్తిగానో, పాక్షికంగానో కలిసి పేర్లు ఏర్పడతాయి. పింగళి కాటూరి కవులు వంటివి ఇంటిపేర్లతో ఏర్పడ్డపేర్లు. కవులు సోదరులైతే కొప్పరపు సోదర కవులు, ఆదిపూడి సోదరకవులు, కోట సోదర కవులులా పేర్లేర్పడతాయి. ఇద్దరి కంటే ఎక్కువమంది కవులు కలిస్తే గుంపు కవులు, సమూహ కవులు అనవచ్చు. సమూహ కవులు అందరినీ గుంపుగా గుర్తించే పేరు పెట్టుకుంటారు. నయాగరా కవులు, దిగంబర కవులు, పైగంబర కవులు, తిరుగబడు కవులు, విపశ్యన కవులు ఆధునిక తెలుగు సాహిత్యంలో కనిపించే సమూహ కవులు. పేర్ల తొలి అక్షరాలు కలిపి పెట్టుకున్న అద్వయం, భైకొ, శిరసుల చిక్కుముడి విప్పడం భవిష్యత్తరాల వారికి అంత సులభం కాదు. తెలుగులో మారుపేర్లు, కలం పేర్లను గురించి ఇంతవరకు తెలుసుకోగలిగింది చాలా తక్కువే. మరింత పరిశోధిస్తే మరెన్నో సాహిత్యపరమైన అంశాలు వెలికివచ్చే అవకాశాలున్నాయి. సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. కలం పేర్ల కథను వివరంగా, విస్తృతంగా తెలుసుకోగోరేవారు కె.పి.అశోక్‌కుమార్, ఎ.ఎన్.రాజు కూర్చిన గ్రంథం తెలుగులో మారుపేరు రచయతలు ప్రధాన భాగంలోకి వెళ్లాలి మరి. 

                                                                                         -కె.కె.రంగనాథాచార్యులు

                       

‘సెన్స్’లేని సినిమా!

** సెవెన్త్ సెన్స్
తారాగణం:
సూర్య, శృతీహాసన్
జానీ ట్రై న్యూయెన్ తదితరులు
సినిమాటోగ్రపీ: రవి కె. చంద్రన్
సంగీతం: హారిస్ జయరాజ్
నిర్మాణం: లక్ష్మీగణపతి ఫిలింస్
రెడ్‌జెయింట్, జెమిని ఫిలిం సర్క్యూట్
నిర్మాతలు: సుబ్రహ్మణ్యం బి., రూపేష్ వై.
సమర్పణ: ఉదయనిధి స్టాలిన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
ఎ.ఆర్.మురుగదాస్


‘గజిని’ లాంటి మెగాహిట్ తర్వాత ఆరేళ్లు ‘క్రాఫ్ట్ హాలిడే’ ప్రకటించుకున్న దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ మురిపిస్తూ తీసిన ‘సెవెన్త్ సెన్స్’ అర్జంటుగా ఓ పాఠం నేర్పుతోంది. ఎలాగైతే దర్శకులు ముందుగా కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకోకుండా, కళాత్మక సినిమాలకి సాహసించకూడదని అనుభవజ్ఞులంటారో, అలా 15-20 కోట్ల వ్యయాలతో రెగ్యులర్ వాణిజ్య సినిమాలు తీసే దర్శకులు అమాంతం 70-80 కోట్ల మెగా బడ్జెట్లకి వెళ్లే ముందు, ఒకటికి వేయిసార్లు బాగా ఆత్మపరిశీలన చేసుకోవాలని...అంతటి తాజ్‌మహళ్లు కట్టే సత్తా నిజంగా తమకుందా? గమ్మత్తేమిటంటే మళ్లీ ఈ మెగా వెంచర్స్ బోలెడన్ని కళాత్మక విలువల్నే డిమాండ్ చేస్తాయి. క్లాసిక్ హోదాని కోరుకుంటాయి. రెగ్యులర్ కమర్షియల్స్‌లా వాటిని చుట్టి పారెయ్యలేరు. అక్షరాలా 84 కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటున్న మురుగదాస్‌కి నిజంగా ‘సెవెన్త్‌సెన్స్’ తీసేంత స్థాయి ఉందా అంటే, దురదృష్టవశాత్తు లేదనే చెప్పుకోవాలి.
ఈ మధ్యే కేవలం 20 కోట్ల మినీ బడ్జెట్‌తో ‘నాన్న’ ఫేమ్ తమిళ యువ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ‘1947 ఎ లవ్‌స్టోరీ’ (మద్రాస పట్టినం) అనే పీరియడ్ ఫిలిం తీసి అన్ని విలువలతో-ఉత్తమ కథా కథనాలు, పాత్రలు, అభినయ ఆహార్యాలు, సంగీత సాహిత్య నాట్యాల, చిత్రీకరణా సాంకేతిక హంగులూ కలగలిపి మూడు గంటలపాటు ఒక అద్భుత కళాత్మక ప్రపంచంలో విహరింపచేశాడు. ఆర్టు అతడికి తెలుసు. ఆ ఆర్టుద్వారా ప్రేక్షకుల మనో ఫలకాల మీద బలమైన ముద్ర ఎలా వేసి వదలాలో కూడా తెలుసు. ఇందులో సగమైనా సాధించి ఉంటే మురుగదాస్ ధన్యుడయ్యేవాడు
ధన్యుడవ్వాల్సిన అవసరమెందుకంటే, అతను తలపెట్టింది తమిళ జాతి గర్వించే బౌద్ధ భిక్షువు బోధిధర్మ జీవిత చరిత్ర కాబట్టి. ఖచ్చితంగా బోధిధర్మ స్మృతికి నిజమైన నివాళి అర్పించాల్సిన బాధ్యత అతనికుంది. కానీ మరోసారి అతను బోధిధర్మని చంపడానికి ‘ఆపరేషన్ 84 క్రోర్స్’ చేపట్టి అమలుపరిచినట్టుంది. ఇందులో మాత్రం ఘనవిజయం సాధించాడు! తిరిగి ‘గజిని’ కాంబినేషన్ మురుగదాస్-సూర్య-హేరిస్ జయరాజ్‌ల ఈ హనన ప్రక్రియలో మొదటి కథా కాలం ఆరవ శతాబ్దం. పల్లవ యువరాజు బోధిధర్మ తల్లి కోరికపై భార్యాబిడ్డల్ని వదిలి చైనా ప్రయాణిస్తాడు. మార్షల్ ఆర్ట్స్, వైద్యం, హిప్నాటిజంలలో ప్రావీణ్యుడైన అతను చైనీయులకు వాటిని నేర్పి మహోన్నతుడవుతాడు. వాళ్లకి జెన్ (్ధ్యనం) నేర్పుతాడు. ఏదో మహమ్మారి గ్రామాన్ని కబళిస్తుంటే మూలికా వైద్యంతో రక్షిస్తాడు. గ్రామంపై దండెత్తిన బందిపోట్లకి కుంగ్‌ఫూతో దీటైన జవాబిస్తాడు. ఇక సెలవుతీసుకుంటానంటే ప్రాణత్యాగం చేయమంటారు ప్రజలు. అతను ఇక్కడి మట్టిలోనే కలిసిపోతే అతడి శక్తులు తమని రక్షిస్తాయని నమ్ముతారు. వాళ్ల విశ్వాసాన్ని మన్నించి విషం సేవిస్తాడు. సమాధి అయిపోతాడు. ‘దామో’గా ఆరాధ్య దైవమవుతాడు.
రెండవ కధా కాలానికొస్తే నేటి చైనా ఇండియా మీద ‘ఆపరేషన్ రెడ్’ సిద్ధం చేస్తుంది. బోధిధర్మ కాలంలోని మహమ్మారి వైరస్‌నే ఇండియాలో ప్రవేశపెట్టి మారణహోమం సాగించాలనుకుంటుంది. దీనికి విరుగుడు బోధిధర్మ వ్రాసిన గ్రంథంలోనే ఉంది కాబట్టి, దాన్ని అడ్డుపెట్టుకుని, ఇండియాని బ్లాక్‌మెయిల్ చేసి, అడ్డమైన పనులూ చేయించుకోవాలని కుట్ర పన్నుతుంది. అయితే చెన్నైలో బోధి ధర్మ జెనెటిక్ మెమొరీ మీద పరిశోధన చేస్తున్న రీసెర్చి స్టూడెంట్ ఈ ఆపరేషన్‌కి అడ్డు కావచ్చు కాబట్టి ఈమెని చంపడంతోపాటు అక్కడ వైరస్‌ని పరివ్యాప్తం చేయడానికి ఒక ఏజెంట్‌ని పంపుతుంది.
ఏజెంట్ డాంగ్‌లీ (జాన్ ట్రై న్యూయెన్) మార్షల్ ఆర్ట్స్, హిప్నాటిజంలలో కాకలు తీరిన యోధుడు. ఇతను చెన్నై వచ్చే ముందు, రీసెర్చ్ స్టూడెంట్ శుభ ( శృతీహాసన్) ఓ సర్కస్ కళాకారుడైన అరవింద్ (సూర్య)తో స్నేహం చేస్తుంది. అతను ప్రేమిస్తాడు. ఇది కాదనుకుని అసలు విషయం చెప్తుంది. మహోన్నతుడైన మన పూర్వీకుల వారసుల్ని పట్టుకోగలిగితే వాళ్ల జన్యువుల్లో నిద్రాణంగా ఆ మహోన్నతుల అంశని ప్రేరేపించవచ్చనీ, దాంతో తిరిగి ఆ మహోన్నతులు మనకి లభించినట్టు అవుతుందనీ వివరిస్తుంది. అరవింద్ బోధిధర్మ వారసుడని కనిపెట్టింది. ఇది విన్న అరవింద్ తనమీద ఏ ప్రయోగాలకైనా సిద్ధమేనంటాడు.
సరిగ్గా అప్పుడు డాంగ్‌లీ దిగబడి బయోవార్ ప్రారంభిస్తాడు. అంతుచిక్కని మరణాలతో నగరం అట్టుడికిపోతుంది. మరోవైపు శుభని వెతుకుతుంటాడు. అతడిన్ని అడ్డుకోగల శక్తి ఏదీ లేదు. హిప్నాటిజంతో పోలీసుల్ని పోలీసులతో కాల్పిస్తాడు. ట్రాఫిక్‌ని శుభ-అరవింద్‌లపైకి ఎగదోస్తాడు. నానా బీభత్సం సృష్టిస్తుంటాడు. ఇక ఇతడ్ని ఎదుర్కోవడానికి శుభ-అరవింద్‌లు ఏం చేశారన్నది మిగతా సినిమా.
ఈ సినిమా మొదటి ఇరవై నిముషాలూ మురుగదాస్‌ని ఉన్నతాసనం మీద కూర్చోబెడతాయి. చరిత్రని లోతుగా శోధించాడు. దానికి తెరమీద సమున్నతంగా అద్దం పట్టాడు. చైనీయులతో చైనా వాతావరణం, బోధిధర్మ పాత్రలో సూర్య అభినయం సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించాడు. ఇరవై నిముషాలూ ఇలా కట్టిపడేశాక, ఇక ఆ తర్వాత పాతాళంలోకీ, అథఃపాతాళంలోకీ జారిపోయాడు.
‘ఖలేజా’లో మహేష్‌బాబు తెలుగు నేటివిటీని వదిలేసి ఎక్కడో రాజస్థానీయుల సమస్యల గురించి పోరాడతాడు. మురగదాస్ సినిమాలో సూర్య చైనా వెళ్లి చైనీయులకోసం పాటుపడినా నేటివిటీ సమస్య రాదు. అది బోధిధర్మ చరిత్రే కాబట్టి. ఇలా నేటివిటీని జయించగలిగిన దాస్, తీరా నేటివిటీలోకొచ్చాక ‘బద్రినాథ్’ బాటపట్టిపోయాడు.
‘బద్రినాథ్’ మొదటి పదిహేను నిముషాలు దేవాలయాలు వర్సెస్ టెర్రరిజం ఎత్తుగడతో బ్రహ్మాండంగా సాగుతుంది. ఆ తర్వాత ఆ పాయింటునే మరిచిపోయి ఫార్ములా ప్రేమలోకి తిరగబెడుతుంది. చైనానుంచి చెన్నైకి కథ తీసుకువచ్చిన మురుగదాస్ కూడా ఇదే పోకడతో బోధిధర్మని మర్చిపోయాడు. ‘బద్రీనాధ్’లాగే ఫ్లాపయ్యాడు. అరవింద్ ఎంతకీ బోధిధర్మ అంశ పొందకుండా చివరి వరకూ డాంగ్‌లీ దాడులనుంచి తప్పించుకు పారిపోవడమే తంతుగా మారింది. క్లయిమాక్స్‌లో తప్ప అతడిమీద ప్రయోగం జరపదు. అంతసేపూ అరవింద్ ఓ లక్షణం, లక్ష్యం లేక సగటు జీవిగా పరాజితుడిగా తేలిపోయాడు.
ఇంతటి భారీ సినిమాని అడ్డంగా కుప్పకూల్చిన ప్రధానాంశం, అంతటి బిల్డప్‌తో ఎస్టాబ్లిష్ చేసిన బోధిధర్మ అవతారంగా వెంటనే సూర్యని చలనంలోకి తేకపోవడం. బోధి ధర్మ కేవలం ఉత్సవ విగ్రహంగా మిగిలిపోవడం. దర్శకుడు బోధి ధర్మ ఎవరో నేటితరం తమిళులకి తెలియనట్టూ, చైనీయులకి బాగా తెలిసినట్టు కొన్ని మగ్‌షాట్స్ వేశాడు. మరి తెలియని జాతికి తనేం తెలియజేశాడు ఈ సినిమా ద్వారా? అసలీ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? చైనా తలుచుకుంటే భారతీయులు పారిపోతారని, చైనీయుడు వచ్చి స్వైరవిహారం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పీకలేదనీ, బయో వార్‌కి బెంబేలెత్తిపోయి దేశాన్ని శవాల కుప్పగా మార్చుకుంటుందనీ (బయోవార్‌ని ఎదుర్కొనట్టు, ఆపినట్టు ఎక్కడా చూపించకుండానే ముగించాడు) ప్రచారం చేయడానికే ఉదయనిధి స్టాలిన్‌ని అడిగి 84 కోట్లు పొందినట్లుంది. బోధిధర్మ శమించుగాక!
శృతీ హాసన్ ఫ్రెష్‌గా ఉంది. ఆడేపాడే బొమ్మలా కాకుండా ఆమెకి పనిగల మంచి పాత్రే దొరికింది. డాంగ్‌లీ పాత్రధారి వియత్నాం నటుడు జానీ ట్రై న్యూయెన్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. సైలెంట్ విలన్‌గా అతను కన్పించిన దృశ్యాలకే ప్రేక్షకులు గంగవెర్రు లెత్తిపోతున్నారు. తర్వాత నీరసించి పోతున్నారు- ఒక్క పాపులర్ బాణీని ఇవ్వలేని హేరిస్ జయరాజ్‌నీ, చివర్లో తప్ప ఒక ఫైట్ కూడా చెయ్యని యాక్షన్ స్టార్ సూర్యనీ చూసి! కళాత్మక విలువలు, మంచి విజువల్స్, క్లాసిక్ టచ్ కొంతైనా కనబర్చని విఫలమైన సాధారణ మేకింగ్ ఈ 84 కోట్ల మెగా వెంచర్. -వీనస్

అంతరిక్షంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం!

వాషింగ్టన్, నవంబర్ 7: అంతరిక్షంలో అత్యంత కాంతివంతమైన, అతి తక్కువ వయసుగల నక్షత్రాన్ని కనుగొన్నట్లు ఖగోళ శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు. దీంతో విశ్వంలో ఈ తరహా అత్యంత కాంతివంతమైన నక్షత్రాలు ఇప్పటివరకు తాము ఊహిస్తున్న దానికన్నా కూడా సాధారణంగా ఏర్పడుతూ ఉండవచ్చని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. ‘జె 1823-3021ఎ’గా పేరుపెట్టిన అత్యంత వేగంగా పరిభ్రమించే ఈ నక్షత్రాన్ని భూమికి దాదాపు 27వేల కాంతి సంవత్సరాల దూరంలో ‘గ్లోబులర్ క్లస్టర్’గా పిలవబడే నక్షత్ర రాశి మధ్యలో కనుగొన్నారు. అత్యంత శక్తివంతమైన గామా కిరణాలను వెదజల్లుతున్న ఈ నక్షత్రాన్ని శాస్తజ్ఞ్రులు నాసాకు చెందిన ఫెర్మి గామా రే స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి అధ్యయనం చేసారు. ఈ పల్సర్ నక్షత్రం వయసు 2 కోట్ల యాభై లక్షల సంవత్సరాలుగా శాస్తజ్ఞ్రులు అంచనా వేస్తున్నారని, ఇలాంటి నక్షత్రాల్లో ఇదో చిన్న శిశువు లాంటిదని, ఎందుకంటే మిల్లీ సెకండ్ పల్సర్‌లు వందకోట్ల సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయసు కలిగినవే ఎక్కువ అని ‘లైవ్ సైన్స్’ మ్యాగజైన్ తెలిపింది. నక్షత్ర విస్ఫోటనాలు (సూపర్ నోవా)లు సంభవించి భారీ నక్షత్రాలు అంతమైనప్పుడు వాటినుంచి సూర్యుడి సైజులో పదార్థాలు శూన్యంలోకి వెదజల్లబడతాయి. అవి శూన్యంలో పరిభ్రమిస్తూ తిరిగి న్యూట్రాన్ నక్షత్రాలుగా ఏర్పడుతుంటాయి. వీటినే ‘పల్సర్స్’ అంటారు. ఈ పల్సర్‌లు అత్యంత వేగంగా పరిభ్రమిస్తూ ఉండడమే కాకుండా లైట్‌హౌస్ వెలుగంత కాంతివంతమైన వెలుగును తమ చుట్టూ వెదజల్లుతుంటాయి. అత్యంత శక్తివంతమైన ఇలాంటి మిల్లీసెకండ్ పల్సర్‌లు ఇంతకుముందు అనుకున్నదానికన్నా ఎక్కువ స్థాయిలోనే ఏర్పడుతూ ఉండవచ్చని, ఒక్క గ్లోబులర్ క్లస్టర్‌లోనే కాకుండా విశ్వంలోని మిగతా నక్షత్ర రాశుల్లో కూడా ఏర్పడుతూ ఉండవచ్చని పరిశోధకుల బృందం నాయకుడు, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రేడియో అస్ట్రానమీకి చెందిన పావ్లో ప్రీరి చెప్పారు.

ఒమన్ సముద్రంలో భారతీయ నౌక మునక

-అయిదుగురు మృతి, తొమ్మిది మంది గల్లంతు
దుబాయి, నవంబర్7: దక్షిణ ఒమన్ తీరానికి దగ్గర్లో భారతీయ నౌక ఒకటి మునిగిపోవడంతో అయిదుగురు భారతీయ సెయిలర్లు మృతి చెందగా మరో 9 మంది జాడ తెలియరాలేదు. ‘ఎంఎస్‌వి శివ్‌సాగర్’ అనే ఈ నౌక శనివారం ఒమన్‌లోని దక్షిణ ధోఫర్ ప్రాంతానికి దగ్గర్లో సముద్రంలో మునిగిపోయింది. ఒమన్ కోస్ట్‌గార్డ్, నౌకాదళానికి చెందిన నౌకలు సహాయక చర్యలు చేపట్టి ఆరుగురిని రక్షించాయని, అయితే మరో తొమ్మిదిమంది జాడ తెలియడం లేదని ‘గల్ఫ్ న్యూస్’ పత్రిక తెలిపింది. ఈ వారంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ధోఫర్ ప్రాంతం అతలాకుతలమైంది. జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, నౌకలు కూడా మరో 24 గంటల పాటు సముద్రంలోని పరిస్థితిని గమనిస్తూ ఉండాలని వాతావరణ విభాగం శుక్రవారం హెచ్చరించింది కూడా. జాడ తెలియకుండా ఉన్న సెయిలర్లను కెప్టెన్ ప్రభులాల్, ఇంజనీర్ సురేష్, లాల్జీ, భరత్, మోహన్ మెహతా, అష్రాఫ్ అసమ్, యూసుఫ్ సమారా, సులేమాన్ హాజీ సుమారా, హుస్సేన్ సుమారాలుగా గుర్తించారు. కాగా, కాపాడిన సెయిలర్లను పోలీసు స్టేషన్‌లో బంధించడం వింతగా ఉందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా తాము భారత దౌత్య కార్యాలయాన్ని కోరుతున్నామని ఇండియన్ సోషల్ క్లబ్ వెల్ఫేర్ సెక్రటరీ పిఎం జబీర్ చెప్పినట్లు ‘గల్ఫ్‌న్యూస్’ తెలిపింది.

పరువు పోకూడదు ... సర్కారు పడకూడదు

-అవిశ్వాసంపై బాబు వ్యూహ రచన
-జగన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే కష్టమన్న ఆందోళన
- సీనియర్లతో బాబు మంతనాలు



హైదరాబాద్, నవంబర్ 7: ‘ప్రభుత్వం నిలబడాలి. అదే విధంగా మన పరువు నిలబడాలి. ఈ లక్ష్యంతో అవిశ్వాస తీర్మానంపై ఆలోచన చేయండి’ అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్లకు సూచించారు. ‘మేం అనుకున్నట్టుగా జరిగి, జగన్ బలం ప్రస్తుతం ఉన్న బలానికే పరిమితం అయితే మేం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా ప్రభుత్వం నిలబడుతుంది. అదే సమయంలో మా పరువు నిలబడుతుంది. మాకు కావలసింది ఇదే’ అని టిడిపి నాయకులు చెబుతున్నారు. అలా కాకుండా జగన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే ఎలా? అనే సందేహమే అవిశ్వాస తీర్మానంపై ఆచితూచి వ్యవహరించేట్టు చేస్తోందని టిడిపి సీనియర్ నాయకులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు రాగానే చంద్రబాబు వివిధ సందర్భాల్లో పార్టీ సీనియర్లతో అవిశ్వాస తీర్మానంపై చర్చించినట్టు తెలిసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికి సవాలుగా మారాయి. తప్పనిసరిగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలి. ఒకవేళ ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఒత్తిడి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిపై ఎక్కువవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టిడిపి అధ్యక్షుడు అవిశ్వాస తీర్మానం గురించి సీమాంధ్ర టిడిపి నాయకులతో, తెలంగాణ నాయకులతో విడివిడిగా మంతనాలు జరిపారు. ‘మాకున్న అంచనా ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వం పడిపోదు. మాకు కావలసింది కూడా అదే. ఆ కోణంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అభిప్రాయమే పార్టీలో బలంగా వినిపిస్తోంది’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ‘హఠాత్తుగా ప్రభుత్వం పడిపోయి, మధ్యంతర ఎన్నికలు వస్తే ఎదుర్కొనే స్థితిలో టిడిపి లేదు. కాంగ్రెస్ లేదు. అలా అని అవిశ్వాస తీర్మానం పెట్టకుండా వౌనంగా ఉంటే కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కు అయ్యాయనే ప్రచారానికి వీలు కల్పించినట్టు అవుతుంది’ అని టిడిపి సీనియర్ నాయకుడొకరు తెలిపారు. తెలంగాణ సమస్య అలానే ఉండగా, ఈ పరిస్థితిలో తాము ఎన్నికలకు వెళితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి, కోస్తాంధ్రలో జగన్‌ను ఎదుర్కొని అధికారంలోకి రావడం అంత సులభం కాదని టిడిపి నాయకులు చెబుతున్నారు. టిడిపి అంచనా ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంటుంది. పార్టీ నుండి కొంత మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తరువాత ఇప్పుడు టిడిపిలో 80 మంది ఉన్నారు. వీరితో పాటు జగన్ వర్గం, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారని టిడిపి నాయకులు తెలిపారు. సిపిఐ, సిపిఎం పార్టీల నుండి టిడిపికి అందిన సమాచారం ప్రకారం ఆ రెండు పార్టీల సభ్యులు అవిశ్వాస తీర్మానం చర్చలో ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వానికి వ్యితిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా లేరని టిడిపి నాయకులు తెలిపారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని, దీని వల్ల స్వల్ప మెజారిటీతో అయినా ప్రభుత్వం నిలబడుతుందని టిడిపి అంచనా వేస్తోంది. జగన్ బలం ఇప్పుడున్న దాని కన్నా పెరగదు అని టిడిపి అంచనా వేస్తోంది. ఇదే విధంగా తాము అనుకున్నట్టుగా జరిగితే అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనే విమర్శను తిప్పికొట్టడానికి అవకాశం లభిస్తుందని టిడిపి నాయకులు తెలిపారు. దీంతో పాటు తెలంగాణ కోసం ఇంత హడావుడి చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు చివరకు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తే తాము వారిని తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి ఉపయోగపడుతుందని తెలంగాణ టిడిపి నాయకులు చెబుతున్నారు.
‘అయితే ఇదంతా మేము అనుకున్నట్టు జరిగితే ఫరవాలేదు. అలా కాకుండా జగన్ రంగంలోకి దిగి ఎన్నికల్లో ఖర్చును భరించి తిరిగి గెలిపించే బాధ్యత నాది అని మరో పది మంది ఎమ్మెల్యేలను తనవైపు మార్చుకుంటే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అది మాకు ఇబ్బందికరంగా మారుతుంది’ అని టిడిపి నాయకులు చెబుతున్నారు. జగన్‌కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇంతకు మించి పెరిగే అవకాశం లేదని భావిస్తున్నామని, అయితే నిజంగా అవిశ్వాస తీర్మానం పెట్టి ఓటింగ్ జరిగే పరిస్థితి వచ్చినప్పుడు జగన్ మరో పది మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటే ఎలా? అనే ప్రశ్న తమ చర్చల్లో వచ్చిందని పార్టీ నాయకులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారా? లేదా? చూడాలి, నిజంగానే ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తే అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని సీనియర్లతో జరిగిన చర్చలో చంద్రబాబు తెలిపారు.

స్వరం మారుతోంది

టి.కాంగ్రెస్‌లో సరికొత్త సమీకరణలు నిన్నటి వరకు తెలంగాణ ఏర్పాటే పరిష్కారమన్న నేతలు నేడు సమైక్యానికే అధిష్ఠానం నిర్ణయించినా అభ్యంతరం లేదన్న అభిప్రాయం ఎంపీల వైఖరిలో మాత్రం కానరాని మార్పు

హైదరాబాద్, నవంబర్ 7: ‘తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే’ అంటూ నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల స్వరం క్రమంగా మారుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో సమీకరణలు మారుతుండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గళాలు కూడా మారుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోను తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని, ప్రత్యేక తెలంగాణ తప్ప మరో పరిష్కారం లేదని చెప్పిన గొంతులే ఇప్పుడు సమైక్యాంధ్రనే కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయించినా అభ్యంతరం లేదని అంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల వైఖరిలో మార్పు వస్తున్నా పార్లమెంటు సభ్యులు మాత్రం అదే పట్టుదలతో ఉన్నారు.
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రాజకీయంగా కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో మార్పు తెచ్చాయి. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసినా, సమైక్యాంధ్రనే కొనసాగించినా ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే ఆ పదవి తనకే దక్కుతుందన్న అభిప్రాయంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రాజీనామాలు తదితర వ్యవహారాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశాల్లో చర్చకు వచ్చినపుడు ‘నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, రాజీనామా చేస్తే ఎలా’ అని జానారెడ్డి అనే వారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులు స్వామిగౌడ్ తదితరులు జానారెడ్డిని కలిసి రాజీనామా చేయాలని కోరినపుడు కూడా ఆయన అదే విధంగా స్పందించారు. అయితే ప్రత్యేక తెలంగాణవాదిగా ముద్రపడ్డ జానారెడ్డికి సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అధిష్ఠానం అంగీకరిస్తుందా అన్న అనుమానాలు కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపించాయి. ఇంతలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు శాసనమండలి సభ్యత్వాన్ని అధిష్ఠానం ఇచ్చింది. దీంతో ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే శ్రీనివాస్‌కే అవకాశం లభించవచ్చన్న ఊహాగానాలు కాంగ్రెస్ వర్గాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో జానారెడ్డి కూడా తన వైఖరిని మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘చారిత్రక కోణంలో గాని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా గాని అధిష్ఠానం ఆలోచించి సమైక్యాంధ్రనే కొనసాగించాలని నిర్ణయించినా అభ్యంతరం లేదు’ అని శనివారం తిరుపతిలో మంత్రి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ నాయకుల్లో కలకలం సృష్టించాయి. తెలంగాణవాదిగా తనపై పడ్డ ముద్రను చెరుపుకునేందుకే జానారెడ్డి ఆ విధంగా వ్యాఖ్యానించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో మొదట్లో అగ్రభాగంలో ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల జానారెడ్డితో పడకపోవడంతో క్రమంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘానికి దూరమయ్యారు. పలు సందర్భాల్లో జానారెడ్డికి వ్యతిరేకంగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టయినా తెలంగాణను సాధిస్తామని ప్రకటించిన దామోదర్ వైఖరిలో ఇటీవల కొంతమార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో అనుసరించిన వైఖరికి భిన్నంగా తెరాసపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా కూడా దామోదర్‌రెడ్డిలో కొంత మార్పుకు కారణమై ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలంగాణ ఉద్యమం పేరుతో రెండు నెలల పాటు సచివాలయానికి దూరంగా ఉన్న తెలంగాణ మంత్రుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మెను విరమించుకోవడం, తెలంగాణ మంత్రులు సచివాలయానికి వచ్చినా అడ్డుకోబోమని సచివాలయ తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులు ప్రకటించడం తెలిసిందే. వీటికి తోడు అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాలతో తెలంగాణ మంత్రులు తమ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నా తెలంగాణ మంత్రులు తమతమ జిల్లాల్లో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పలు సందర్భాల్లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మెకు మద్దతు కూడా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం గురించి అధిష్ఠానవర్గానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని విమర్శించారు. అటువంటిది ఆ ఎమ్మెల్యేలే సకల జనుల సమ్మెను విరమించుకోవాలంటూ పదేపదే తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేయడం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూండటం విశేషం. మొదట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉమ్మడిగా వ్యవహరించగా ఆ తర్వాత పార్లమెంటు సభ్యులకు ఎమ్మెల్యేలు దూరమై ముఖ్యమంత్రికి దగ్గరయ్యారు. రచ్చబండను వ్యతిరేకించాలని పార్లమెంటు సభ్యులు పిలుపు ఇవ్వగా రచ్చబండలో పాల్గొంటామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా మాటే ఎత్తడం లేదు. వీరిలో వచ్చిన మార్పునకు అధిష్ఠానం ఆదేశాలు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.